రంగారెడ్డి, జూన్ 21, (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని గ్రామీణ మహిళా సంఘాల సభ్యుల కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేయడంతో పాటు వారికి సుస్థిరమైన జీవనోపాధి కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం విలేజ్ ఎంటర్ప్రైజెస్ ఏర్పాటు ప్రక్రియ వేగవంతం అయ్యింది. విలేజ్ ఎంటర్పైజెస్ కార్యక్రమంలో భాగంగా గ్రామస్థాయిలో అక్కడి పరిస్థితులకు అనుగుణంగా వ్యాపారం చేయనున్నారు. అదేవిధంగా స్వయం సహాయక సంఘాల సభ్యులు వ్యాపారం చేసేందుకుగాను రుణాలు ప్రభుత్వమే మంజూరు చేయనుంది. రుణాలను బ్యాంకులు, సెర్ప్, స్త్రీనిధి ద్వారా తీసుకునేందుకు వెసులుబాటు కల్పించారు. జిల్లాలోని మహిళా సంఘాల సభ్యులకు రుణాల మంజూరుకు ప్రభుత్వం రూ.35 కోట్ల నిధులను ఇప్పటికే విడుదల చేసింది. జిల్లాలో విలేజ్ ఎంటర్ప్రైజెస్లో భాగంగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. ఎంపిక చేసిన ప్రతి సభ్యుడికి ఈ నెలాఖరులోగా రుణాలను అందజేసేందుకు డీఆర్డీఏ అధికారులు కసరత్తు చేస్తున్నారు. వచ్చేనెల మొదటి వారంలో ఎస్హెచ్జీ సభ్యులు ఎంపిక చేసుకున్న వ్యాపారాలకు సంబంధించి సామగ్రి కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయనున్నారు. వచ్చేనెల 15 నుంచి విలేజ్ ఎంటర్ప్రైజెస్లను ప్రారంభించి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు జిల్లా యంత్రాంగం చర్యతు తీసుకుంటున్నది.
ప్రత్యేక శిక్షణ..
ఎస్హెచ్జీ సభ్యులు వ్యాపారం చేసేందుకు ఒక్కో సభ్యురాలికి రూ.లక్ష నుంచి రూ.4 లక్షల వరకు రుణాలను మంజూరు చేస్తున్నారు. జిల్లాలో 2,989 ఎస్హెచ్జీ సభ్యులను ఎంపిక చేయగా 371 మంది స్వయం సహాయక సంఘాల సభ్యులకు రుణాలు మంజూరు చేశారు. మిగతా సభ్యులకు నెలాఖరు వరకు రుణాలు మంజూరు చేయనున్నారు. వ్యాపారంలోకి అడుగుపెడుతున్న ఎస్హెచ్జీ సభ్యులు నష్టపోకుండా వ్యాపారాలకు సంబంధించి మెళకువలు, నైపుణ్యాన్ని సెర్ప్ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణనిచ్చారు. ఉత్పత్తి, ట్రేడింగ్, సర్వీసు రంగాలకు సంబంధించి ఎస్హెచ్జీ సభ్యులకు శిక్షణనిప్పించారు.
సభ్యులు వేర్వేరు వ్యాపారాలు..
ఒక గ్రామంలోని మహిళా సంఘాల సభ్యులు ఒకే రకమైన వ్యాపారం కాకుండా ఒక్కొక్కరు ఒక్కో వ్యాపారం చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో 21 గ్రామీణ మండలాలు, 585 పంచాయతీలు, 753 గ్రామసంఘాలు, 19,631 స్వయం సహాయక సంఘాలుండగా 2.20 లక్షల మంది సభ్యులున్నారు. వీరిలో 2,989 మంది సభ్యులను ఎంపిక చేశారు.
21 మండలాల్లో 181 వ్యాపారాలు..
జిల్లాలో విలేజ్ ఎంటర్ప్రైజెస్లో భాగంగా ఉత్పత్తులు, ట్రేడింగ్, సేవా రంగాలకు సంబంధించి జిల్లాలోని 21 గ్రామీణ మండలాల్లో 181 రకాల వ్యాపారాలను జిల్లాలోని మహిళా స్వయం సహాయక సభ్యులు చేసేందుకు నిర్ణయించారు. ఉత్పత్తి రంగంలో పేపర్ ప్లేట్లు, కుండలు, బేకరీ, ఇటుకల తయారీ, ఇస్తారాకుల తయారీ, మగ్గం పనులు, పాపడ్, స్నాక్స్ యూనిట్, బాస్కెట్ తయారు, తట్టలు కుట్టడం, రోటీ, అగర్బత్తీ, క్యాండిల్, గుడ్డు ఆధారిత ఆహార ఉత్పత్తులు, స్టేషనరీ, ఫ్లోర్ క్లీనర్, జింజర్ గార్లిక్ పేస్ట్, లెమన్ గ్రాస్, చట్నీ తయారు, రైస్ మిల్, బీడీ తయారు, డిటర్జంట్ పౌడర్, పూజ సామగ్రి, చేనేత ఉత్పత్తి పరిశ్రమల వ్యాపారం చేసేందుకు నిర్ణయించారు. ట్రేడింగ్ రంగంలో కిరాణ దుకాణం, బట్టల వ్యాపారం, గాజుల దుకాణం, ఫ్యాన్సీ స్టోర్, కూరగాయల వ్యాపారం, డెయిరీ, పౌల్ట్రీ, గుడ్ల వ్యాపారం, ఫెర్టిలైజర్ దుకాణం, హార్డ్వేర్ షాప్, ఎలక్ట్రికల్ షాప్, బియ్యం, పప్పు వ్యాపారం, పూలు, పండ్లు, చేపలు, పాన్ షాప్ తదితర వ్యాపారాలను గుర్తించారు. సర్వీసు రంగంలో హోటల్, టిఫిన్ సెంటర్, టైలరింగ్, మటన్, చికెన్ షాప్, సెలూన్, జిరాక్స్, పిండి గిర్నీ, వాటర్ ప్లాంట్, పాల వ్యాపారం, బ్యూటీ పార్లర్, ఇస్త్రీ దుకాణం, మొబైల్ ఫోన్ మెకానిక్, ఆటో రిక్షా కొనుగోలు, స్కూటర్, ఆటో మెకానిక్, బోర్వెల్ రిపేర్, ఎయిర్ పంపింగ్, ఫంక్చర్, సిమెంట్, కాంక్రీట్ మిక్చర్, మెడికల్ షాప్, టెంట్ సైప్లె సర్వీసు, వెల్డింగ్ షాప్, కెమెరా ఫొటో స్టూడియో తదితర వ్యాపారాలు చేసేందుకు జిల్లాలోని మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు ముందుకొచ్చారు.
ఆగస్టు 15 నుంచి ప్రారంభం:డీఆర్డీఏ ఏపీడీ కె.జంగారెడ్డి
విలేజ్ ఎంటర్ప్రైజెస్లను వచ్చేనెల 15 నుంచి ప్రారంభించి అందుబాటులోకి తీసుకురానున్నాం. మంత్రి సబితాఇంద్రారెడ్డి చేతుల మీదుగా ఎంటర్ప్రైజెస్ను ప్రారంభించనున్నాం. రుణాల గ్రౌండింగ్ ప్రక్రియ వేగంగా జరుగుతున్నది, ఈ నెలాఖరుకు గ్రౌండింగ్ పూర్తి చేస్తాం.