ప్రతి వీధిలో విద్యుత్ దీపాలు
మిషన్ భగీరథతో ఇంటింటికీ తాగునీటి సరఫరా
ఆహ్లాదకరంగా పల్లె ప్రకృతి వనం
అందుబాటులోకి వైకుంఠధామం,కంపోస్టుయార్డు
కులకచర్ల, జూలై 11:అడవివెంకటాపూర్ పూర్తిగా వెనుకబడిన గ్రామం. కులకచర్ల మండల కేంద్రానికి 8 కిలోమీటర్ల దూరం. చుట్టుపక్కల అటవీ ప్రాంతం. ఈ ప్రాంతంలో ఉండటం వలన అడివివెంకటాపూర్గా పిలుస్తా రు. గ్రామ పంచాయతీలో 8 తండాలు, ఒక అనుబంధ గ్రామ ఉన్నది. గతంలో ఉమ్మడి అడవివెంకటాపూర్ గ్రామంగా ఉన్న సమయంలో గ్రామానికి 20కి పైగా తండాలు ఉండేవి. గ్రామ పంచాయతీల ఏర్పాటుతో కొన్ని తండాలు గ్రామ పంచాయతీలుగా ఏర్పడ్డాయి. ఉమ్మడి గ్రామం నుంచి బొర్రహేమ్యతండా, బజ్జనాయక్తండా, గోగ్యనాయక్తండాలు కొత్త గ్రామ పంచాయతీలుగా ఏర్పాటయ్యాయి. ఒకప్పుడు గ్రామంలో కనీససౌకర్యాలు లేని దుస్థితి. చెత్తాచెదారం గ్రామంలోనే దర్శనమిచ్చేది. పండుగల సమయాల్లో మాత్రమే గ్రామాలను పరిశుభ్రం చేయించి వీధిదీపాలు ఏర్పాటు చేసేవారు. ప్రస్తుతం అడవివెంకటాపూర్ గ్రామ పంచాయతీ చౌడాపూర్ మండలంలోకి వెళ్లి పోయింది. అడవివెంకటాపూర్ గ్రామంలో 800కిపైగా జనాభా ఉంది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాత ఆదర్శగ్రామాలుగా తీర్చిదిద్దేందుకు గ్రామాల్లో మౌలిక సదుపాయాలను కల్పించేందుకు పల్లె ప్రగతి ద్వారా గ్రామ పంచాయతీకి నిధులు కేటాయించి గ్రామంలో గత 3 సంవత్సరాలుగా వివిద అభివృద్ధి పనులను నిర్వహిస్తూగ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు, ఉన్న గ్రామ పంచాయతీ నిధులతో సర్పంచ్ జయరాజునాయక్ గ్రామ పంచాయతీ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నారు.
పల్లె ప్రగతి ద్వారా మెరుగైన సౌకర్యాలు…
అడవి వెంకటాపూర్ అంటేనే మండల ప్రజలు ఏదో ఒక విధంగా అభిప్రాయపడేవారు. పూర్తిగా గిరిజన తండాలు ఉన్న గ్రామం. గ్రామంలో ఎక్కువగా వలసలు వెళ్లేవారు. 20కి పైగా తండాలు ఉన్న కారణంగా తండాల్లో ఎక్కువగా ప్రజలు మహారాష్ట్రకు వలసవేళ్లేవారు. గ్రామానికి వెళితే ఎక్కువగా తండాల్లో ఇండ్లు తాళాలు వేసి ఉండటం చూసేవారం. గ్రామంలో ముసలివారు మాత్రమే ఉండేవారు. తండాల్లో మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు పడేవారు. వర్షాకాలం వచ్చిందంటే తాగునీటికోసం తిప్పలు తప్పేదికాదు. గ్రామ పంచాయతీలకు సరైన నిధులు లేక గ్రామాన్ని అభివృద్ధి చేయలేక సర్పంచులు చాలా విధాలుగా ఇబ్బందులు పడేవారు. కాని పల్లె ప్రగతి వచ్చిన తరువాత గ్రామంలో మౌలిక సదుపాయాలు మెరుగుపడ్డాయి. గ్రామానికి రోడ్డు సౌకర్యం ఏర్పడింది. గ్రామం నుంచి ఇతర తండాలకు కూడా రోడ్డు సౌకర్యం ఏర్పడింది. పల్లె ప్రగతి ద్వారా గ్రామంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పల్లె ప్రగతి పేరుతో తెలంగాణ ప్రభుత్వం గ్రామ పం చాయతీలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు పంచాయతీలకు ప్రతి నెల నిధులను కేటాయిస్తునది. పంచాయతీలకు కేటాయించిన నిధు ల ద్వారా గ్రామ పంచాయతీ అభివృద్ధికి సర్పం చ్ జయ రాజునాయక్ కృషిచేస్తున్నారు.
కనువిందు చేస్తున్న పల్లె ప్రకృతివనం
అడవివెంకటాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతివనం చూపరులను ఆకర్శిస్తున్నది. పల్లె ప్రకృతి వనంలో రకరకాల మొక్కలను నాటారు. కొబ్బరితో పాటు, కరివేపాకు, పూలమొక్కలు, అహ్లాదాన్ని పంచే మొక్కలు నాటారు. పల్లె ప్రకృతివనంలో మొక్కలు నాటడంతో పాటు వాటికి ప్రతి రోజు నీటిని అందించడం ద్వారా పల్లె ప్రకృతి వనం పచ్చగా మారింది.
నర్సరీ ఏర్పాటు…
అడవివెంకటాపూర్ గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన నర్సరీలో మొక్కలు ఏపుగా పెరిగాయి. మొక్కల రక్షణకు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో వనసేవకున్ని నియమించి నర్సరీలో మొక్కలు పెంచేందుకు పంచాయతీ సర్పంచ్ కృషిచేస్తునారు. నర్సరీల్లో పెంచిన మొక్కలు హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉన్నాయి. గ్రామానికి వెళ్లే రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటుతున్నారు.
వినియోగంలోకి కంపోస్ట్ షెడ్నిర్మాణం…
గ్రామ సమీపంలో ఉన్న కంపోస్ట్ షెడ్ నిర్మాణం పూర్తి కావడంతో సేంద్రియ ఎరువులు తయారు చేయడానికి ఉపయోగిస్తున్నారు. ఇప్పటికే కం పోస్ట్ షెడ్లో పేడ, చెత్త ద్వారా ఎరువును తయా రు చేస్తున్నారు. గ్రామంలో సేకరించిన చెత్తను డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. గ్రామ పరిశుభ్రతకు చర్యలు తీసుకుంటున్నారు. పల్లె ప్రగతిలో భాగంగా ఏర్పాటు చేసిన స్మశాని వాటిక నిర్మాణం పనులు పూర్తిదశకు చేరుకుంది. పెద్ద గుట్టలా ఉన్న ప్రదేశాన్ని స్మశానవాటికకు పనికి వచ్చేలా చేశారు. దీంతో ప్రస్తుతం స్మశానవాటిక పనులు కూడా పూర్తి కావచ్చాయి.
మిషన్ భగీరథ నీటి సరఫరా…
పల్లె ప్రగతికి పూర్వం గ్రామంలో నీటి సమస్య ఉండేది. గ్రామ పంచాయతీ ద్వారా నీటిని అం దించేవారు. వేసవికాలంలో నీటికోసం ఇబ్బందులు పడేవారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాత తాగునీటిని అం దించేందుకు ఇంటింటికీ మిషన్ భగీరథ నీటిని అందించడంతో గ్రా మంలో ఇంటింటికీ నీరు అందుతున్నది.