రంగారెడ్డి జిల్లాల్లో పది రోజుల్లో 10 నుంచి 15 శాతం మేర తగ్గిన పాజిటివ్ కేసులు
వికారాబాద్ జిల్లాలో 5శాతం తగ్గుదల..
పట్టణాలు, గ్రామాల్లో పకడ్బందీగా లాక్డౌన్
సత్ఫాలితానిస్తున్న మెడికల్ కిట్ల పంపిణీ
రంగారెడ్డి, మే 21, (నమస్తే తెలంగాణ) / వికారాబాద్, మే 21,(నమస్తే తెలంగాణ) : ఉమ్మడి జిల్లాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కొన్ని రోజులుగా క్రమంగా కొవిడ్ పాజిటివ్ కేసులు తగ్గుతుండడం గమనార్హం. పదిరోజుల్లో రంగారెడ్డి జిల్లాలో 10 నుంచి 15 శాతం మేర కరోనా పాజిటివ్ కేసులు తగ్గాయి. గతంలో రోజుకు 300 నుంచి 350 వరకు కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా.. ప్రస్తుతం సుమారు 15 శాతం తక్కువగా నమోదవుతున్నట్లు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. అలాగే వికారాబాద్ జిల్లాలో 5 నుంచి 8శాతం మేర కేసులు తక్కువగా నమోదవుతున్నాయి. లాక్డౌన్, వ్యాక్సినేషన్, ఇంటింటా ఫీవర్ సర్వేలో మందుల కిట్లు పంపిణీ చేయడమే కేసులు తగ్గడానికి ప్రధాన కారణమని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా లాక్డౌన్, ఫీవర్ సర్వే మంచి సత్ఫలితాన్నిస్తున్నాయి.
ఫీవర్ సర్వేలో భాగంగా కరోనా లక్షణాలున్నవారికి ముందుగానే మందులు అందించి వైరస్ను ఆదిలోనే కట్టడి చేయగలిగారు. అలాగే లాక్డౌన్ను కఠినంగా అమలు చేయడంతో జనం ఇంటికే పరిమితవడంతో చాలావరకు వైరస్ వ్యాప్తికి అడ్డుకట్టపడింది. అంతేకాకుండా వ్యాక్సిన్ కొరత కారణంగా ప్రస్తుతం పంపిణీని నిలిపివేసినప్పటికీ.. ఇప్పటివరకు రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 45 ఏండ్లుపైబడిన వారికి ఫస్ట్, సెకండ్ డోసులు కలిపి మొత్తం 4,91,730 డోసులు, వికారాబాద్ జిలాలో 76వేల మందికి టీకా అందించారు. వ్యాక్సినేషన్ కూడా కరోనా కేసులు తగ్గడానికి ప్రధానం కారణం. ఉమ్మడి జిల్లాలో మొత్తం 90 కేంద్రాల్లో ప్రతిరోజు వీలైనంతా ఎక్కువ మందికి కరోనా పరీక్షలు చేస్తున్నారు. వికారాబాద్ జిల్లాలో ఈ నెల 14వ తేదీ వరకు 2,36,596 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అయితే ప్రస్తుతం జిల్లాలో సుమారు 6వేల యాక్టివ్ కేసులు ఉన్నాయి.
జ్వర సర్వేతో సత్ఫలితాలు…
జిల్లాలో దాదాపు పదిహేను రోజులపాటు నిర్వహించిన ఫీవర్ సర్వేలో ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, పంచాయతీ కార్యదర్శులతో కూడిన బృందాలు ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజల ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. రెండు విడుతల్లో సర్వే చేపట్టగా.. మొదటి విడుతలో కొవిడ్ లక్షణాలున్నట్లు గుర్తించిన కుటుంబాలను నాలుగు రోజుల అనంతరం రెండోసారి సర్వే చేసి ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీశారు. మొదటి విడుతలో లక్షణాలు ఉన్నవారికి పారాసిటమాల్, యాంటిబయాటిక్స్, మల్టీ విటమిన్ మందులతో కూడిన కిట్స్ అందజేసిన సర్వే బృందాలు.. రెండోసారి సర్వేలోనూ జ్వరం, ఇతర లక్షణాలు తగ్గనట్లు తేలితే పారాసిటమాల్, యాంటిబయాటిక్స్, మల్టీ విటమిన్లతోపాటు 12 రకాల స్టెరాయిడ్ ట్యాబ్లెట్లతో కూడిన కిట్స్ అందజేశారు. దీంతో చాలావరకు వైరస్ వ్యాప్తిని తగ్గించగలిగారు. వికారాబాద్ జిల్లాలో మొదటి, రెండో విడుతలు పూర్తికాగా.. మూడో విడుత సర్వే కొనసాగుతున్నది. జిల్లాలో 8 మండలాల్లో అధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయని గుర్తించిన అధికారులు అక్కడ మరోసారి సర్వే చేస్తూ లక్షణాలతో బాధపడుతున్నవారికి మందులు అందిస్తున్నారు.
కట్టుదిట్టంగా లాక్డౌన్..
పది రోజులుగా జిల్లా అంతటా లాక్డౌన్ను పకడ్బందీగా అమలుచేస్తున్నారు. రోజుకు 20 గంటలపాటు లాక్డౌన్ అమలులో ఉండడంతో అత్యవసర సర్వీసులకు సంబంధించినవారు మినహా ప్రజలెవరూ బయటకు రావడం లేదు. అనవసరంగా బయటకు వస్తే వాహనాలను సీజ్ చేయడంతోపాటు కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 200 వరకు లాక్డౌన్ ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. ఎక్కడికక్కడ చెక్పోస్టులు ఏర్పాటు చేసి పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. దీంతో ప్రజలు ఇండ్లలోనే ఉంటూ కరోనా కట్టడిలో మేము సైతం అంటూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. లాక్డౌన్ సడలింపు సమయంలో కూరగాయల మార్కెట్లలో జనం రద్దీ తగ్గించడానికి వికారాబాద్ జిల్లాలో తాత్కాలిక మార్కెట్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. టిఫిన్ సెంటర్లలో పార్సిళ్లు మాత్రమే అనుమతిస్తున్నారు. ఆ దిశగా పోలీస్, ఫుడ్ ఇన్స్పెక్టర్, ఇతర శాఖల అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
కేసులు తగ్గుతున్నాయి..
జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ఇంటింటి ఫీవర్ సర్వేతోపాటు లాక్డౌన్ అమలు, వ్యాక్సినేషన్ తదితరాలతో జిల్లాలో పది రోజులుగా పాజిటివ్ బారిన పడే వారి సంఖ్య తగ్గుతున్నది. జిల్లాలో 10 నుంచి 15 శాతం పాజిటివ్ కేసులు తగ్గాయి. ప్రజలంతా లాక్డౌన్ వెసులుబాటు సమయంలో తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలను పాటించాలి.
-డాక్టర్ స్వరాజ్యలక్ష్మి, రంగారెడ్డి జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి