షాద్నగర్, జూన్11: ప్రతి గింజను ప్రభుత్వం కొనేందుకు సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్ అన్నారు. శుక్రవారం షాద్నగర్లోని మండల పరిషత్ సమావేశ మందిరంలో ఫరూఖ్నగర్ మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లపై రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దన్నారు. గోదాం, సంచుల కొరత రాకుండా సర్కారు చర్యలు తీసుకున్నదన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కరోనా నియంత్రణ చర్యలు తీసుకోవాలని ప్రజాప్రతినిధులకు సూచించారు. వానకాలంలో అంటు వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందని, గ్రామాల్లో పరిసరాల పరిశుభ్రతను పాటించాలని కోరారు. కొవిడ్ నిబంధనలను పటిష్టంగా అమలుచేయాలన్నారు. గ్రామాల్లో విద్యుత్ సమస్యలు రాకుండా ఆ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాలు కురిసే సమయంలో విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని, అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కుంటలు, చెరువుల పాటు కాలువలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో పరిష్కారం కాని సమస్యలు గుర్తించి తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన గ్రామాల సర్పంచ్లు, మాజీ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులకు నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీపీ ఖాజ ఇద్రీస్, జడ్పీటీసీ పీ. వెంకట్రాంరెడ్డి, ఎంపీడీవో శరత్చంద్రబాబు, తహసీల్దార్ పాండు, అధికారులు, గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
నిరుద్యోగులకు ప్రభుత్వం చేయూత
కొందుర్గు, జూన్ 11: నిరుద్యోగులకు ప్రభుత్వం చేయూతనందించడంలో భాగంగా ఆగ్రో కేంద్రాలను ఇచ్చిందని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ తెలిపారు. మండలంలోని శ్రీరంగాపూర్, రాంచంద్రపూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఆగ్రో కేంద్రాలను శుక్రవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని రైతులకు ఆగ్రో కేంద్రాల ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందజేయాలన్నారు. నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే ప్రభుత్వ పరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మండల వ్యవసాయ అధికారుల సూచనల మేరకు మందులు, విత్తనాలు విక్రయించాలని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ జంగయ్య, ఏడీఏ రాజరత్నం, పీఏసీఎస్ చైర్మన్ దామోదర్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీధర్రెడ్డి, హఫీజ్, నాయకులు జహంగీర్, లింగం, వెంకటేశ్ పాల్గొన్నారు.