సిటీబ్యూరో, జూన్ 16 (నమస్తే తెలంగాణ) : వ్యాక్సిన్తోనే కరోనా కట్టడి సాధ్యమని రంగారెడ్డి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ స్వరాజ్యలక్ష్మి అన్నారు. జిల్లా పరిధిలో తలసేమియా బాధితులతో పాటు హైరిస్క్లో ఉన్నవారికి, ప్రజలతో నేరుగా సంబంధాలున్న ప్రభుత్వ శాఖల సిబ్బందికి వేగంగా వ్యాక్సిన్ ఇస్తున్నట్లు వివరించారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 5,50,215 మందికి టీకాలు వేసినట్లు తెలిపారు. బుధవారం జిల్లా పరిధిలోని పలు టీకా కేంద్రాలను స్వరాజ్యలక్ష్మి ఆకస్మికంగా తనిఖీ చేశారు. టీకా కేంద్రాల్లో నెలకొన్న పరిస్థితులు, ఏర్పాట్లు, కరోనా నియమాలు, అమలు జరుగుతున్న తీరు తదితర అంశాలను పరిశీలించారు. కొన్ని చోట్ల భౌతిక దూరం కనిపించకపోవడంపై సంబంధిత ఆరోగ్య కేంద్రాల అధికారులను ప్రశ్నించారు. రాజధాని ఫంక్షన్హాల్, సరూర్నగర్లో పోలీసు సిబ్బందికి నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పరిశీలించారు. సరూర్నగర్ పీహెచ్సీలో భౌతిక దూరం పాటించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైద్యాధికారి డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ దీన్దయాళ్కు పలు సూచనలు చేశారు. టీకా కేంద్రాల్లో కరోనా నియమాలు కచ్చితంగా పాటించేలా చూడాల్సిన బాధ్యత సంబంధిత మెడికల్ ఆఫీసర్లదేనని అధికారులకు వివరించారు.
రంగారెడ్డి జిల్లా పరిధిలోని 44 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ కొనసాగుతున్నదన్నారు. ప్రజలతో నేరుగా సంబంధాలున్న ప్రభుత్వ శాఖల సిబ్బంది కోసం మున్సిపాలిటీల పరిధిలో 15 కేంద్రాలు, పోలీసు సిబ్బంది కోసం 3 కేంద్రాల్లో టీకాలు వేస్తున్నట్లు వివరించారు. జిల్లా పరిధిలో ఉన్న తలసేమియా బాధితులు, క్యాన్సర్ రోగులతోపాటు అన్ని ప్రభుత్వ శాఖల సిబ్బందికి వ్యాక్సిన్ అందిస్తున్నామన్నారు. ఇప్పటివరకు 2,16,129 మంది సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సిన్ వేసినట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ సూచనల మేరకు వైద్య సిబ్బందిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ, టీకా కార్యక్రమాన్ని నిరాటంకంగా కొనసాగిస్తున్నామన్నారు. వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ అప్రమత్తంగా ఉంటూ, సామూహిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సూచించారు. దూర ప్రయాణాలు, వివాహాలు, పార్టీల వంటికి మరికొన్ని రోజులు వాయిదా వేసుకోవడం మంచిదని పేర్కొన్నారు.