యాచారం, మే 24 : ‘కరోనా నివారణ చర్యలు వేగవంతం చేపట్టండి.. దవాఖాన, పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలి.. వైద్యులు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్యం అందించాలి..’ అని రంగారెడ్డి కలెక్టర్ అమయ్కుమార్ అన్నారు. సోమవారం అడిషనల్ కలెక్టర్ ప్రతీక్జైన్తో కలిసి మండలంలో సుడిగాలి పర్యటన చేశారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించి, దవాఖానలో ఓపీ నిర్వహిస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు. జనరల్ వార్డు, డెలివరీ వార్డు, ఫార్మసీ వార్డులను పరిశీలించారు. దవాఖాన భవనం శిథిలావస్థకు చేరడంతో నిచ్చెన సాయంతో భవనం పైకి ఎక్కి చూశారు. కరోనా టెస్టుల తీరును, నివారణ చర్యలను వైద్యురాలు లలితను అడిగి తెలుసుకున్నారు. కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. గ్రామాల్లో కొనసాగుతున్న రెండో దశ జ్వర సర్వే తీరును హెచ్సీవో శ్రీనివాస్ను అడిగి తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించి, కరోనా లక్షణాలు ఉన్న బాధితులతో మాట్లాడి వారితో మనోధైర్యాన్ని నింపారు.
అనంతరం మండలంలోని చౌదర్పల్లి గ్రామంలో కొనసాగుతున్న జ్వర సర్వేను కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ పరిశీలించారు. సర్వే చేపడుతున్న తీరు, సేకరిస్తున్న వివరాలు, అందజేస్తున్న మందుల వివరాలను సర్వే సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మండలంలో కరోనా నివారణ చర్యల వివరాలను ఎంపీడీవో మమతాబాయిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల్లో చేపడుతున్న సెకండ్ లెవెల్ జ్వర సర్వేకు ప్రజలు సహకరించాలన్నారు. ఉపాధి హామీ కూలీలు మాస్కులు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలన్నారు.
పంచాయతీ కార్యదర్శులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి, నీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. హరితహారం మొక్కలకు రోజుకు రెండు సార్లు నీటిని పట్టాలన్నారు. నర్సరీ, పల్లె పకృతివనం మొక్కలను పరిరక్షించడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలన్నారు. కొనసాగుతున్న పల్లె ప్రగతి అభివృద్ధి పనులను వేగవంతం చేయాలన్నారు. పల్లెల్లోనూ లాక్డౌన్ను పకడ్బందీగా అమలు చేయాలన్నారు. ప్రతి గ్రామంలో తరుచూ సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయాలని, రోడ్లు, వీధుల్లో బ్లీచింగ్ ఫౌడర్ను చల్లాలన్నారు. నీటి ట్యాంకులు, సంపులను సైతం శుభ్రం చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట డీఆర్డీవో పీడీ ప్రభాకర్, ఎంపీడీవో మమతాబాయి, ఎంపీవో శ్రీలత, హెచ్సీవో శ్రీనివాస్, హెచ్వో శ్రీనివాస్, యాచారం సర్పంచ్ ముదిరెడ్డి శ్రీధర్రెడ్డి, వార్డు సభ్యులు భూతరాజు నాగరాజు, వెంకటేశ్, ఆశ వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు, వైద్య సిబ్బంది ఉన్నారు.
పకడ్బందీగా జ్వర సర్వే చేయండి
మాడ్గుల, మే 24 : గ్రామాల్లో పకడ్బందీగా జర్వ సర్వే చేయాలని రంగారెడ్డి కలెక్టర్ అమయ్కుమార్ వైద్య సిబ్బందికి సూచించారు. సోమవారం మాడ్గుల ప్రభుత్వ దవాఖానను అడిషనల్ కలెక్టర్ ప్రతీక్జైన్తో కలిసి తనిఖీ చేశారు. వైద్యురాలు లలిత, మెడికల్ అధికారి శేఖర్రెడ్డి అందుబాటులో లేకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. డీఎంహెచ్వో స్వరాజ్యలక్ష్మికి ఫోన్ చేసి సెలవుల్లో ఉన్నారా అంటూ ఆరా తీశారు. కరోనా పరీక్షలు, వ్యాక్సినేషన్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రసవాలు, మందులు నిల్వ, సిబ్బంది హాజరు రిజిస్టర్లను పరిశీలించారు. మండలంలో కరోనా టెస్టులు పెంచాలని ఎంపీపీ పద్మ కలెక్టర్ను కోరగా, సానుకూలంగా స్పందించారు. కరోనా లక్షణాలు ఉన్న వారికి పరీక్షలు చేసి పాజిటివ్ వచ్చిన వారికి మెడికల్ కిట్లను అందజేయాలన్నారు. రోజుకు ఎన్ని టెస్టులు చేస్తున్నారని ల్యాబ్టెక్నీషియన్ మనోహర్రెడ్డి అడుగగా సోమవారం మాడ్గుల, ఇర్విన్ ప్రాథమిక కేంద్రాల్లో 70 టెస్టులు చేయగా, 16 పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలిపారు. ఇర్విన్ ప్రాథమిక వైద్య కేంద్రానికి చెందిన వైద్యుడు శ్రీనివాస్ విధుల్లో ఉన్నాడా అని మెడికల్ అధికారి ప్రభుదాస్ను ప్రశ్నించగా డిప్యూటేషన్పై బాలాపుర్ మండలంలో విధులు చేపడుతున్నాడని సమాధానమిచ్చారు. అదే సమయంలో డెలివరీ కోసం మహిళ రాగా స్టాఫ్నర్సులు ప్రసవం చేశారు. కలెక్టర్ వెంట డీఆర్డీవో పీడీ సుబ్రహ్మణ్యం, తహసీల్దార్ కృష్ణ, ఎంపీడీవో ఫారుఖ్హుస్సేన్, సర్పంచ్ అంబాల జంగయ్య ఉన్నారు.