జిల్లా దవాఖానలో 120 బెడ్లు ఏర్పాటు
బ్లాక్ఫంగస్ మందులు అందుబాటులో ఉండేలా చర్యలు
ఇప్పటివరకు రూ.19.30 కోట్ల విలువైన ధాన్యం సేకరణ
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి
రంగారెడ్డి, మే 26, (నమస్తే తెలంగాణ): జిల్లాలో చిన్నారుల కోసం ప్రత్యేక కొవిడ్ కేర్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి తెలిపారు. బుధవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో కరోనా వైరస్ నియంత్రణ చర్యలు, ధాన్యం కొనుగోళ్లపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కొవిడ్ బారిన పడే చిన్నారులకు చికిత్స అందించేందుకు కొండాపూర్లోని జిల్లా దవాఖానలో 120 బెడ్లు ఏర్పాటు చేశామన్నారు. జ్వర సర్వేతో సత్ఫలితాలు వస్తున్నాయని, జిల్లాలో కొవిడ్ పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయన్నారు. లాక్డౌన్ను పకడ్బందీగా అమలుచేస్తున్నట్లు తెలిపారు. నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నారు. ఇప్పటికే జిల్లాలో పెద్ద ఎత్తున కొవిడ్ కేర్ సెంటర్లు, ఐసొలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో సరిపడా మందులు, ఆక్సిజన్ నిల్వలు ఉన్నాయన్నారు. బ్లాక్ఫంగస్ మందులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సినేషన్కు సంబంధించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను ఆదేశించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ప్రైవేట్ దవాఖానలు సేవలందించేలా చూడాలన్నారు. సమావేశంలో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్, కలెక్టర్ అమయ్కుమార్, అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్, డీఎంహెచ్వో స్వరాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
రూ.19.30 కోట్ల విలువైన ధాన్యం సేకరణ…
జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి సబితాఇంద్రారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. కొవిడ్ ఆపత్కాలంలోనూ మద్దతు ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. జిల్లాలో 99 వేల ఎకరాల్లో 2.47 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రాగా, ఇందులో విత్తనం, స్థానిక అవసరాలు, రైతులు ఇంటి అవసరాల కోసం, రైస్ మిల్లర్లు, ఇతర వ్యాపారులు కొనుగోలు తర్వాత సుమారు 80 శాతం ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ ద్వారా కొనుగోలు ప్రక్రియను చేపట్టిందన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 2164 మంది రైతుల నుంచి 10,107 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారన్నారు. దీని విలువ రూ.19.30 కోట్లు కాగా.. చెల్లింపులు ప్రక్రియ జరుగుతుందన్నారు. గన్నీ బ్యాగుల స్టాక్ కోసం ప్రతిపాదనలను పంపాలన్నారు. జిల్లావ్యాప్తంగా 26 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్, కలెక్టర్ అమయ్కుమార్, జిల్లా వ్యవసాయాధికారి గీతారెడ్డి, డీఎస్వో మనోహర్ రాథోడ్, మార్కెటింగ్ అధికారి ఛాయాదేవి తదితరులు పాల్గొన్నారు.