అనుమతి లేకుండా ఆర్టీపీసీఆర్ పరీక్షలు ఎలా చేస్తారు
రంగారెడ్డి జిల్లా వైద్యాధికారిని డాక్టర్ స్వరాజ్యలక్ష్మి
షాద్నగర్, మే15: కొవిడ్కు వైద్యం అందిస్తున్న ప్రైవేటు దవాఖానల్లో వసతులు సరిగ్గా లేవని, పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయని జిల్లా వైద్యాధికారిని డాక్టర్ స్వరాజ్యలక్ష్మి ఆగ్రహం వ్యక్తంచేశారు. కొవిడ్ రోగులకు సంబంధించిన పూర్తి వివరాలు పరీక్షల పత్రాల్లో ఉండాలన్నారు. పట్టణంలోని పలు ప్రైవేట్ దవాఖానలు, వైద్య పరీక్షల కేంద్రాలపై జిల్లా వైద్య అధికారుల బృందం శనివారం ఆకస్మికంగా తనిఖీలు చేసింది. రోగుల రికార్డులు, వైద్య సేవల తీరును పరిశీలించారు. జిల్లా వైద్యాధికారిని డాక్ట ర్ స్వరాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో పలు దవాఖానలు, డయాగ్నస్టిక్ కేంద్రాల ను తనిఖీ చేసి, వాటి నిర్వహణ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలోని మహాబోధి డయాగ్నస్టిక్ కేంద్రంలో సిబ్బంది తీరు బాగాలేదని మండిపడ్డారు. రోగులకు సంబంధించిన వివరాల నమోదు, పరీక్షల తీరు పై తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. పరీక్షల తీరుపై ప్రజల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. అనుమతులు లేకుండా ఆర్టీపీసీఆర్ పరీక్షలు ఎలా చేస్తారని, అందుకు రూ.1,100 ఏ ప్రాతిపదికన వసూలు చేస్తారని ఆగ్రహం వ్యక్తంచేశారు. వైద్య పరీక్ష కేంద్రం నిర్వహణ తీరులో మార్పు రాకుంటే సీజ్ చేస్తామని హెచ్చరించారు. పలు ప్రైవేట్ దవాఖానలను తనిఖీ చేసి వైద్య సేవల వివరాలపై ఆరా తీశారు.