ధారూరు, జూలై 20 : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో దోర్నాల్ గ్రామం అభివృద్ధిలో దూసుకుపోతున్నది. సర్పంచ్ సుజాత వెంకట్ రాంరెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని గ్రామాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నారు. గ్రామంలో పలె ్లప్రగతిని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటూ అభివృద్ధిలో ఆదర్శంగా నిలిచారు. గ్రామంలో ముఖద్వారం నుంచి రోడ్డుకు ఇరువైపులా హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు స్వాగతం పలుకుతున్నాయి. సీసీ రోడ్లు, ప్రతి ఇంటి ముందు పచ్చని చెట్టు, విద్యుత్ కాంతుల్లో పల్లె కళకళలాడుతున్నది. ఆహ్లాదకరమైన పల్లె ప్రకృతి వనం, గ్రామ నర్సరీ అందంగా కనిపిస్తున్నాయి. డంపింగ్ యార్డు, వైకుంఠధామం, కంపోస్టు షెడ్డు, మిషన్ భగీరథతో ప్రతి ఇంటికీ తాగునీటి సరఫరా, ఇంటింటా వ్యక్తిగత మరుగుదొడ్డి, ఇంకుడుగుంతలతో పల్లె అభివృద్ధిలో దూసుకెళ్తున్నది.
రూ.కోటి వరకు నిధులు..
రెండేండ్లలో గ్రామాభివృద్ధికి సుమారుగా కోటి రూపాయల వరకు నిధులు కేటాయించింది తెలంగాణ ప్రభుత్వం. రూ.11 లక్షలతో వైకుంఠధామం, రూ.2.5 లక్షలతో కంపోస్టు షెడ్డు, రూ.10 లక్షలతో సీసీ రోడ్డు, రూ.2 లక్షలతో మురుగు కాల్వల నిర్మాణం, రైతు కల్లాలకు రూ.55 లక్షలు, పల్లె ప్రకృతి వనానికి రూ.1.07 లక్షలు, ఇంకుడు గుంతలకు రూ.9.75 లక్షలు, గ్రామ నర్సరీకి రూ.71వేలు కేటాయించారు.
పచ్చందాలతో స్వచ్ఛ వీధులు
పల్లె శుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో పంచాయతీకి ట్రాక్టర్ కొనుగోలు చేసి పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతి రోజు ఉదయం ఇంటింటికీ తిరుగుతూ తడి, పొడి చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. పచ్చదనాన్ని పెంపొందించేందుకు గ్రామంలోని నర్సరీలో 11 వేల మొక్కలు పెంచుతున్నారు. గ్రామంలోని ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటి, వాటిని సంరక్షించుకుంటున్నారు. పల్లె ప్రకృతి వనంతో గ్రామంలో పచ్చదనం ఏర్పడింది. ఇందులో 16 వందల మొక్కలు పెంచుతున్నారు. కొబ్బరి, అశోక, అల్లనేరేడు, చైనా బాదంతో పాటు తదితర మొక్కలను సంరక్షిస్తున్నారు.
మా పల్లెలో అనేక మార్పులు
పల్లె ప్రగతి కార్యక్రమంతో మా పల్లె రూపురేఖలు మారాయి. ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు పల్లె ప్రగతి, 30 రోజుల ప్రణాళికతో గ్రామంలో అనేక మార్పులు జరిగాయి. గ్రామస్తులు, అధికారుల సహకారంతో అభివృద్ధిలో దూసుకుపోతున్నాం. వైకుంఠధామం, కంపోస్టు షెడ్డు, డంపింగ్ యార్డు, పల్లె ప్రకృతి వనం, నర్సరీ, ఇంటింటికీ ఇంకుడు గుంత, వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించాం. మిషన్ భగీరథతో తాగునీటిని అందిస్తున్నాం.
– సుజాత, సర్పంచ్, దోర్నాల్
ప్రజల సహకారంతో గ్రామాభివృద్ధి
తెలంగాణ ప్రభుత్వం హయాంలో దోర్నాల్ గ్రామం ఎంతో అభివృద్ధి చెందింది. గ్రామంలో అందరి సహకారంతో అభివృద్ధి చేశాం. పల్లె ప్రగతి కార్యక్రమంలో అన్ని అభివృద్ధి పనులు పూర్తి చేశాం. మిషన్ భగీరథతో ప్రతి ఇంటికీ తాగునీటిని సరఫరా చేస్తున్నాం. రోజువారీ పారిశుధ్య పనులు చేయిస్తున్నాం. గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నాం.