రంగారెడ్డి, జూలై 12, (నమస్తే తెలంగాణ) : నిరుద్యోగులకు శుభవార్త. ప్రభుత్వ శాఖల్లోని పోస్టుల ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఖాళీల భర్తీకి సంబంధించి కసరత్తు చేయడంతోపాటు కొన్ని శాఖల్లో పదోన్నతుల ప్రక్రియను కూడా పూర్తి చేశారు. పదోన్నతులు పూర్తైన అనంతరం ఏర్పడిన ఖాళీల్లో ఇప్పటికే ప్రత్యక్ష నియామక పద్ధతిలో చేపట్టాల్సిన ఖాళీల భర్తీ పూర్తి చేయగా, ప్రస్తుతం మిగతా పదోన్నతుల ద్వారా ఏర్పడే ఖాళీలతోపాటు అన్ని శాఖల్లోని ఖాళీలను భర్తీ చేసేందుకుగాను ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నేడు జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం వెల్లడించనున్నారు. తొలుత 50 వేల పోస్టులను భర్తీ చేసేందుకుగాను ప్రభుత్వం నిర్ణయించింది. విడుతల వారీగా పోస్టుల ఖాళీలను టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు. జిల్లాలో పదోన్నతుల ప్రక్రియ దాదాపు పూర్తికాగా, విద్యాశాఖతోపాటు మరో రెండు, మూడు శాఖల్లో మాత్రమే పదోన్నతుల ప్రక్రియ చేపట్టాల్సి ఉంది. విద్యాశాఖలోనూ త్వరలో పదోన్నతుల ప్రక్రియ చేపట్టి పదోన్నతుల అనంతరం ఖాళీ అయిన పోస్టులతోపాటు ఇప్పటికే ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇప్పటికే జిల్లాలోని ఆయా శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు సంబంధించి జిల్లా ఉన్నతాధికారులు ప్రభుత్వానికి నివేదికను అందజేశారు.
జిల్లాలో ఉన్న ఖాళీలు..
జిల్లాలోని అన్ని శాఖల్లో కలిపి మొత్తం సుమారు 3 వేల పోస్టులు ఖాళీలున్నట్లు జిల్లా అధికారుల ద్వారా తెలిసింది. సంబంధిత పోస్టులన్నింటినీ టీఎస్పీఎస్సీ ద్వారానే భర్తీ చేయనున్నారు. జిల్లాలో అత్యధికంగా విద్యాశాఖలోనే దాదాపు వెయ్యి పోస్టులు ఖాళీలున్నట్లు జిల్లా యంత్రాంగం లెక్కతేల్చింది. జిల్లా విద్యాశాఖలో సుమారు 260 మందికి పదోన్నతి లభించనున్నది. స్కూల్ అసిస్టెంట్లు, ఎల్ఎఫ్ఎస్ హెచ్ఎం, గ్రేడ్-2 హెచ్ఎంలు పదోన్నతులు పొందనున్నారు. అదేవిధంగా జిల్లా విద్యాశాఖలో 583 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జీహెచ్ఎం గ్రేడ్-2 పోస్టులు-62, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం-47, స్కూల్ అసిస్టెంట్(గణితం)-15, స్కూల్ అసిస్టెంట్(భౌతికశాస్త్రం)-4, స్కూల్ అసిస్టెంట్(జీవశాస్త్రం)-56, స్కూల్ అసిస్టెంట్(సాంఘీక శాస్త్రం)-98, స్కూల్ అసిస్టెంట్(ఇంగ్లీష్)-26, స్కూల్ అసిస్టెంట్(తెలుగు)-20, స్కూల్ అసిస్టెంట్(హిందీ)-6, స్కూల్ అసిస్టెంట్(ఉర్దూ)-1, స్కూల్ అసిస్టెంట్(ఫిజికల్ ఎడ్యుకేషన్)-3, ఎస్జీటీలు-227, భాషా పండితులు(తెలుగు)-12, భాషా పండితులు(హిందీ)-5, పీఈటీ-1 పోస్టులు జిల్లా విద్యాశాఖలో ఖాళీలున్నాయి.
అయితే పదోన్నతుల ప్రక్రియ పూర్తైతే దాదాపు 900 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అదేవిధంగా రెవెన్యూ శాఖకు సంబంధించి ఆరు తాసిల్దార్ పోస్టులతోపాటు సీనియర్ అసిస్టెంట్ పోస్టులు-13 పోస్టులు మాత్రమే ప్రస్తుతానికి ఖాళీ ఉన్నట్లు సంబంధిత అధికారులు లెక్కతేల్చారు. అదేవిధంగా జిల్లాలోని 21 శాఖల్లో 220 మంది పదోన్నతులు పొందారు, వీరిలో 206 మందికి పదోన్నతులను ఆయా శాఖల ఉన్నతాధికారులు పదోన్నతులను కల్పించగా, మరో 14 మందికి జిల్లా కలెక్టర్ స్థాయిలో పదోన్నతులు కల్పించారు. వ్యవసాయ, విద్యా, వైద్యారోగ్య, పరిశ్రమలు, ఉద్యానవన, రవాణా, పౌరసరఫరాలు, ఎక్సైజ్, ఇన్సూరెన్స్, గిరిజన, బీసీ, మైనార్టీ తదితర శాఖలకు సంబంధించిన ఉద్యోగులకు పదోన్నతులు కల్పించారు. అదేవిధంగా రెవెన్యూ శాఖలో జూనియర్, సీనియర్ అసిసెంట్లతోపాటు డిప్యూటీ తాసిల్దార్లు కలిపి మొత్తం 30 మంది పదోన్నతులు పొందారు. మరోవైపు కారుణ్య నియామకాలను కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోనే భర్తీ చేశారు. జిల్లావ్యాప్తంగా 20 కారుణ్య నియమకాలతోపాటు ఆఫీస్ సబార్డినేట్స్కు, జూనియర్ అసిస్టెంట్లకు కలెక్టర్ పదోన్నతులు కల్పించారు.