కరోనాను నియంత్రించేందుకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు అనుసరిస్తున్న విధానాలపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా సూపర్ స్ప్రెడర్లుగా కొన్ని వృత్తుల వారిని గుర్తించి.. వారికి వెంటనే టీకా వేయించాలని సర్కార్ నిర్ణయించింది. దీంతో ఆయా శాఖలు లెక్కలు తేల్చే పనిలో నిమగ్నమయ్యాయి. ఆటో, క్యాబ్ డ్రైవర్లు, గ్యాస్ డెలివరీ బాయ్స్, రేషన్ దుకాణాదారులు, పెట్రోల్ బంక్ సిబ్బంది, ఎరువులు, విత్తనాల దుకాణాదారులు… ఇలా అనేక విభాగాల్లో ఉమ్మడి జిల్లాలో ఎంతమంది ఉన్నారో గుర్తించి వారికి 28వ తేదీ నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ వృత్తులకు చెందిన వారు రంగారెడ్డి జిల్లాలో 10వేల మంది, వికారాబాద్ జిల్లాలో 8వేలకు పైగా ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేశారు. ప్రతీ మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలను వ్యాక్సిన్ల పంపిణీ కేంద్రాలుగా ఉపయోగించనున్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇక్కడ సూపర్స్ప్రెడర్లకు టీకా వేసేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని కేటాయించనున్నారు.
రంగారెడ్డి, మే 26, (నమస్తే తెలంగాణ): కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతున్నది. ఓ వైపు పకడ్బందీగా లాక్డౌన్ను అమలు చేస్తూనే, మరోవైపు వ్యాక్సినేషన్ను కొనసాగించడం, లక్షణాలున్న ప్రతి ఒక్కరికి కరోనా పరీక్షలు, ఇంటింటా జ్వర సర్వే నిర్వహించి మందుల కిట్లు అందించడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నది. అయితే 18 ఏండ్లు నిండిన వారందరికీ టీకా ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం మంగళవారం అనుమతిచ్చిన విషయం తెలిసిందే. రోజుకు 20 గంటలపాటు లాక్డౌన్ అమలు చేస్తున్నప్పటికీ సడలింపు సమయంలో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు కరోనా వైరస్ వ్యాప్తి జరిగే అవకాశాలున్నాయి. దీన్ని అధిగమించేందుకు ప్రభుత్వం సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించింది. సడలింపు సమయంలో జనం రద్దీగా ఉండే రేషన్ దుకాణాలు, పెట్రోల్ పంపులు, కిరాణ దుకాణాలు, వెజ్, నాన్-వెజ్ మార్కెట్లు, మద్యం షాపులు, హెయిర్ సెలూన్లు, ఆటో, క్యాబ్, బస్సు డ్రైవర్లు తదితరులను సూపర్ స్ప్రెడర్లుగా గుర్తించి టీకా వేయనున్నారు. దీంతో కరోనా వైరస్ వ్యాప్తికి పూర్తిగా అడ్డుకట్ట పడుతుందని ప్రభుత్వం భావిస్తున్నది.
28వ తేదీ నుంచి వ్యాక్సినేషన్…
సూపర్ స్ప్రెడర్లకు ఈ నెల 28, 29 తేదిల్లో వ్యాక్సినేషన్ నిర్వహించేందుకు జిల్లా యంత్రా ంగం నిర్ణయించింది. రెండు రోజుల్లో పూర్తి కానట్లయితే ఈ నెల 30న కూడా వ్యాక్సినేషన్ను కొనసాగించనున్నారు. అందుకోసం జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటికే సూపర్ స్ప్రెడర్లను గుర్తించిన జిల్లా అధికారులు వారికి మండలాలవారీగా వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తొలుత రేషన్ డీలర్లతోపాటు రేషన్ దుకాణాల్లో పనిచేసే సిబ్బంది, ఎరువులు, విత్తనాల దుకాణదారులు, సిబ్బంది, ఎల్పీజీ సిలిండర్ డెలివరీ సిబ్బంది, పెట్రోల్ పంపుల్లో పనిచేసే సిబ్బందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. అనంతరం మిగతా సూపర్ స్ప్రెడర్లకు ఇవ్వనున్నారు. వ్యాక్సినేషన్ కేంద్రాలను వ్యవసాయ, పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలోని సూపర్ స్ప్రెడర్లకు ఒక వ్యాక్సినేషన్ కేంద్రం, జర్నలిస్టులకు ప్రత్యేకంగా ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ప్రతి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను వ్యాక్సినేషన్ కేంద్రంగా వాడుకోవాలని నిర్ణయించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వ్యాక్సిన్లు ఇవ్వనున్నారు. అవసరమైన స్టాఫ్ నర్సులతోపాటు నర్సింగ్ సిబ్బందిని ప్రతి వ్యాక్సినేషన్ కేంద్రానికి కేటాయించనున్నారు. జిల్లాలో సూపర్ స్ప్రెడర్లలో వ్యవసాయ సంబంధిత సిబ్బంది 1567 మంది, పౌరసరఫరాల శాఖలో 1838 మంది, ఎల్పీజీ డెలివరీ సిబ్బంది 676 మంది, పెట్రోల్ పంపుల్లో పనిచేసేవారు 4130 మంది ఉన్నారు. అలాగే అక్రిడిటేషన్ జర్నలిస్టులకు కూడా వ్యాక్సిన్ ఇచ్చేందుకు నిర్ణయించారు. జిల్లాలో అక్రిడిటేషన్ జర్నలిస్టులు 939 మంది ఉండగా, వీరిలో 45 ఏండ్లు దాటిన వారు ఇప్పటికే వ్యాక్సిన్ వేయించుకోగా మిగతావారికి ఈ నెల 28, 29 తేదీల్లో టీకా వేయనున్నారు.
వికారాబాద్ జిల్లాలో
8 నుంచి 10వేల మంది..
పరిగి, మే 26 : వికారాబాద్ జిల్లాలో సూపర్ స్ప్రెడర్లను గుర్తించి టీకాలు వేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో ఈ నెల 28 నుంచి సూపర్ సూపర్ స్ప్రెడర్లకు టీకాలు ఇవ్వనున్నారు. అందుకోసం జిల్లా వ్యాప్తంగా ఉన్న సూపర్ స్ప్రెడర్ల జాబితాను సిద్ధం చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అయితే జిల్లావ్యాప్తంగా 8 నుంచి 10వేల మంది వరకు సూపర్ స్ప్రెడర్లు ఉంటారని అంచనా వేస్తున్నారు. ఇందులో రేషన్ డీలర్లు, సహాయకులు, ఎల్పీజీ గ్యాస్ పంపిణీదారులు, పెట్రోల్ బంక్ల సిబ్బంది సుమారు 2వేల మంది, ఆటో, క్యాబ్, బస్సు డ్రైవర్లు 3వేల వరకు ఉంటారని అధికారులు తెలిపారు. అదేవిధంగా 425 మంది అక్రిడిటేషన్ ఉన్న జర్నలిస్టులు ఉన్నారు. ఇక మద్యం దుకాణాలు, బార్లలో పనిచేసేవారు సుమారు 156 మంది ఉంటారని చెబుతున్నారు. అలాగే కూరగాయలు, కిరాణం దుకాణాలు, మాంసం, చికెన్ విక్రేతలు, పండ్లు విక్రయించేవారి జాబితాను మున్సిపాలిటీలవారీగా సేకరిస్తున్నారు. జిల్లాలో తాండూరు, వికారాబాద్, పరిగి, కొడంగల్ మున్సిపాలిటీలు ఉన్నాయి. సాధ్యమైనంత త్వరగా జాబితా రూపొందించి టీకాలు వేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.