రెండో విడుతలో కేవలం 404 మందికి ఫీవర్ లక్షణాలు..
మొదటి విడుతలో 8523 మందికి..
రంగారెడ్డి జిల్లాలో జ్వర సర్వే పూర్తి
రంగారెడ్డి, మే 20, (నమస్తే తెలంగాణ): జిల్లాలో కొవిడ్ లక్షణాలున్న వారి లెక్కతేలింది. అయితే జిల్లావ్యాప్తంగా జ్వర లక్షణాలు కలిగి ఉన్న వారు చాలా స్వల్పంగా ఉన్నారు. జిల్లాలో గత పదిహేను రోజులుగా సర్వేలో భాగంగా వైద్య బృందాలు ఇంటింటికీ వెళ్లి కొవిడ్ లక్షణాలున్న వారి వివరాలను సేకరించాయి. రెండు విడుతల్లో సర్వే నిర్వహించగా.. మొదటి విడుతలో ఫీవర్ లక్షణాలున్నవారిని వారం రోజుల తర్వాత తిరిగి వారి ఆరోగ్య పరిస్థితి వివరాలను సేకరించారు. ఇందులో అధిక మందికి జ్వర లక్షణాలున్నట్లు గుర్తించి కొవిడ్ పాజిటివ్ కేసులు అధికంగా నమోదయ్యే అవకాశాలున్నాయని ఆందోళన పడిన సంబంధిత అధికారులు రెండో విడుత సర్వేలో తక్కువ మందిలో లక్షణాలు కనిపించడంతో ఊపిరిపీల్చుకున్నారు. ఫీవర్ ఉన్నవారి వివరాలను తెలుసుకొని వారం రోజులైనా జ్వరం తగ్గనట్లయితే వారికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అంతేకాకుండా ఫీవర్తోపాటు ఇతర లక్షణాలున్నవారికి కూడా 12 రకాల ట్యాబ్లెట్లతో కూడిన కిట్లను అందజేశారు. అయితే సర్వేలో భాగంగా ఎక్కువ మంది భయంతో అనారోగ్యం బారిన పడుతున్నట్లు గుర్తించారు, పక్కింటి వారికి, కుటుంబంలో, బంధువుల్లో ఎవరికి కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయినా.. తమకు కూడా వస్తుందేమోనన్న భయమే ఎక్కువ మందికి ఉన్నట్లు వెల్లడైంది. అంతేకాకుండా భయంతో గుండె నొప్పి ఉందని వారి సంఖ్య కూడా అధికంగా ఉన్నట్లు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు తెలిపారు. భయంతోనే శ్వాస సంబంధమైన సమస్యలు వస్తున్నాయని, భయం వీడితేనే పాజిటివ్ వచ్చినవారు త్వరగా కోలుకోగలరని అధికారులు సూచిస్తున్నారు.
కేవలం 404 మందికి ఫీవర్ లక్షణాలు…
జిల్లావ్యాప్తంగా 6,69,551 కుటుంబాలకు సంబంధించి సర్వే నిర్వహించారు. మొదటి విడుతలో జ్వరంతోపాటు ఒళ్లు నొప్పులు, తలనొప్పి, జలుబు, దగ్గు లక్షణాలున్న వారు 16,421 మంది ఉండగా.. వీరిలో కేవలం జ్వర లక్షణం ఉన్నావారు 8523 మంది ఉన్నట్లు లెక్కతేల్చారు. అయితే మొదటి విడుత సర్వే అనంతరం ప్రధానంగా ఫీవర్ లక్షణాలున్న వారి ఇంటింటికి వెళ్లి మరోసారి సర్వే నిర్వహించారు. ఫీవర్ తగ్గకుండా వారం రోజులుగా ఉన్నట్లయితే వారిని కరోనా పరీక్ష నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి రెఫర్ చేశారు. రెండో విడుతలో కేవలం 404 మందికి మాత్రమే ఫీవర్ లక్షణాలున్నట్లు గుర్తించారు. వీరందరికి కరోనా పరీక్షలను నిర్వహించడంతోపాటు ప్రభుత్వం అందజేసిన కిట్లు పంపిణీ చేశారు. అయితే ఫీవర్ సర్వేలో భాగంగా అధికంగా ఒళ్లు నొప్పులు, తలనొప్పి, జలుబు, దగ్గు లక్షణాలు ఉన్నవారే అధికంగా ఉన్నట్లు సర్వే ద్వారా వెల్లడైంది.
గర్భిణుల సర్వే…
లాక్డౌన్ కొనసాగుతున్న దృష్ట్యా గర్భిణులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఈ మేరకు జిల్లావ్యాప్తంగా ప్రసవానికి దగ్గరగా ఉన్న గర్భిణుల వివరాలను అంగన్వాడీ కార్యకర్తలు సేకరించారు. ప్రసవానికి పది నుంచి పదిహేను రోజులు గడువున్నవారి వివరాలను సేకరించడంతోపాటు వారు కాన్పు అయ్యే వరకు అంగన్వాడీ సిబ్బంది ప్రతిరోజు గర్భిణుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోనున్నారు. పురిటి నొప్పులపై సమాచారం అందిన వెంటనే ఇంటికి అంబులెన్స్ పంపించి ఆసుపత్రికి చేరవేయనున్నారు. డెలివరీకి ముందే గర్భిణులకు కరోనా పరీక్షలు నిర్వహించి పాజిటివ్ వస్తే గాంధీ దవాఖానకు, నెగిటివ్ వస్తే స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించనున్నారు. కాగా జిల్లావ్యాప్తంగా ఈనెలలో 1133 మంది ప్రసవమయ్యే వారున్నట్లు గుర్తించారు. వీరిలో ఆమన్గల్లులో 50 మంది, చేవెళ్లలో 92, హయత్నగర్లో 180, ఇబ్రహీంపట్నంలో 171, మహేశ్వరంలో 69, శేరిలింగంపల్లిలో 311, షాద్నగర్లో 260 మంది ఉన్నారు.