శంకర్పల్లి, జూన్ 23 : పచ్చని తెలంగాణ కోసం సీఎం కేసీఆర్ హరితహారాన్ని చేపట్టారని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. బుధవారం మండల పరిషత్లో జరిగిన హరితహారం సమీక్షా సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ టార్గెట్ను కార్యదర్శులు తప్పనిసరిగా పూర్తి చేయాలన్నారు. ఈ సారి సీఎం కేసీఆర్ గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తారన్నారు. పట్టణం నగరానికి దగ్గరగా ఉన్నందున అన్ని రాష్ర్టాలు ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారని చెప్పారు. జిల్లాలో ఎక్కడా లేని విధంగా రూ.30 కోట్ల రూరల్ నిధులు గ్రామాలు, మున్సిపాలిటీకి మంజూరయ్యాయని తెలిపారు. మొక్కలు నాటి వాటిని సంరక్షణకు వార్డు సభ్యులు, ఎంపీటీసీలు చొరవ తీసుకోవాలని సూచించారు. గ్రామ కమిటీలు ఏర్పాటు చేసుకుని సమష్టి కృషితో అభివృద్ధి చేసుకోవాలన్నారు. మండలంలోని 55 మందికి కల్యాణలక్ష్మి, నలుగురికి షాదీముబారక్ చెక్కులను అందించారు.
1,19,110 మొక్కలు నాటుతాం..
పంచాయతీ సెక్రటరీలు, సర్పంచులు గ్రామాల్లో మొక్కలు నాటే స్థలాలను గుర్తించి వివరాలు తెలిపాలని ఎంపీడీవో సత్తయ్య అన్నారు. వైకుంఠధామాలు, పల్లెప్రకృతి వనాలు మొక్కలతో నిండి పోవాలన్నారు. సమావేశంలో ఎంపీపీ గోవర్ధన్రెడ్డి, జడ్పీటీసీ గోవిందమ్మ, తహసీల్దార్ కృష్ణకుమార్, ఎంఈవో అక్బరుద్దీన్, ఈవోఆర్డీ గీత, ఏపీఎం నాగభూషణం, మిర్జాగూడ సర్పంచ్ రవీందర్గౌడ్, సర్పంచుల సంఘం మండలాధ్యక్షుడు నర్సింహారెడ్డి పాల్గొన్నారు.
మున్సిపాలిటీ అభివృద్దికి కృషి చేయాలి
మున్సిపాలిటీ అధివృద్ధికి చైర్ పర్సన్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, అధికారులు పాటుపడాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య సూచించారు. బుధవారం మున్సిపాలిటీ వార్డు కౌన్సిలర్ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో యూజీడీ పనులు, సీసీ, బీటీ రోడ్ల పనులు ప్రారంభమయ్యాని వాటిని త్వరగా పూర్తి చేయాలని కోరారు. రూ.కోటి 50 లక్షలతో నిర్మిస్తున్న ఆడిటోరియం పనులు పూర్తి చేసేలా కాంట్రాక్టర్పై ఒత్తిడి తీసుకురావాలన్నారు. సమావేశంలో వైస్ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు రజని, మహబూబ్, షబానా బేగం పాల్గొన్నారు.