ఇబ్రహీంపట్నం, మే 24 : మిషన్ భగీరథ నీటి సరఫరా తాత్కాలికంగా ఆగినా ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడకుండా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. సోమవారం ఇబ్రహీంపట్నం క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..వేలూరు పంప్హౌస్ నుంచి నెలరోజుల పాటు మరమ్మతులు కొనసాగనుండడంతో భగీరథ నీటి సరఫరా నిలిచిపోనుందన్నారు. నియోజకవర్గంలో ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడకుండా గున్గల్ రిజర్వాయర్ నుంచి కృష్ణా నీటి సరఫరా పనులు తాత్కాలికంగా పునరుద్ధరించాలన్నారు. గ్రామాల్లో స్థానికంగా ఉండే నీటి వనరులను సర్పంచ్లు, ఎంపీటీసీలు సమన్వయంతో పూర్తిగా ఉపయోగించుకోవాలన్నారు. మిషన్భగీరథ పునరుద్ధరణ పనులకు సహకరించాలని కోరారు. కష్టకాలంలో ప్రజలకు నీటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ రాజేశ్వర్, డీఎల్పీవో సంధ్యారాణి, ఎంపీపీ కృపేశ్, ఎంపీడీవోలు దేవేందర్రెడ్డి, మమతాబాయి, మహేశ్బాబు, ఆర్డబ్ల్యూఎస్ డీఈ రాజు, ఎంపీవోలు మహేష్, వినోద, మధుసూదనాచారి, శ్రీలత, ఏఈలు ప్రణిత్, స్రవంతి, శ్వేత తదితరులున్నారు.
కష్టకాలంలోనూ ఆగని పథకాలు
లాక్డౌన్ పరిస్థితుల్లో కూడా సంక్షేమ పథకాల్లో కోతలు విధించకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అండగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. సోమవారం తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో 79 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విపత్కర పరిస్థితిల్లో ఆర్భాటాలకు పోయి ప్రాణాల మీదకు తెచ్చుకోకుండా జాగ్రత్తలు పాటించాలని కోరారు. ఇబ్రహీంపట్నం మండలంలోని 79 మంది లబ్ధిదారులకు అందజేశారు. కరోనా దృష్ట్యా చెక్కుల పంపిణీ కార్యక్రమానికి వచ్చే ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి దూరం పాటించే విధంగా చర్యలు తీసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కృపేశ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్తువెంకటరమణారెడ్డి, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు భరత్రెడ్డి, సర్పంచ్లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
వ్యాక్సినేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలి
కొవిడ్-19 పరీక్ష కేంద్రంతో పాటు వ్యాక్సినేషన్ సెంటర్ను ఏర్పాటు చేయాలని కోరుతూ మున్సిపాలిటీ టీఆర్ఎస్ కౌన్సిలర్ ఫ్లోర్ లీడర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నాయకులు సోమవారం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డికి వినతిపత్రం అందజేశారు. తుర్కయాంజాల్లో కొవిడ్-19 పరీక్ష కేంద్రం, వ్యాక్సినేషన్ సెంటర్ లేక ప్రజలు చాలా దూరం వెళ్లి పరీక్షలు చేయించుకోవాల్సి వస్తున్నదని తెలిపారు. మండల కేంద్రంలో ఉన్న వ్యాక్సినేషన్ సెంటర్ తుర్కయాంజాల్ పరిధికి దూరంగా ఉండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. ప్రజల సౌకర్యార్థం తుర్కయాంజాల్లో పరీక్ష కేంద్రంతో పాటు వ్యాక్సినేషన్ సెంటర్ను ఏర్పాటు చేయించేలా చర్యలు తీసుకోవాలని నాయకులు ఎమ్మెల్యేను కోరారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే తుర్కయాంజాల్ కేంద్రంగా ఏర్పాటు చేయించేలా చూస్తానని హామీనిచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ కృపేశ్, టీఆర్ఎస్ నాయకులు అమరేందర్ రెడ్డి, విజయానంద్ రెడ్డి, ధన్రాజ్ పాల్గొన్నారు.