రంగారెడ్డి, జూన్ 11, (నమస్తే తెలంగాణ): పారిశుద్ధ్యం డ్రైవ్ నిర్వహించి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని, ఏడో విడుత హరితహారంలో భాగంగా నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు ముందస్తు ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖల సెక్రటరీ సందీప్కుమార్ సుల్తానియా ఆదేశించారు. శుక్రవారం సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ రఘునందన్ రావుతో కలిసి జిల్లా అదనపు కలెక్టర్లు, పంచాయతీ అధికారులు, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామాన్ని హరితవనంగా మార్చేందుకు మనవంతు బాధ్యతగా నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. నాటిన ప్రతి మొక్కను జియో ట్యాగింగ్ చేయాలని సూచించారు. ప్రతి గ్రామాన్ని, పట్టణాన్ని పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని, వానకాలం ప్రారంభమైన దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.
రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ జిల్లాలో హరితహారంలో భాగంగా ఈ ఏడాది 66 లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. నాటిన ప్రతి మొక్కకూ జియో ట్యాగింగ్ చేసి, ట్రీగార్డులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. జిల్లాలో 867 పల్లెప్రకృతి వనాల్లో 700 వనాలకు సంబంధించి ఎస్టిమేషన్ ప్రక్రియ పూర్తయ్యిందన్నారు. గ్రామాల్లో, పట్టణాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య డ్రైవ్ చేపట్టామన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో కూడా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.