ఇబ్రహీంపట్నం, జూన్ 11 : వాణిజ్య పంటలు, కూరగాయలు సాగుచేసేలా రైతుల్లో వ్యవసాయ అధికారులు అవగాహన పెంచాలని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో వ్యవసాయశాఖ అధికారులతో వానకాలం పంటల సాగుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. యాసంగిలో పెద్ద ఎత్తున వరిసాగు చేశారని, వానకాలంలో వరిసాగును తగ్గించుకునేలా రైతులను చైతన్య పర్చాలని అధికారులకు సూచించారు. డివిజన్లో గత వానకాలంలో 13వేల ఎకరాల్లో వరిసాగుతో పాటు 3.30 లక్షల క్వింటాళ్ల వరిధాన్యం దిగుబడి వస్తే, యాసంగిలో 24వేల ఎకరాలల్లో 5.25లక్షల క్వింటాళ్ల దిగుబడి వచ్చిందని అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు. రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలుకు రూ.25వేల కోట్లు కేటాయించి కొనుగోళ్లు చేసిందన్నారు. గిడ్డంగులు నిండిపోయి, గోనె సంచులు లేక ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నదని ఎమ్మెల్యే చెప్పారు.
వాణిజ్య పంటలే మేలు..
ఈ వానకాలంలో ఇంటికి సరిపడా మాత్రమే వరి వేసుకోవాలని, లేదంటే రైతులకు నష్టం వాటిల్లుతుందని చెప్పారు. నారు పోసుకున్నప్పటికీ రైతులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. పత్తి, కందులు, మినుములు, రాగులు వాణిజ్య పంటలతో పాటు కూరగాయలు సాగు చేస్తే రైతులకు ఎంతో మేలు జరుగుతుందని వివరించారు. సీజన్కు సరిపడా ఎరువులు, విత్తనాలు సమకూర్చుకున్నామన్నారు. డీలర్ల వద్ద రసీదు తీసుకుని కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే రైతులకు సూచించారు. మండలాల వారీగా రైతు చైతన్య సదస్సులు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ లక్ష్మారెడ్డి, ఏడీఏ సత్యనారాయణ, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్తువెంకటరమణారెడ్డి, మండల వ్యవసాయాధికారులు వరప్రసాద్రెడ్డి, సందీప్కుమార్, శాంతిశ్రీ పాల్గొన్నారు.
నిరుద్యోగులకు అండగా ఎంకేఆర్ ఫౌండేషన్
నియోజకవర్గంలోని నిరుద్యోగ యువత ప్రభుత్వ ఉద్యోగాలు సాధించే విధంగా ఎంకేఆర్ ఫౌండేషన్ అండగా ఉంటుందని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ఉద్యోగాల కోసం ఎంకేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత శిక్షణకు ఎంపికైన యువతకు స్టడీ మెటీరియల్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. యువత ఉద్యోగాలు సాధించే విధంగా ఎంకేఆర్ ఫౌండేషన్ శిక్షణ ఇస్తున్నదన్నారు. ఫౌండేషన్ ద్వారా కానిస్టేబుల్, ఎస్సై, గ్రూప్ 2 ఉద్యోగాలు సాధించారని ఎమ్మెల్యే సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్లో ఫౌండేషన్ ద్వారా మరిన్ని సేవలు అందిస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కృపేశ్, అబ్దుల్లాపూర్మెట్ సర్పంచ్ కిరణ్గౌడ్, ఎంకేఆర్ ఫౌండేషన్ కార్యదర్శి రాజు, సభ్యులు పాతూరి రాజేశ్, మైలారం విజయ్కుమార్, శివ, భాను పాల్గొన్నారు.