షాబాద్, జూలై 12 : జిల్లాలో రైతుబంధు సాయం పెండింగ్ లేకుండా చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్ అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయంలో జిల్లా పరిషత్ స్థాయీ సంఘాల సమావేశం జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్ అధ్యక్షతన నిర్వహించారు. స్థాయీ సంఘ సమావేశంలో వ్యవసాయం(స్థాయి సంఘం-3), సాంఘిక సంక్షేమం(స్థాయి సంఘం-6)పై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పొలాల్లో భూసారాన్ని తెలుసుకునేందుకు మట్టి పరీక్షలు నిర్వహించాలని చెప్పారు. రైతులు వేసిన పంటలను ఆన్లైన్లో నమోదు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారికి సూచించారు. నేషనల్ అగ్రికల్చర్ మార్కెటింగ్ పథకం జిల్లాలో షాద్నగర్, శంకర్పల్లి మార్కెట్ కమిటీల్లో అమలవుతుందని వ్యవసాయ మార్కెటింగ్ అధికారి వివరించారు. గొర్రెలు, మేకలు, పశువులకు ఎప్పటికప్పుడూ వ్యాధి నిరోధక టీకాలు వేయించాలని పశుసంవర్థకశాఖ అధికారికి జడ్పీ వైస్ చైర్మన్ సూచించారు. ఉద్యానశాఖపై సమీక్షిస్తూ అర్హులైన రైతులను గుర్తించి మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ డ్రిప్పు రాయితీలను అందించాలని తెలిపారు.
అంతకుముందు స్త్రీ, శిశు సంక్షేమం(స్థాయి సంఘం-5)పై జిల్లా పరిషత్ సీఈవో దిలీప్కుమార్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీధుల్లో, టోల్గేట్ తదితర ప్రాంతాల్లో భిక్షాటన చేస్తున్న బాలలను గుర్తించి వారిని చైల్డ్ హోమ్కి తరలించాలని చెప్పారు. వారి వారి తల్లిదండ్రులకు అప్పగించి కౌన్సెలింగ్ ఇవ్వాలన్నారు. చైల్డ్ హోమ్ లైన్ టీం అప్రమత్తంగా ఉండి బాల బాలికలను రక్షించుకునేందుకు కృషి చేయాలన్నారు. వృద్ధ్దాశ్రమాలను తనిఖీ చేసి వారి సమస్యలను తెలుసుకోవాలన్నారు. గర్భిణులకు పోషకాహారం అందించాలన్నారు. సాంఘిక సంక్షేమం (స్థాయీ సంఘం-6) అంబేద్కర్ ఓవర్సిస్ విద్యానిధి పథకం కింద రూ. 20లక్షలు విదేశాలలో చదువుకునేందుకు రంగారెడ్డి జిల్లా నుంచి నలుగురు విద్యార్థులు ఎంపికైనట్లు తెలిపారు.
గిరిజన అభివృద్ధికి సంబంధించిన పూర్తి సమాచారంతో హాజరు కావాలని గిరిజన అభివృద్ధి అధికారిని ఆదేశించారు. షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి కోసం ఎస్సీ మహిళల కోసం ఎస్సీ కార్పొరేషన్ 2021 సంవత్సరానికి షీ క్యాబ్ పథకం ద్వారా 32 మందిని ఎంపిక చేయడం జరిగిందన్నారు. బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద జిల్లా నుంచి షాబాద్, ఆమనగల్, కందుకూరు, తలకొండపల్లి, కడ్తాల్ మండలాల్లో 5 ఉత్తమ పాఠశాలలు ఎంపికైనట్లు వివరించారు. ఈ సమావేశంలో జడ్పీటీసీలు టీ. విశాల, నిత్య, జంగారెడ్డి, ప్రభాకర్రెడ్డి, అనురాధ, జిల్లా వ్యవసాయశాఖ అధికారి గీతారెడ్డి, ఉద్యానవన శాఖ అధికారి సునంద, మత్స్యశాఖ అధికారి సుకీర్తి, పశుసంవర్ధకశాఖ అధికారి అంజిలప్ప, గిరిజన అభివృద్ధి అధికారి రామేశ్వరి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.