కొత్తూరు మున్సిపల్ చైర్ పర్సన్ లావణ్య
ఆరోగ్య సిబ్బందికి థర్మల్ స్క్రీనింగ్ గన్స్ పంపిణీ
కొత్తూరు, మే 26 : రెండో విడుత ఫీవర్ సర్వేను త్వరగా పూర్తి చేయాలని కొత్తూరు మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య ఆరోగ్య సిబ్బందికి సూచించారు. ఫీవర్ సర్వే కోసం ఇంటింటికీ తిరుగుతున్న ఆరోగ్య సిబ్బందికి బుధవారం ఆమె థర్మల్ స్క్రీనింగ్ గన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లావణ్య మాట్లాడుతూ లక్షణాలున్న ప్రతి ఒక్కరికీ పూర్తిస్థాయిలో పరీక్షలు నిర్వహించాలన్నారు. అవసరమైన వారిని ప్రభుత్వ దవాఖానల్లో చేర్చాలన్నారు. ఆరోగ్య తెలంగాణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ సర్వేకు ప్రజలు సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా పీహెచ్సీ డాక్టర్ కవిత మాట్లాడుతూ.. చైర్పర్సన్ సొంత ఖర్చులతో పంపిణీ చేసిన ఈ పరికరాలతో సర్వేను వేగవంతంగా చేపట్టవచ్చన్నారు. కచ్చితమైన ఫలితాలు వస్తాయన్నారు. ఈ సర్వేకు ప్రజలు సహకరించేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు సహాయం అందించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ డోలి రవీందర్, కౌన్సిలర్లు కోస్గి శ్రీను, జయమ్మ, బేగరి ప్రసన్నలత, సోమ్లానాయక్, మాదారం నరసింహ, అనిత, మున్సిపల్ కమిషనర్ వీరేందర్, టీఆర్ఎస్ నాయకులు దేవేందర్యాదవ్, సుదర్శన్గౌడ్, గోవింద్రెడ్డి, ప్రభాకర్రెడ్డి, సిటీ కేబుల్ వెంకటేశ్, రవినాయక్, రాఘవేందర్యాదవ్, శ్రవణ్యాదవ్, కార్తీక్రెడ్డి, ఆంజనేయులుగౌడ్, లక్ష్మణ్, ఏఎన్ఎం సులోచన, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇంటింటి సర్వేకు సహకరించాలి
కొందుర్గు, మే 26 : గ్రామంలో వైద్య సిబ్బంది చేస్తున్న ఇంటింటి జ్వర సర్వేకు ప్రతి ఒక్కరూ సహకరించాలని విశ్వనాథ్పూర్ సర్పంచ్ శ్రీధర్రెడ్డి అన్నారు. బుధవారం కొందుర్గు మండలం విశ్వనాథ్పూర్ గ్రామంలో వైద్య సిబ్బంది ఇంటింటి జ్వర సర్వే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం కరోనా నివారణలో భాగంగా ప్రతి ఇంటిని సర్వే చేయిస్తున్నట్లు తెలిపారు. ఇంట్లో ఉన్న వ్యక్తుల ఆరోగ్య పరిస్థితులు తెలుసుకుని అనారోగ్యంగా ఉన్నవారికి ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నట్లు ఆయన వివరించారు. కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తులు మండల కేంద్రంలో పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. కరోనా సోకినట్లు నిర్ధారిస్తే 14రోజుల పాటు హోం క్వారంటైన్లో ఉండాలని అన్నారు. డాక్టర్లు చెప్పిన సూచనలు పాటిస్తే కరోనాను జయించవచ్చని చెప్పారు. ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రజల ఆరోగ్యం కోసం కృషి చేస్తున్నదని తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నర్సింహులు, ఆశ కార్యకర్త ఉమాదేవి పాల్గొన్నారు.
జోరుగా ఇంటింటి ఫీవర్ సర్వే
మొయినాబాద్, మే 26 : గ్రామాల్లో ఇంటింటి ఫీవర్ సర్వే జోరుగా కొనసాగుతున్నది. ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు కలిసి ఇంటింటికి తిరిగి ఫీవర్ సర్వే చేస్తున్నారు. మండలంలో 28 గ్రామ పంచాయతీలు 10 అనుబంధ గ్రామాలు ఉన్నాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఇంటింటికి వెళ్లి ఆ కుటుంబంలో వారి ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. ఆ కుటుంబంలో ఎవరికైనా కరోనా లక్షణాలు ఉన్నాయా..? ఉన్నవారిని గుర్తించి వారికి కరోనా నియంత్రణకు మందులు ఇస్తున్నారు. గ్రామంలో ఎంత మంది కరోనా లక్షణాలతో ఉన్నారు అని జాబితాను తయారు చేసి వైద్యాధికారులకు అందిస్తున్నారు.