రంగారెడ్డి, మే 28, (నమస్తే తెలంగాణ) : కరోనా మహమ్మారిని పూర్తిగా కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టింది. కరోనా బారిన పడిన వారికి గాంధీ దవాఖానతోపాటు జిల్లాలోని కొండాపూర్ జిల్లా వైద్యశాల, వనస్థలిపురంలోని ఏరియా దవాఖాన, మహేశ్వరం, రాజేంద్రనగర్, షాద్నగర్, చేవెళ్ల ప్రభుత్వాసుపత్రుల్లో ఏర్పాటు చేసిన కొవిడ్ కేర్ కేంద్రాల్లోనూ కొవిడ్ బాధితులకు చికిత్స అందిస్తున్నారు. అయితే ఆక్సిజన్ లెవల్స్ పడిపోయి, సీరియస్ అయిన కొందరు ప్రైవేట్ దవాఖానలను కూడా ఆశ్రయిస్తున్నారు. ఇదే అవకాశంగా భావిస్తున్న ఆ వైద్యశాలలు అందినకాడికి దోచుకుంటున్నాయి. ఎంతో మంది స్వచ్ఛందంగా ముందుకు వస్తూ ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సట్రేటర్లు, నిత్యావసర వస్తువులను ఉచితంగా అందిస్తూ మానవత్వం చూపుతుంటే ప్రైవేట్ వైద్యశాలల నిర్వాహకులు మాత్రం పేదల రక్తాన్ని పీలుస్తున్నారు.
కొవిడ్ చికిత్స కోసం ప్రైవేట్ దవాఖానకు వెళ్లారంటే చాలు తమకున్న ఆస్తులను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అడిగినంత డబ్బులు చెల్లించినా ప్రాణం దక్కని పరిస్థితి దాపురించింది. కొందరు తన వాళ్ల ప్రాణాలే పోయిన తర్వాత ఇంకేమీ చేయాలంటూ బాధతో అడిగినంతా డబ్బులు చెల్లించి వెళ్తుండగా.. మరికొందరు మాత్రం ప్రభుత్వ నిబంధనలేమున్నాయి.. మీరు అధిక డబ్బులు ఎందుకు వసూలు చేస్తున్నారు.. చికిత్సలో భాగంగా ఏయే మందులు ఇచ్చారో బిల్లులివ్వాలంటూ యాజమాన్యాలను నిలదీయడంతోపాటు ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తున్నారు. ఈ విధంగా ప్రభుత్వానికి అధిక డబ్బులు వసూలు చేస్తున్న ప్రైవేట్ దవాఖానలపై ఫిర్యాదులు రావడంతో విచారణ చేపట్టి చర్యలకు రంగం సిద్ధం చేసింది.
ఓ ప్రైవేట్ దవాఖాన లైసెన్స్ రద్దు..
కొవిడ్ చికిత్సలో భాగంగా అధిక డబ్బులు వసూలు చేస్తున్న జిల్లాలోని ప్రైవేట్ దవాఖానలపై ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా వైద్యారోగ్య శాఖ చర్యలు చేపట్టింది. బాధితుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు అధిక డబ్బులు వసూలు చేస్తున్న ఓ ప్రైవేట్ వైద్యశాలకు సంబంధించి కొవిడ్ లైసెన్స్ను రద్దు చేయడంతోపాటు మరో 20 ప్రైవేట్ ఆసుపత్రులకు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. అధిక డబ్బులు వసూలు చేశారంటూ వచ్చిన ఫిర్యాదుతో విచారణ చేపట్టడంతోపాటు జిల్లాలో ఆదిత్య ఆసుపత్రికి నాలుగు రోజుల క్రితం జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు నోటీసులు కూడా జారీ చేశారు. అయితే సంబంధిత వైద్యశాల నిర్వాహకులు అధిక డబ్బుల వసూలుపై వివరణ ఇచ్చినప్పటికీ సంతృప్తి చెందని జిల్లా వైద్యారోగ్య శాఖ ఆ ఆసుపత్రిపై చర్యలు తీసుకుంది. కొవిడ్ చికిత్స లైసెన్సును రద్దు చేస్తూ ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
మరోవైపు ఎల్బీనగర్ సర్కిల్ పరిధిలో నాలుగు రోజుల క్రితం జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డా.స్వరాజ్యలక్ష్మి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కొవిడ్ చికిత్సకు అధిక డబ్బులు వసూలు చేస్తుండడంతోపాటు ఎలాంటి అనుమతిలేకుండానే కొవిడ్ చికిత్స అందిస్తున్నట్లు గుర్తించిన రైజ్ చిల్డ్రన్ ఆసుపత్రి, సెవెన్ హిల్స్, ఓమ్ని, ఆరెంజ్, పద్మ డయాగ్నోస్టిక్ ఆసుపత్రులకు నోటీసులు జారీ చేశారు. అయితే పద్మ డయాగ్నోస్టిక్ నిర్వాహకులు ఎలాంటి అనుమతిలేకుండానే కొవిడ్ చికిత్స అందిస్తున్నట్లు గుర్తించిన జిల్లా వైద్యారోగ్య శాఖ నోటీసులు జారీ చేసింది. అయితే నేడో, రేపో సంబంధిత డయాగ్నోస్టిక్పై తగు చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమయ్యారు. జిల్లాలోని మరో 15 ప్రైవేట్ దవాఖానలు అధిక డబ్బులు వసూలు చేస్తున్నాయనే ఫిర్యాదులతో గురువారం షోకాజు నోటీసులు జారీ చేశారు. పొంతనలేని వివరణ ఇచ్చినట్లయితే సంబంధిత ఆసుపత్రుల కొవిడ్ లైసెన్సులను రద్దు చేయడంతోపాటు జరిమానా విధించే అవకాశాలున్నాయి.
రోజుకు రూ.లక్ష ..
కొవిడ్ చికిత్స నిమిత్తం ప్రైవేట్ దవాఖానలకు వెళ్లే వారి నుంచి రోజుకు రూ.లక్ష వసూలు చేస్తున్నట్లు బాధితుల నుంచి జిల్లా వైద్యారోగ్య శాఖకు ఫిర్యాదులు వస్తున్నాయి. అంతేకాకుండా దవాఖానలో డబ్బులు చెల్లించిన తర్వాతనే చికిత్స ప్రారంభిస్తున్నారు. చికిత్సకు సంబంధించి బాధితుల కుటుంబ సభ్యులు ప్రశ్నించినా సమాధానం దాటవేస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ప్రభుత్వం జారీ చేసిన 248 ఉత్తర్వుల ప్రకారం ప్రైవేట్ ఆసుపత్రులు ఐసోలేషన్ సాధారణ వార్డులో చికిత్సకు రోజుకు రూ.4వేలు, ఐసీయూ వార్డులో రోజుకు రూ.7500, ఐసీయూతోపాటు వెంటిలేటర్తో కూడిన చికిత్సకు రోజుకు రూ.9 వేలు మాత్రమే ఫీజు తీసుకోవాలి. దీంతోపాటు పీపీఈ కిట్స్కు, కొవిడ్ పరీక్షకు రూ.2200, సీటీ, పీఈటీ, ఎంఆర్ఐ స్కాన్లకు మాత్రమే అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే జిల్లాలోని క్నొ ప్రైవేటు దవాఖానలు ప్రభుత్వ నిబంధనలను, ఉత్తర్వులను పాటించకుండా ఇష్టానుసారంగా అధిక డబ్బులు వసూలు చేస్తున్నారు. వీటిపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది.
అధిక డబ్బులు వసూలు చేస్తే చర్యలు..
ప్రజల అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని అధిక డబ్బులు వసూలు చేస్తే సంబంధిత ప్రైవేట్ దవాఖానల లైసెన్సులను రద్దు చేయడంతోపాటు కఠిన చర్యలు తీసుకుంటాం. అధిక డబ్బులు వసూలు చేసిన ఓ ప్రైవేట్ ఆసుపత్రి కొవిడ్ లైసెన్స్ను రద్దు చేయడంతోపాటు పలు వైద్యశాలలకు నోటీసులు జారీ చేశాం. ఏ ప్రైవేట్ ఆసుపత్రిలోనైనా ఎక్కువ డబ్బులు డిమాండ్ చేసినట్లయితే 9912990123 నెంబర్కు వాట్సప్ చేయడంతోపాటు జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసి హెల్ప్లైన్ నంబర్లు 040-23230811, 23230813, 23230814, 23230817లకు ఫిర్యాదు చేయవచ్చు.
– జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డా.స్వరాజ్యలక్ష్మి