రంగారెడ్డి, మే 12, (నమస్తే తెలంగాణ): కరోనా బాధితులకు అండగా ఉంటామని, వైరస్ వ్యాప్తి తీవ్రత నేపథ్యంలో ప్రజలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలను చేపట్టాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితారెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్లోని తన చాంబర్లో కరోనా నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 3,41,931 కుటుంబాల సర్వే నిర్వహించగా 5104 మందికి కొవిడ్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించారని, వెంటనే సంబంధిత లక్షణాలున్న వారికి కరోనా కిట్స్ను అందజేశామన్నారు. జిల్లాలో ప్రస్తుతం మూడు ప్రభుత్వ, 130 ప్రైవేట్ ఆసుపత్రుల్లో కొవిడ్ చికిత్స నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. జిల్లాలో ఇప్పటివరకు 6.91.468 మందికి కరోనా పరీక్షలు నిర్వ హిం చినట్లు, ప్రస్తుతం 6316 యాక్టివ్ కేసులున్నట్లు మంత్రి తెలిపారు. జిల్లాకు అవసరమైన రెమ్డి సివిర్ ఇంజక్షన్లతోపాటు అవసరమైన మందులను అందుబాటులో సిద్ధంగా ఉంచామని, మం దులు కావాల్సినంతా సరఫరా చేస్తున్నామన్నా రు.
కరోనా లక్షణాలు కనిపించిన వెంటనే ప్రతి ఒక్కరూ పరీక్షలు చేయించుకోవాలని, పాజిటివ్ వచ్చినట్లయితే ప్రభుత్వం అందించే మందులను వాడాలని, కరోనా వచ్చిన వెంటనే ఆందోళన పడొద్దని, రోగులకు మనోధైర్యం కల్పించాలని అధికారులకు సూచించారు. జిల్లాస్థాయిలో వేసిన కమిటీలు తమ దృష్టికి వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు.ప్రజల సం క్షేమం కోసమే ప్రభుత్వం లాక్డౌన్ విధించిందన్నారు. జిల్లావ్యాప్తంగా ఐసొలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. లాక్డౌన్లో వ్యవసాయానికి మినహాయింపు ఇచ్చినందున రైతులకు ఇబ్బందులు కలుగకుండా చూసుకోవాలని, ముఖ్యంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ సాఫీగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. అయితే వెంటిలేటర్లు, ఆక్సిజన్, ఔషధాలు ఎంత సమ కూ ర్చినా ప్రజా చైతన్యంతోనే కరోనా మహమ్మారిని రూపుమాపగలమని మంత్రి అన్నారు. జిల్లా స్థాయి అధికారులందరూ కొవిడ్ కేంద్రాలను సందర్శించి కొవిడ్ రోగులకు మనోధైర్యాన్ని అందించాలని మంత్రి సూచించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ అమయ్కుమార్, అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి స్వరాజ్యలక్ష్మి, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి రాజేశ్వర్రెడ్డి పాల్గొన్నారు.