ఆమనగల్లు, మార్చి27: మారుతున్న కాలానికి అనుగుణంగా మారితేనే టెక్నాలజీ సేవలను అందిపుచ్చుకోగలుగుతాం. ఉరుకులు.. పరుగులతోనే కాలం గడిచిపోతున్నది. హడావిడి ప్రయాణాల్లో వాహనానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు ఉన్నాయో లేవో చూసుకోకుండానే వెళ్తుంటాం. వాహనాలను తనిఖీ చేసే సమయంలో రవాణా, పోలీసు శాఖ అధికారులకు తమ వద్దనున్న పత్రాలు చూపించాల్సి ఉంటుంది. ఆదమరిచి పత్రాలు తీసుకోకుండా వెళ్తే చలాన్లు కట్టాల్సి వస్తుంది. ఇలాంటి ఇబ్బందులన్నింటికీ ఎం వాలెట్ యాప్ చాలా ఉపయోగపడుతుంది. వాహనానికి సంబంధించిన ఎలాంటి పత్రాలు మన వెంట లేకున్నా నిశ్చితంగా ప్రయాణాలు సాగించవచ్చు. రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ ఇలా వాహనాలకు సంబంధించిన ప్రతి పత్రాన్ని ఈ యాప్లో నిక్షిప్తం చేసేలా సేవలు కల్పించారు.
అంతా ఆన్లైన్..
నూతన సాంకేతికతకు సంబంధించిన విషయ పరిజ్ఞానంపై మనకు కొంత అవగాహన ఉంటే చాలు సేవలను సద్వినియోగం చేసుకోవచ్చు. ఎం వాలెట్ యాప్ను ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. యాప్ రాష్ట్ర రవాణా శాఖతో పాటుగా సెంట్రల్ సర్వర్కు అనుసంధానం చేయబడింది. యాప్లో వాహనదారుడు పూర్తి వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తే ఆ సమాచారం అంతా యాప్లో అప్లోడ్ అవుతుంది. వాహనాల తనిఖీలకు సంబంధించినప్పుడు యాప్లో లాగిన్ అయి, బండి నంబర్, ఫోన్ నంబర్ కొట్టి, సెర్చ్ చేస్తే పూర్తి వివరాలు యాప్ లో ప్రత్యక్షమవుతాయి.
యాప్లో ఇలా నమోదు చేసుకోవాలి
ఆండ్రాయిడ్ లేదా స్మార్ట్ఫోన్ ఉంటే సరిపోతుంది. ఎం వాలెట్ యాప్ను ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలి. పేరు, ఈ మొయిల్ ఐడీ, ఫోన్ నంబర్ ద్వారా యాప్ను రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రర్ ఆప్షన్లోకి వెళ్లిన తర్వాత ఫోన్ నంబర్కు ఓటీపీ వస్తుంది. నంబర్తో లాగిన్ అయితే సరిపోతుంది. యాప్ ఓపెన్ చేసి బటన్పై క్లిక్ చేస్తే ఆర్సీ, లైసెన్స్కు సంబంధించిన ధ్రువపత్రాలు కనబడుతాయి.
టెక్నాలజీని వాడాలి
వాహనదారులు నూతన టెక్నాలజీని వినియోగించుకోవాలి. సులువుగా ఎం వాలెట్ యాప్లో నమోదైన వివరాలను చూపిస్తే సరిపోతుంది. వాహనాలకు సంబంధించిన పెండింగ్ చలాన్లు అన్ని వివరాలను తెలుసుకునే వీలుంటుంది. యాప్ల గురించి వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నాం. వాహనదారులంతా ట్రాఫిక్ నియమ, నిబంధనలు పాటించి ప్రయాణాలను సాగించాలన్నదే మా ధ్యేయం.
– రఘుకుమార్, ట్రాఫిక్ ఎస్సై,ఆమనగల్లు