కొత్తూరు, ఏప్రిల్ 29:కొత్తూరు మున్సిపాలిటీ ఎన్నికలకు కొన్ని గంటల్లో పోలింగ్ జరుగునుంది. ఇందు కోసం అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. కొత్తూరులో మొత్తం 12 వార్డులకు గాను 12పోలింగ్ కేంద్రాలు ఏర్పా టు చేశారు. ఒక్కో కేంద్రానికి ఐదుగురు అధికారులను నియమించారు. పోలింగ్ ఆఫీసర్-1, ఏపీవో-1,ఓపీవోలు-3 చొప్పును ఒక్కో పోలింగ్ కేంద్రంలో విధులు నిర్వహించనున్నారు. మొత్తం 60 మంది పనిచేయనున్నారు. అయితే కరోనా వ్యాప్తి పేపథ్యంలో మరో 25 మందిని రిజర్వ్లో ఉంచామని ఇన్చార్జి మున్సిపల్ కమిషనర్ జ్యోతి తెలిపారు. వృద్ధుల కోసం మొత్తం 32 పోస్టల్ బ్యాలెట్లను పంపిణీ చేశారు. శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగునుంది.
మొత్తం ఓటర్ల సంఖ్య 8,222
కొత్తూరు మున్సిపాలిటీలో పురుషఓటర్లు 4,176 మంది కాగా మహిళా ఓటర్లు 4,044 మంది ఉన్నారు. ఇతరులు ఇద్దరు ఉన్నారు. మొత్తం ఓటర్లు 8,222 మంది ఉన్నారు.కొత్తూరు జడ్పీహెచ్ఎస్లో 8, తిమ్మాపూర్లో 2, స్టేషన్ తిమ్మాపూర్లో 1, కుమ్మాగూడ 1 చొప్పున మొత్తం 12 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 24 బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ సామగ్రిని ఎన్నికల సిబ్బందికి గురువారం పంపిణీ చేశారు.
రెండు సార్ల్లు పర్యవేక్షణ
స్టేట్ ఎలక్షన్ అబ్జర్వర్ శ్రీధర్, అడిషనల్ కలెక్టర్ ప్రతీక్జైన్ ఇప్పటికే రెండు సార్లు కొత్తూరును సందర్శించి పోలింగ్ కేంద్రాలను పరిశీలించి అక్కడ చేస్తున్న ఏర్పాట్లను చూసి అధికారులకు తగు సూచనలు చేశారు. కరోనా నేపథ్యంలో తీసుకుంటున్న చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. మెడికల్ క్యాంపు, సోషల్ డిస్టెన్స్, తదితర ఏర్పాట్లపై వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఎన్నికల విధుల్లో130మంది పోలీసులు
శంషాబాద్ జోన్ డీసీపీ ప్రకాశ్రెడ్డి, షాద్నగర్ ఏసీపీ కుషల్కర్ పర్యవేక్షణలో 130 మంది పోలీసులు ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారని సీఐ శ్రీధర్ తెలిపారు. ఇందులో ఇన్స్పెక్టర్లు ఏడుగురు,ఎస్ఐలు 18 మంది, కానిస్టేబుళ్లు 120 మంది ఉన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలతో పాటు ప్రత్యేక నిఘా ఉంటుదని సీఐ చెప్పారు. ఓటర్ల ఎలాంటి ప్రలోభాలకు గురికావద్దని, ఎవరైనా ప్రలోభాలకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నిరంతరం పెట్రోలింగ్ చేస్తున్నామని స్పష్టం చేశారు. అంతేకాకుండా ప్రతి ఓటరు స్వేచ్ఛగా ఓటింగ్లో పాల్గొనాలని ఆయన కోరారు.