రంగారెడ్డి మార్చి 27, (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం అంతర్జిల్లా బదిలీలకు గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతో అందరి దృష్టి జిల్లా వైపే పడింది. రంగారెడ్డి జిల్లా హైదరాబాద్కు ఆనుకొని ఉండడంతోపాటు విద్య, వైద్యం తదిత ర సౌకర్యాలన్నీ కూతవేటు దూరంలోనే ఉండడంతో జిల్లాకు బదిలీపై వచ్చేందుకు తీవ్ర పోటీ ఉంటుంది. అంతేకాకుండా రంగారెడ్డి జిల్లా శివారు ప్రాంతమంతా హైదరాబాద్లో కలిసిపోవడం, హైదరాబాద్కు 50 కిలోమీటర్లలోపు జిల్లా పరిధి ఉండడంతో స్థానికేతరులు జిల్లాకు వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. అంతర్జిల్లా బదిలీల్లో భాగంగా వచ్చే స్థానికేతరుల్లో స్పౌస్ కేసులతోపాటు మెడికల్ సంబంధ కేసులను మాత్రమే విద్యాశాఖ అనుమతించనుంది. విద్యాశాఖ చేపట్టే ప్రతీ బదిలీ సమయంలోనూ జిల్లాకు వచ్చేందుకు స్థానికేతర ఉపాధ్యాయుల మధ్య పోటీ తీవ్రంగా ఉంటుంది. విద్యాశాఖ నిబంధనల మేరకు జిల్లాస్థాయి పోస్టుల్లో 80 శాతం స్థానికులకు రిజర్వ్ చేయగా, స్థానికేతరులకు 20 శాతానికి మించకూడదని నిబంధనలను రూ పొందించారు.
గతంలో స్థానికేతర ఉపాధ్యాయులు 45 శాతం వరకు పెరగడంతో తిరిగి వారి వారి సొంత జిల్లాకు బదిలీ చేశారు. తదనంతరం జిల్లాలో 20 శాతం మాత్రమే స్థానికేతర ఉపాధ్యాయులు కొనసాగుతూ వస్తున్నారు. సంబంధిత 20 శాతం స్థానికేతరుల్లోనూ చాలా మంది ఉపాధ్యాయులు పదవీ విరమణ పొందిన దృష్ట్యా సుమారు 500 లకుపైగా స్థానికేతర ఉపాధ్యాయులు అంతర్ జిల్లా బదిలీల్లో భాగంగా జిల్లాకు బదిలీపై వచ్చే అవకాశాలున్నాయి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అంతర్ జిల్లా బదిలీలకు సంబంధించి పూర్తి మార్గదర్శకాలు అందిన వెంటనే బదిలీల ప్రక్రియను చేపట్టేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు సిద్ధంగా ఉన్నారు. ముందుగా జిల్లాలో ఉన్న ఉపాధ్యాయుల్లో స్థానిక, స్థానికేతర ఉపాధ్యాయులు ఎంత మంది ఉన్నారనేది లెక్క తేల్చేందుకు జిల్లా విద్యాశాఖ నిర్ణయించింది.
ఏ మండలంలో ఎంత మంది స్థానిక, స్థానికేతర ఉపాధ్యాయులున్నారనే వివరాలను సేకరించనున్నారు. అయితే జిల్లాలో స్కూల్ అసిస్టెంట్స్, ఎస్జీటీలు, భాషా పండితులు, పీఈటీలు ఇలా అందరూ కలిపి మొత్తం 5500లకుపైగా ఉపాధ్యాయులున్నారు. స్థానికేతరుల కోటాలో భాగంగా జిల్లాలో సుమారు 1100 మంది స్థానికేతర ఉపాధ్యాయులు పనిచేసేందుకు అవకాశాలున్నాయి. స్థానికేతర ఉపాధ్యాయులు ఎంత మంది ఉన్నారనేది లెక్క తేల్చిన అనంతరమే జిల్లాకు ఎంత మంది అంతర్ జిల్లా బదిలీల్లో భాగంగా వచ్చే అవకాశాలున్నాయనేది తేలనుంది. విద్యాశాఖతోపాటు ఇతర శాఖలోనూ స్థానికేతరులు జిల్లాకు బదిలీపై వచ్చేందుకు ఎదురుచూస్తున్నారు. మరోవైపు బదిలీలు, పదోన్నతులకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతో ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.
విద్యాశాఖలో 300ల మందికిపైగా పదోన్నతులు…
ప్రభుత్వం పదోన్నతులకు పచ్చజెండా ఊపడంతో ఆ దిశగా విద్యాశాఖ కసరత్తు చేస్తున్నది. రెవెన్యూ శాఖతోపాటు మరికొన్ని శాఖల్లో పదోన్నతుల ప్రక్రి య పూర్తికాగా విద్యాశాఖలో పెండింగ్లో ఉంది. తాజాగా ప్రభుత్వం పదోన్నతులు ఇవ్వాలని ఆదేశించడంతో త్వరలోనే ఈ ప్రక్రియను చేపట్టనున్నారు. అయితే జిల్లా విద్యాశాఖలో భారీగా ఖాళీలున్న దృష్ట్యా అధిక మందికి పదోన్నతులు లభించనున్నాయి. ఉమ్మడి జిల్లా ప్రతిపాదికన పదోన్నతుల ప్రక్రియ చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. రంగారెడ్డి జిల్లాలో సుమారు 300ల మందికిపైగా ప్రమోషన్ లభించనుంది. పదోన్నతులు పొందే వారిలో స్కూల్ అసిస్టెంట్లు, ఎల్ఎఫ్ఎస్ హెచ్ఎం, గ్రేడ్-2 హెచ్ఎంలు ఉన్నారు. అదేవిధంగా జిల్లా విద్యాశాఖలో 583 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జీహెచ్ఎం గ్రేడ్-2 పోస్టులు-62, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం-47, స్కూల్ అసిస్టెంట్(గణితం)-15, స్కూల్ అసిస్టెంట్(భౌతికశాస్త్రం)-4, స్కూల్ అసిస్టెంట్(జీవశాస్త్రం)- 56, స్కూల్ అసిస్టెంట్(సాంఘిక శాస్త్రం)-98, స్కూల్ అసిస్టెంట్ (ఇంగ్లిష్)-26, స్కూల్ అసిస్టెంట్(తెలుగు)-20, స్కూల్ అసిస్టెంట్(హిందీ)-6, స్కూల్ అసిస్టెంట్(ఉర్దూ)-1, స్కూల్ అసిస్టెంట్(ఫిజికల్ ఎడ్యుకేషన్)-3, ఎస్జీటీలు-227, భాషా పండితులు(తెలుగు)-12, భాషా పండితులు(హిందీ)-5, పీఈటీ-1 పోస్టులు జిల్లా విద్యాశాఖలో ఖాళీలున్నాయి.
ఇవి కూడా చదవండి..
ఈ లక్షణాలు మీలో ఉంటే.. మీరు ఉప్పు ఎక్కువగా తింటున్నట్లే..!