దోమ, మార్చి 25: నూతన ఒరవడితో పుచ్చ, బంతి పంటల సాగుకు మండలంలోని రైతులు విరివిగా మొగ్గు చూపుతున్నారు. సాధారణ పంటల్లో దిగుబడులు, లాభాలు అంతంత మాత్రంగా ఉండడంతో రైతులు ఉద్యాన పంటల సాగు వైపు దృష్టి సారిస్తున్నారు. వ్యవసాయ రంగానికి నూతన పద్ధతులు, సాంకేతికతను జోడిస్తూ కొత్త విధానంలో పంటలు సాగు చేయడానికి కృషి చేస్తున్నారు. దీంతో రైతులు లాభాల బాటలో పయనిస్తున్నారు. పుచ్చ పంటను మామూలు పద్ధతుల్లో సాగు చేస్తే దిగుబడులు అంతంత మాత్రంగానే వస్తాయి. కానీ మల్చింగ్ విధానంలో సాగు చేయడంతో పంటలో కలుపు నివారించడం, కూలీల ఖర్చు తగ్గడం, భూమిలో తేమ ఆవిరి కాకుండా ఉండి పంట ఎదుగుదలలో భారీ మార్పులు ఉంటాయి. పుచ్చ పంట సాగుకు తప్పనిసరిగా బిందు సేద్యం (డ్రిప్ విధానం) అవసరమని గ్రహించిన రైతులు ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు. దీంతో పంటకు అవసరమైనంత నీటిని నేరుగా మొక్కలకే అందించడానికి వీలుంటుంది. ఈ విధానంతో తక్కువ నీటితో ఎక్కువ పంట సాగు చేయవచ్చు.
పెట్టుబడి వ్యయం తగ్గుతుంది..
చీడ పీడల నివారణకు మందుల ఖర్చు తగ్గించడానికి రైతులు కొత్త విధానాలను అనుసరిస్తున్నారు. పంట సస్యరక్షణ చర్యల్లో భాగంగా గమ్తో కూడిన ఎల్లో, బ్లూ కలర్ క్రాప్ గార్డులు వినియోగిస్తున్నారు. వీటితో తెల్ల, పచ్చదోమ వంటి చీడ పీడల రక్షణకు కొత్త సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. పంటకు కీడు చేసే దోమలు వాటికి అంటుకుని చనిపోవడంతో ఎక్కువగా మందులు పిచికారీ చేయాల్సిన అవసరం ఉండదు. పెట్టుబడి సైతం తగ్గుతుంది. అడుగు మందులతో పాటు నీటిలో కరిగే పొటాష్, 19:19:19 వంటి మందులు వాడి పంటలో గణనీయమైన దిగుబడులు సాధిస్తున్నారు. ఈ పంట నాటిన 70 రోజుల్లోనే చేతికి వస్తుండడంతో దోమ మండలంలోని మల్లేపల్లి, అనంతరెడ్డిపల్లి, అయినాపూర్, బాస్పల్లి గ్రామాల్లో రైతులు ఎక్కువగా సాగుకు ఆసక్తి చూపుతున్నారు.