వ్యవసాయ రంగానికి తెలంగాణ సర్కార్ పెద్దపీట వేస్తున్నది. అన్నదాతలు సాగు పెట్టుబడి కోసం ఇబ్బందులు పడవద్దని రైతుబంధు పథకంతో సాయం అందిస్తున్నది. ఎకరానికి రూ.10వేల చొప్పున ఈసారి అదునుకు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసింది. రంగారెడ్డి జిల్లాలో 3,15,000 మంది రైతులు ఉండగా, ఇప్పటి వరకు 2,73,716 మంది రైతుల ఖాతాల్లో రూ. 292.23 కోట్లను ప్రభుత్వం జమ చేసింది. మిగిలిన రైతులకూ ఒకటి, రెండు రోజుల్లో వారి ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నట్లు అధికారులు తెలుపుతున్నారు. సరైన సమయానికి డబ్బులు చేతికందడంతో రైతులు విత్తనాలు, ఎరువులను కొనుగోలు చేస్తున్నారు. నిరంతర విద్యుత్ సరఫరాతో పాటు అదునుకు వర్షాలు వస్తుండడం, మున్ముందుగానే పెట్టుబడికి సాయం అందడంతో సాగు పనులు పండుగలా సాగుతున్నాయి. ఉదయం లేచింది మొదలు పొలం పనుల్లో అన్నదాతలు బిజీ బిజీగా గడుపుతున్నారు. సాగు మొదలు పంట చేతికొచ్చి అమ్మే వరకు సర్కారు అండగా నిలుస్తుండడంతో రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
షాబాద్, జూన్ 23 : అన్నదాతల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం రైతు బంధు పథకం ద్వారా ఏడాదిలో ఎకరాకు రూ.10వేల పంటసాయం రైతులకు అందజేస్తున్నది. ఈ ఏడాది వానకాలం సీజన్కుగాను రైతు బంధు పథకం ద్వారా ఈ నెల 15 నుంచి ఎకరాకు రూ.5వేల చొప్పున అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం పంట పెట్టుబడి సాయం జమ చేస్తున్నది. దీంతో ధైర్యంగా అన్నదాతలు వ్యవసాయం చేసుకుంటున్నారు. పండించిన పంటలకు సైతం ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పిస్తుండడంతో అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటామని చెబుతున్నారు.
రంగారెడ్డిజిల్లాలో రూ. 292.23కోట్లు జమ
జిల్లాలోని 25 మండలాల్లో 3,15,000 మంది రైతులకుగాను ఇప్పటివరకు 2,73,716 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.292.23 కోట్లు పంట సాయం డబ్బులు జమచేశామని సంబంధిత వ్యవసాయాధికారులు చెబుతున్నారు.
రూ.10వేలు జమయ్యాయి : అంజయ్య, రైతు షాబాద్
వానకాలం పంటల సాగుకోసం ప్రభుత్వం నుంచి నాకున్న రెండెకరాల పొలానికి రూ.10వేలు నా బ్యాంకు ఖాతాలో జమయ్యాయి. ఆ డబ్బులను తీసుకుని ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేస్తాను. రైతు బంధు పథకంతో అన్నదాతలకు ఎంతో మేలు జరుగుతున్నది.
కేసీఆర్ రైతుల పక్షపాతి : జనార్దన్రెడ్డి, సింగప్పగూడ
ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా రైతును రాజుగా చేయడానికి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. రైతు బంధుతో వ్యవసాయానికి పెట్టుబడి అందజేస్తున్న సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతిగా నిలిచారు. ప్రభుత్వం అందిస్తున్న పెట్టుబడితో అనందంగా వ్యవసాయం చేస్తున్నాం.