కడ్తాల్, మే 13: మండలంలో లాక్డౌన్ పకడ్బందీగా కొనసాగుతున్నది. ప్రజల అవసరాల దృష్ట్యా ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే ప్రభుత్వం సడలింపులు ఇచ్చింది. పది గంటల తర్వాత లాక్డౌన్ అమలులోకి రావడంతో దుకాణాలను మూసివేశారు. ప్రజలందరూ ఇంటికే పరిమితమవడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. నిబంధనలు పాటించని వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై సుందరయ్య హెచ్చరించారు.
యాచారం మండలం..
యాచారం, మే 13 : లాక్డౌన్ రెండోరోజు మండలంలో పకడ్బందీగా నిర్వహించారు. ఉదయం 6గంటల నుంచి తెరుచుకున్న దుకాణాలు 10గంటలకు బంద్ చేశారు. సీఐ లింగయ్య, ఎస్ఐలు ప్రభాకర్, పద్మయ్య మాల్, యాచారంలో బంద్ను పరిశీలించారు. సాగర్ రహదారిపై వాహనాలను ముమ్మరంగా తనిఖీ చేశారు. అత్యవసర వాహనాలను మినహాయించి మిగతావాటిని వెనక్కి పంపారు. అనవసరంగా బయటకు వచ్చి ఇబ్బందులు పడొద్దని, లాక్డౌన్కు ప్రజలందరూ సహకరించాలని సీఐ కోరారు.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో..
ఇబ్రహీంపట్నం, మే 13 : నియోజకవర్గంలో రెండోరోజు లాక్డౌన్ పకడ్బందీగా కొనసాగింది. నియోజకవర్గ కేంద్రంలో ఏసీపీ యాదగిరిరెడ్డి, తాసిల్దార్ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ జయంత్కుమార్రెడ్డి, సీఐ సైదులు ఆధ్వర్యంలో లాక్డౌన్ పర్యవేక్షించారు. అనుమతి లేకుండా రోడ్లపైకి వచ్చిన వాహనాలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ యాదగిరిరెడ్డి మాట్లాడుతూ.. లాక్డౌన్ ఆంక్షలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు.
ఆమనగల్లు మండలం..
ఆమనగల్లు, మే 13 : ఆమనగల్లు బ్లాక్ మండలాల్లో రెండో రోజు స్వచ్ఛందంగా లాక్డౌన్ కొనసాగింది. పదిగంటల తర్వాత ప్రజలంతా ఇండ్లకే పరిమితమయ్యారు. హైదరాబాద్-శ్రీశైలం ప్రధాన రహదారి, ఆమనగల్లు-దేవరకొండ, ఆమనగల్లు-షాద్నగర్ రహదారులన్నీ వాహనాల రాకపోకలు లేక నిర్మానుష్యంగా మారాయి. ఆమనగల్లు సీఐ ఉపేందర్ ప్రత్యేకంగా ఆయా మండలాల్లో లాక్డౌన్పై పర్యవేక్షణ చేశారు.
నిబంధనల ఉల్లంఘనపై 25 కేసులు
మాడ్గుల, మే13 : మండలంలో సీఐ ఉపేందర్రావు ఆధ్వర్యంలో ఎస్సై బద్యానాయక్ గస్తీ ఏర్పాటు నిర్వహించి నాలుగు బృందాలతో బందోబస్తు చేపట్టారు. ఆయా గ్రామాల్లో నిబంధనలు అతిక్రమించిన వారిపై 25 కేసులు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. మండలంలోని ఇర్విన్, ఆర్కపల్లి, ఆవురుపల్లి, కొలుకలపల్లి గ్రామాల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. ప్రజలు లాక్డౌన్ పాటించాలని సీఐ కోరారు.