కొత్తూరుకు మరిన్ని పరిశ్రమలు
త్వరలోనే పాలమూరు ఎత్తిపోతలను పూర్తిచేస్తాం
అర్హులందరికీ రేషన్ కార్డులు
తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం.. నిరంతర విద్యుత్ సరఫరా
అన్నివర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
అభివృద్ధిని ఆశీర్వదించండి
రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్
షాద్నగర్/కొత్తూరు, ఏప్రిల్14 : కొత్తూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో టీఆర్ఎస్ సత్తా చాటాలని రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. షాద్నగర్ ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ ఆధ్వర్యంలో బుధవారం కొత్తూరు మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ వస్తే ఇక్కడి భూముల ధరలు పడిపోతాయి.. పరిశ్రమలు మూతపడుతాయి అన్నవారు.. నేడు ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నారన్నారు. కొత్తూరు పారిశ్రామికవాడలో నూతన పరిశ్రమలు వెలుస్తున్నాయన్నారు. షాద్నగర్ ప్రాంతం గతంతో పోలిస్తే చాలా అభివృద్ధి చెందిందని, త్వరలో రానున్న రీజినల్ రింగ్ రోడ్డుతో మరింత ప్రగతి సాధిస్తుందన్నారు. ఆర్ఆర్ఆర్, ఔటర్ రింగ్ రోడ్డు మధ్యలో ఉండే కొత్తూరు ప్రాంతానికి ఉజ్వల భవిష్యత్ ఉందన్నారు.
రీజినల్ రింగ్ రోడ్డుతో రైతులతోపాటు అన్ని వర్గాలకు ప్రజలకు లబ్ధిచేకూరనుందన్నారు. ఎర్రటి ఎండల్లోనూ రాష్ట్రంలోని చెరువులు గోదారి, కృష్ణా జలాలతో నిండుతున్నాయంటే సీఎం కేసీఆర్ కృషితోనే సాధ్యమైందన్నారు. ఎండకాలంలోనూ ప్రతి ఇంటికి తాగునీరు అందుతుందన్నారు. మిషన్ భగీరథతో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపామన్నారు. సమైక్య పాలకుల హయాంలో రూ. 200 పింఛన్ ఇస్తే కనీస అవసరాలకు కూడా సరిపోయేవి కావన్నారు. నేడు సీఎం కేసీఆర్ రూ.2016 అందించి వారి ఆత్మగౌరవాన్ని పెంచారన్నారు. అంతేకాకుండా కుటుంబంలో ఎంతమంది ఉన్నా.. ఒకొక్కరికి 6 కిలోల చొప్పున బియ్యం అందజేస్తూ పేదల కడుపునింపుతున్నారన్నారు.
పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం గురుకులాను ఏర్పాటుచేసి ఒక్కో విద్యార్థిపై రూ.1.20 లక్షల ఖర్చుచేస్తుందన్నారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు విదేశాల్లో విద్యను అభ్యసించేందుకు ఒక్కొక్కరికి రూ.25 లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తుందని తెలిపారు. వ్యవసాయరంగానికి పెద్దపీట వేయడమే కాకుండా రైతులకు 24 గంటలపాటు ఉచితంగా విద్యుత్ను అందిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని చెప్పారు. రైతుల శ్రేయస్సు కోసం రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు పకడ్బందీగా అమలు చేస్తున్నామన్నారు. నాడు సర్కారు దవాఖానకు వెళ్లాలంటే భయపడే జనం.. నేడు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలతో ఎలాంటి సందేహాలు లేకుండా వెళ్తున్నారన్నారు. కేసీఆర్ కిట్లు, ఆర్థికసాయంతో ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. వేలాది గిరిజన తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత కూడా సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు.
పనిచేసే ప్రభుత్వానికి, నాయకలకు ప్రజల ఆశ్వీరాదం ఉండాలన్నారు. మరింత అభివృద్ధి చేసేందుకు మున్సిపాలిటీ ఎన్నికల్లో టీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు. నేడు రూ.5 కోట్ల నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్ధాన చేసుకున్నామని, రానున్న రోజుల్లో మరిన్ని పనులకు శ్రీకారం చుడుతామని చెప్పారు. త్వరలోనే అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులు వస్తాయని, కొత్తూరులో నూతనంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్రూంలతోపాటు సొంత ఇంటి స్థలాలు ఉన్నవారికి ఇండ్లను నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రగతి వైపు పయనించాలంటే పనులు చేసే ప్రభుత్వం వైపు నిలబడాలన్నారు.
మున్సిపాలిటీలోని 12 వార్డుల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలన్నారు. కొత్తూరు వై జంక్షన్ వద్ద బీఆర్ అంబేద్కర్, తెలంగాణ తల్లి విగ్రహాలకు మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్లు పూలమాలలు వేశారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ తీగల అనితారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ప్రతాప్రెడ్డి, కిష్టయ్య, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి అందె బాబయ్య, జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, జడ్పీటీసీ శ్రీలత, టీఆర్ఎస్ నాయకులు నారాయణరెడ్డి, నరేందర్, దేవేందర్యాదవ్, జనార్దన్చారి, క్రాంతిరెడ్డి, ఎంఎస్ నటరాజన్, లక్ష్మీనారాయణగౌడ్, గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.