పరిగి డివిజన్లో 27,894 మెట్రిక్టన్నులు సేకరణ
స్టాక్ కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు
పరిగిలో 24,310 ఎకరాల్లో వరి సాగు
పరిగి, జూన్ 13 : గతంలో ఎప్పుడూ లేనంతగా గత యాసంగిలో పరిగి డివిజన్లో వరి సాగు చేపట్టడంతో ధాన్యం దిగుబడి అదే స్థాయిలో వచ్చింది. సర్కారు సైతం రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేపట్టింది. జిల్లాలో పరిగి డివిజన్లోనే అత్యధికంగా పంట సాగుతోపాటు కొనుగోలు జరిగాయని చెప్పవచ్చు. రవాణా ఇబ్బందులను అధిగమించేందుకు ఎక్కడికక్కడే స్టాకు ఏర్పాటు చేసేందుకు సర్కారు తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. పరిగి డివిజన్ పరిధిలో గత యాసంగిలో మొత్తం 24,310 ఎకరాల్లో వరి పంటను సాగైంది. అత్యధికంగా దోమ మండలంలో 10,993 ఎకరాలు, కులకచర్లలో 9,332 ఎకరాలు, పరిగిలో 3,636 ఎకరాలు, పూడూరులో 347 ఎకరాల్లో వరి సాగు చేపట్టారు. మరోవైపు ప్రభుత్వం వ్యవసాయానికి 24గంటలు ఉచితంగా నాణ్యమైన కరెంటు సరఫరా చేసింది. తద్వారా యాసంగిలో పెద్ద ఎత్తున వరి పంటను సాగు చేయడంతో అందుకు అనుగుణంగా దిగుబడి సైతం వచ్చింది.
27,894 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు
వరి ధాన్యం దిగుబడి పెరుగడంతో అనుగుణంగా సర్కారు ప్రత్యేక చర్యలు చేపట్టి కొనుగోలుకు ఏర్పాట్లు చేపట్టింది. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత పారదర్శకంగా వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లు చేపడుతున్నది. కొనుగోలు చేసిన ధాన్యానికి నేరుగా రైతు బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నారు. సర్కారు ఈసారి పరిగి డివిజన్లో 63 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఇప్పటివరకు 5,913 మంది రైతుల వద్ద 27,894 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేపట్టింది. దోమ మండలంలో 25 కొనుగోలు కేంద్రాల ద్వారా 2,814 మంది రైతుల వద్ద నుంచి 13,482 మెట్రిక్ టన్నులు, కులకచర్ల మండలంలో 24 కొనుగోలు కేంద్రాల ద్వారా 2,028 మంది రైతుల వద్ద 8,270 మెట్రిక్ టన్నులు, పరిగి మండలంలో 13 కొనుగోలు కేంద్రాల ద్వారా 1,036 మంది రైతుల వద్ద నుంచి 6,016 మెట్రిక్ టన్నులు, పూడూరు మండలంలో ఒక కొనుగోలు కేంద్రం ద్వారా 35 మంది రైతుల వద్ద నుంచి 125 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది.
ఎమ్మెల్యే చొరవతో ప్రత్యేక స్టాకు ఏర్పాట్లు..
వర్షాలు ప్రారంభం కావడంతో రైతులు ఇబ్బంది పడరాదనే ఉద్దేశంతో ధాన్యం సేకరించింది ఎప్పటికపుడు స్టాకు ఏర్పాటు చేసుకునేందుకు ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. జిల్లాలో మూడు బాయిల్డ్ రైస్మిల్లులు ఉండడంతో వాటికి కస్టమ్ మిల్లింగ్ కోసం ధాన్యం కేటాయించగా, మిగతావి కరీంనగర్, రంగారెడ్డి జిల్లాలకు కేటాయించడం జరిగింది. రవాణా ఇబ్బందులు తలెత్తుతుండడంతోపాటు మరోవైపు వర్షాలు కురుస్తుండడంతో రైతుల ఇబ్బందులు తీర్చడానికి ఎమ్మెల్యే మహేశ్రెడ్డి ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించి పరిగిలోని కేఎస్ఆర్, కేఏఆర్ గార్డెన్లను ధాన్యం బస్తాల స్టాకు కోసం ఇప్పించారు. తద్వారా సుమారు 2లక్షల బస్తాల ధాన్యం స్టాకుకు అవకాశం కలిగింది. ఇప్పటికే కేఎస్ఆర్ గార్డెన్ పూర్తిగా ధాన్యం బస్తాలతో నిండగా, ఆదివారం సాయంత్రానికి కేఏఆర్ గార్డెన్ సైతం ధాన్యం బస్తాలతో నిండిపోయింది. జాఫర్పల్లిలోని గోదాం, పరిగిలోని మార్కెట్యార్డులో గల గోదాములు ధాన్యం స్టాకు కోసం అధికారులతో మాట్లాడి ఇప్పించారు. నియోజకవర్గంలోని 16 రైస్మిల్లుల వారు ఒక్కో రైస్మిల్లు 10వేల ధాన్యం బస్తాలు కస్టమ్ మిల్లింగ్కు తీసుకునేలా ఒప్పించారు. తద్వారా లక్షా 60వేల బస్తాల ధాన్యం రైస్మిల్లర్లు తీసుకునేందుకు స్వయంగా అంగీకరించారు. ఇప్పటికే 20,280 మెట్రిక్ టన్నుల ధాన్యం ఆయా స్టాకు కేంద్రాలకు తరలించగా, 761 మెట్రిక్ టన్నుల ధాన్యం తరలించాల్సి ఉన్నది.
ఇబ్బందులు కలుగకుండా చర్యలు
ఈసారి యాసంగిలో వరి పంట సాగుతోపాటు దిగుబడులు పెరిగాయి. తద్వారా రైతులకు ఇబ్బంది కలుగకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం 63 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేపడుతున్నది. రైస్మిల్లులకు కేటాయించినవి పోనూ మిగతా ధాన్యం స్టాకు కోసం అవసరమైన చర్యలు చేపట్టాం. ప్రత్యేకంగా స్టాకు కోసం గోదాములు, ఫంక్షన్హాళ్లు వినియోగిస్తున్నాం. ప్రతి రైతు వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేపడుతున్నాం. ఇప్పటికే 90శాతం ధాన్యం కొనుగోలు జరిగింది. మిగతావి నాలుగైదు రోజుల్లో పూర్తి చేస్తాం.