బొంరాస్పేట, జూన్ 16 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంపై నిర్లక్ష్యం వీడాలని, సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు బాధ్యతతో పని చేయాలని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. ఎంపీపీ హేమీబాయి అధ్యక్షతన బుధవారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పల్లె ప్రగతి పనులపై సీఎం కేసీఆర్తో పాటు జిల్లా ఉన్నతాధికారులు ఆకస్మిక తనిఖీలు చేసే అవకాశం ఉందన్నారు. గ్రామాల్లో అసంపూర్తిగా పనులను సత్వరమే పూర్తి చేయాలని, లేదంటే అధికారులు, సర్పంచ్లు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. గ్రామసభలను రెగ్యులర్గా నిర్వహించాలని, హరితహారంలో నాటిన మొక్కలు చనిపోతే వాటి స్థానంలో పొడవైన మొక్కలు నాటాలని ఆదేశించారు. మండలంలో నిర్మిస్తున్న చెక్డ్యామ్లకు ఇసుక కొరత లేకుండా చూడాలని తాసిల్దార్ను ఆదేశించారు. బొంరాస్పేటలో వైకుంఠధామం నిర్మాణ పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
బొంరాస్పేట, జూన్ 16 : గ్రామాలు, పట్టణాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని రేగడిమైలారం గ్రామంలో రూ.10 లక్షలతో నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీ భవనం, రూ.11లక్షలతో నిర్మించిన వైకుంఠధామాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి మొక్కలు నాటారు. సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. బొంరాస్పేటలో ఆహార భద్రత పథకం ద్వారా రైతులకు ఉచితంగా కంది, పెసర విత్తనాలను పంపిణీ చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా గ్రామాలు, పట్టణాల రూపు రేఖలు మారుతున్నాయని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ హేమీబాయి, వైస్ ఎంపీపీ నారాయణరెడ్డి, జడ్పీటీసీ చౌహాన్ అరుణాదేశు, పీఏసీఎస్ చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డి, రైతుబంధు మండల అధ్యక్షుడు మహేందర్రెడ్డి, ఏవో రాజేష్కుమార్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కోట్ల యాదగిరి, సర్పంచ్ రాజేశ్వరి, ఎంపీటీసీ జగదీశ్, పార్టీ నాయకులు చాంద్పాషా, శ్యామలయ్యగౌడ్, గోవింద్రెడ్డి పాల్గొన్నారు.
ఎంపీడీవో మాకొద్దు.. సభ్యుల తీర్మానం
బొంరాస్పేట, జూన్ 16 : మండల పరిషత్ అభివృద్ధి అధికారి ప్రవీణ్కుమార్ తమకు వద్దంటూ బుధవారం జరిగిన బొంరాస్పేట మండల సర్వసభ్య సమావేశంలో సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఎంపీడీవోను జడ్పీకి సరెండర్ చేయాలని తీర్మానించారు. వైస్ ఎంపీపీ నారాయణరెడ్డి మాట్లాడుతూ ఎంపీడీవో ప్రవీణ్కుమార్ సర్పంచ్లు, ఎంపీటీసీలకు తగిన గౌరవం ఇవ్వడం లేదని, అధికారులను కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆరోపించారు. ఎంపీడీవో వైఖరి కారణంగా మండలంలో అభివృద్ధి పనులు కుంటుపడ్డాయని అన్నారు. ఆయన స్థానంలో మరో అధికారిని ఎంపీడీవోగా నియమించాలని ఆయన ఎమ్మెల్యే నరేందర్రెడ్డిని కోరారు. వైస్ ఎంపీపీ చేసిన ప్రతిపాదనను సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించి తీర్మానం చేశారు.