కోట్పల్లి, మే 25 : ఇంటింటి సర్వేను పకడ్బందీగా నిర్వహించి జ్వరం, దగ్గు, ఒంటి నొప్పుల వంటి లక్షణాలు ఉన్నవారిని గుర్తించి అవసరమైన పరీక్షలు, వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ పౌసుమిబసు వైద్యాధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లాలోని యాలాల మండలం కమాల్పూర్ గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. కొవిడ్ నియంత్రణలో భాగంగా ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలతో ఇంటింటా ఫీవర్ సర్వేపై గ్రామంలోని పలు ఇండ్లకు వెళ్లి, వైద్య సిబ్బంది వస్తున్నారా.. లేదా అని ఆరా తీశారు. ప్రతి ఒక్కరూ వైద్య సిబ్బందికి సహకరించాలని కోరారు. పీహెచ్సీలో నిర్వహిస్తున్న మందుల నిలువ, సరఫరా రిజిస్టర్లను పరిశీలించారు. గ్రామంలో గర్భిణులు, హై రిస్క్ కేసుల వివరాలను.. వారికి అందుతున్న వైద్య సేవలపై డాక్టర్ను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో మురికి కాలువల పరిశుభ్రత, పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. మురుగు నీరు రోడ్లపై ప్రవహించకుండా అవసరమైన చోట్ల ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో ఇంకుడు గుంతలు నిర్మించాలని సర్పంచ్, ఎంపీవోలను ఆదేశించారు.
ఇంటింటా చెత్త సేకరణ సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. రాబోవు వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు వహించాలని సూచించారు. అనంతరం యాలాలలోని పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ల్యాబ్, వ్యాక్సినేషన్. ఇన్పేషెంట్ వార్డులను, స్టాక్ రిజిస్టర్ను పరిశీలించారు. బయో మెడికల్ వ్యర్థాలను ఒక సేఫ్టీ గుంత తవ్వి అందులో వేయాలని సూచించారు. ప్రతిరోజూ పారిశుద్ధ్య పనులు చేపట్టి పరిశుభ్రంగా ఉంచాలని పేర్కొన్నారు. అంతకు ముందు కమాల్పూర్ గ్రామంలో డీసీఎంఎస్ ద్వారా నిర్వహిస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. వ్యవసాయ శాఖ ద్వారా ప్రతి రోజూ జారీ చేసే టోకెన్ల ప్రకారం రైతుల నుంచి వరి ధాన్యం సేకరించాలని.. వాటికి సంబంధించి చెల్లింపులు వెంటనే జరుగాలని సూచించారు. సేకరించిన ధాన్యాన్ని లారీలలో కరీంనగర్ జిల్లాకు తక్షణమే తరలించాలని ఆదేశించారు. కోకట్లో వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి పరిసరాల రైతుల నుంచి వరి కొనుగోలు చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు కొవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి సుధాకర్ షిండే, డాక్టర్ అశ్విని, ఎంపీవో మహేశ్, వ్యవసాయ విస్తరణ అధికారి శాంసన్ పాల్గొన్నారు.