చేవెళ్ల టౌన్, మే 27 : వైద్యులు అందుబాటులో ఉంటూ కరోనా రోగులకు మెరుగైన వైద్యం అందించాలని, కరోనా నివారణకు వైద్యులు చర్యలు వేగవంతం చేయాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్ అన్నారు. గురువారం చేవెళ్ల ప్రభుత్వ దవాఖానను ఆకస్మికంగా తనిఖీ చేశారు. దవాఖానలో ఓపీ, జనరల్ వార్డు, గైనిక్ ఓపీ, డెలివరీ వార్డు, ఐసొలేషన్ వార్డు, ఫార్మసీ స్టోర్ రూమ్ను పరిశీలించారు. ఐసొలేషన్ వార్డుకు ఎదురుగా ఉన్న గైనిక్ ఓపీని మరో గదికి మార్చాలని డాక్టర్ ప్రదీప్ను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో అన్ని వసతులు సక్రమంగా ఉండేలా చూడాలన్నారు. దవాఖాన అవరణలో పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూడాలని వైద్యాధికారి డాక్టర్ ప్రదీప్ను ఆదేశించారు. రోగులకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తొందరలోనే ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట చేవెళ్ల తాసిల్దార్ అశోక్, వైద్య సిబ్బంది ఉన్నారు.
సర్దార్నగర్లో ధాన్యం కొనుగోలు కేంద్రం సందర్శన
షాబాద్, మే 27 : ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలని రంగారెడ్డి కలెక్టర్ అమయ్కుమార్ అన్నారు. గురువారం షాబాద్ మండలంలోని సర్దార్నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. అనంతరం ధాన్యం కొనుగోలు ఏ విధంగా జరుగుతుందని ఆరా తీశారు. అక్కడున్న కొంతమంది రైతులతో మాట్లాడి ఏమైనా సమస్యలున్నాయా అని అడుగగా.. గన్నీ బ్యాగుల కొరత ఉందని, రోజుల తరబడిగా బ్యాగుల కోసం ఎదురుచూస్తున్నామని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటివరకు ఎన్ని గన్నీ బ్యాగులు పంపిణీ చేశారని సిబ్బందిని అడుగగా 17వేల బ్యాగులు రైతులకు అందించినట్లు తెలిపారు.
మొయినాబాద్, షాబాద్లో రెండు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా, అవి ప్రారంభం కాకపోవడంతో రైతులు పెద్దఎత్తున వరి ధాన్యాన్ని సర్దార్నగర్కు తీసుకురావడంతో బ్యాగుల కొరత ఏర్పడిందని కలెక్టర్కు వివరించారు. దీనికి స్పందించిన కలెక్టర్ త్వరలో సర్దార్నగర్ కేంద్రానికి 5వేల గన్నీ బ్యాగులు పంపిణీ చేస్తామని తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులు టోకెన్ల పద్ధతిలో రైతులకు గన్నీ బ్యాగులు సరఫరా చేయాలని ఆదేశించారు. రైతులు నిత్యం ఇక్కడికి బ్యాగుల కోసం గుంపులుగుంపులుగా రాకుండా టోకెన్లు తీసుకుని తమకు కేటాయించిన తేదీల్లో వచ్చి బ్యాగులు తీసుకువెళ్లాలని సూచించారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని రైస్మిల్లులో త్వరగా ఖాళీ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బందులు లేకుండా సకాలంలో వారి ఖాతాల్లోకి డబ్బులు జమ చేయాలని స్పష్టం చేశారు. కొనుగోలు కేంద్రం వద్ద కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. కలెక్టర్ వెంట చేవెళ్ల ఆర్డీవో వేణుమాధవ్రావు, షాబాద్ తాసిల్దార్ అమరలింగంగౌడ్, సీనియర్ అసిస్టెంట్ మహేందర్గౌడ్, మార్కెట్ కార్యదర్శి రవికుమార్, ఏఈవో రాఘవేందర్, సిబ్బంది ఉన్నారు.