కుటుంబ సభ్యులు, ఆత్మీయులు మరణించినప్పుడు ఆ శోకం ఎవరూ తీర్చలేనిది. కన్నుమూసి అనంతలోకాలకు వెళ్లిపోయిన వారిని కడచూపు చూసేందుకు ఎంత దూరంలో ఉన్న వారైనా సరే.. రావాల్సిందేననేది పెద్దలు చెప్పే మాట. కానీ ఆ ఆచివరి చూపునకు కూడా నోచుకోకుండా ఎంతోమంది దుఃఖసాగరంలో మునిగిపోతుంటారు. అందుకూ కారణమూ లేకపోలేదు. చాలా సందర్భాల్లో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం మృతదేహాలను ఎక్కువ కాలం ఉంచలేకపోతుంటారు. అలాంటి వారి కష్టాలను గుర్తించిన మంత్రి మల్లారెడ్డి మేడ్చల్ నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాలకు మృతదేహాలను భద్రపర్చేందుకు ఫ్రీజర్లను అందించాలని నిర్ణయించారు. దాదాపు 50 లక్షల రూపాయలు ఖర్చయినా సరే.. ఎంతోమందికి ఊరట కల్పించాలని సంకల్పించిన ఈ సత్కార్యాన్ని ఇప్పటికే ప్రారంభించారు కూడా. గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో దీని నిర్వహణ చూస్తూ ఎవరికైనా ఉచితంగానే అందించేలా ఏర్పాట్లు సైతం చేశారు.
మేడ్చల్ రూరల్, మే 20 : మేడ్చల్ నియోజకవర్గంలో 62 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ గ్రామాల్లో ఎవరైనా మృతి చెందినప్పుడు దూరంగా ఉన్న అయినవాళ్లు వచ్చే వరకు ఫ్రీజర్లను వాడటం పరిపాటే. అయితే ఈ ఫ్రీజర్ల కోసం రోజుకు రూ.7 నుంచి రూ.8 వేలు చెల్లించాల్సి వస్తుంది. ఇది నిరుపేదలకు ఎంతో భారంగా మారింది. ఈ విషయాన్ని గుర్తించిన ఎంపీపీ పద్మాజగన్రెడ్డి, డబిల్పూర్ పీఏసీఎస్ చైర్మన్ సురేశ్రెడ్డి, మరికొంత మంది ప్రజాప్రతినిధులు మంత్రి మల్లారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ప్రతి గ్రామానికి ఫ్రీజర్ ఉంటే బాగుంటుందని, దీంతో నిరుపేద కుటుంబాలకు మేలు జరుగుతుందని విజ్ఞప్తి చేశారు. దీంతో వెంటనే స్పందించిన మంత్రి ప్రతి గ్రామానికి ఒక ఫ్రీజర్ అందజేయాలని నిర్ణయించారు.
శ్రీరంగవరంతో శ్రీకారం..
స్థానిక ప్రజాప్రతినిధులు చెప్పిన వెంటనే ఒప్పుకున్న మంత్రి దాన్ని వాయిదా వేయలేదు. వెంటనే ఆచరణలో పెట్టారు. దాదాపు రూ.50 లక్షల సొంత నిధులతో ఫ్రీజర్లను తయారు చేయాలని ఆదేశించారు. మొదటి దశలో మేడ్చల్ మండలం నుంచి ఇవ్వడం ప్రారంభించాలని సంకల్పించారు. అనుకున్నదే తడవుగా మేడ్చల్ మండలంలోని శ్రీరంగవరం నుంచి ఫ్రీజర్ల అందజేత కార్యక్రమాన్ని ప్రారంభించారు. రెండు రోజుల కింద (మంగళవారం) ఆయన మేడ్చల్ ప్రభుత్వ దవాఖానతో పాటు శ్రీరంగవరం గ్రామానికి సంబంధించిన ఫ్రీజర్ను గ్రామ సర్పంచ్ విజయేందర్రెడ్డి, జడ్పీటీసీ సభ్యురాలు శైలజారెడ్డికి అందజేశారు. వారంరోజుల్లో మండలంలోని మిగతా గ్రామాలకు అందజేయనున్నట్లు ప్రకటించారు. ఈ ఫ్రీజర్లను గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఎవరికి అవసరమైన ఉచితంగా అందజేస్తారు.
పేదలకు ఎంతో మేలు..
ఫ్రీజర్లను ఉపయోగించడం నిరుపేదలకు ఎంతో భారంగా మారింది. అంత్యక్రియలు నిర్వహించడానికి ఎంత ఖర్చు చేయాల్సి వస్తుందో అంతే మొత్తం కేవలం ఫ్రీజర్కు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈ విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే ఆయన స్పందించి అన్ని గ్రామాలకు ఫ్రీజర్లు ఇచ్చేందుకు ఒప్పుకున్నారు. ఈ మేరకు ఆర్డర్ ఇచ్చి ఫ్రీజర్లను తయారు చేయిస్తున్నారు. నిరుపేదల బాధలను గుర్తించి, ఫ్రీజర్లను అందజేస్తున్న మంత్రికి ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు.