కొత్తూరు/కొత్తూరు రూరల్, జూలై 11: పల్లెప్రగతితో గ్రామాలు రూపురేఖలు మారిపోయాయి. రాష్ట్రం ఏర్పాటుకు ముందు ఉన్న పరిస్థితికి నేటికి బేరీజు వేసుకుంటే గ్రామాలు ఎంత అభివృద్ధి చెందాయో ఇట్టే తెలిసిపోతుంది. గతంలో పల్లెలకు వెళితే గుంతలమయంగా ఉన్న రోడ్లు, ఇరువైపులా కంపచెట్లు దర్శనమిచ్చేవి. అంతే కాకుండా ఏ ఊర్లో చూసినా తాగు నీటి కష్టాలు వర్ణనాతీతం. అయితే నేడు ఆ దుస్థితి మారిపోయింది. గ్రామాలు శరవేగంగా అభివృద్ధి సాధిస్తున్నాయి. ప్రతిగ్రామంలో పంచాయతీ ఆధ్వర్యంలో కావాల్సిన మౌలిక వసతులను సమకూర్చుకున్నాయి. అంతేకాకుండా కంపోస్టు యార్డులు, వైకుంఠధామాలు, పల్లెప్రకృతి వనాలు, నర్సరీలు, ఊరంతా సీసీ రోడ్లు, రోడ్లకు ఇరువైపులా పచ్చని మొక్కలతో గ్రామాల్లో ఆహ్లాదం వెల్లివిరుస్తున్నది.
అభివృద్ధికి చిరునామాగా గ్రామం..
కొత్తూరు మండలంలోని ఇన్ముల్నర్వ అభివృద్ధికి చిరునామాగా మారింది. 2011 లెక్కల ప్రకారం ఊరి జనాభా 5151, గ్రామంలోని ఉన్న ఇండ్ల సంఖ్య 1134, దీంతో పాటు గ్రామంలో 20రోడ్లును సీసీలుగా మార్చారు. గ్రామంలోని నర్సరీలో 12000 మొక్కలు పెంచి నాటడానికి సిద్ధంగా ఉంచారు. గ్రామంలో తండారోడ్డులో 420 మొక్కలు, ఎస్సీ కాలనీలో 350, మెయిన్ రోడ్డులో 1000, శ్మశానవాటిక వద్ద 1000, డంపింగ్యార్డు వద్ద 50 మొక్కలు నాటారు. అంతేకాకుండా ఆ మొక్కలకు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకున్న వాటర్ ట్యాంకర్తో నీరు పోసి బతికిస్తున్నారు.
రూ. 3 కోట్లతో పనులు
ఇన్ముల్ నర్వలో రూ. 3 కోట్లతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగా రెండు పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేశారు. మొదటి పల్లె ప్రకృతి వనంలో 4 వేల మొక్కలు, రెండో పల్లెప్రకృతి వనంలో 2,800 మొక్కలు నాటి వాటిని ఏపుగా పెంచారు. అంతర్గత మురుగుకాలువలను 90 అండర్గ్రౌండ్ డ్రైనేజీగాలు మార్చారు. ఊర్లో సుమారు 20 వరకు సీసీ రోడ్లను నిర్మించారు. అంతేకాకుండా అన్ని హంగులతో రైతు వేదికను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం క్టస్టర్ పరిధిలోని వ్యవసాయ శాఖ కార్యకలాపాలు ఈ రైతువేదిక నుంచే జరుగుతున్నాయి. గ్రామంలో వైకుంఠధామం, కంపోస్ట్యార్డును పూర్తిచేసి ఉపయోగంలోకి తెచ్చారు. మిషన్ భగీరథ ద్వారా 4 వాటర్ ట్యాంకులను నిర్మించారు. వాటినుంచి 2,20000 వేల లీటర్ల మిషన్ భగీరథ నీటిని గ్రామంలో ప్రతి ఇంటికీ ప్రతిరోజూ అందిస్తున్నారు.
హరితగ్రామంగా తీర్చిదిద్దాం
ఇన్ముల్నర్వను హరితగ్రామంగా తీర్చిదిద్దాం. ఇప్పటికే రెండు పల్లెప్రకృతి వనాలను ఏర్పాటు చేశాం. బృహత్ పల్లెప్రకృతి వనం కూడా మా గ్రామంలోనే ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రూ. 3 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టి పూర్తిచేశాం. అంతేకాకుండా గ్రామంలో 90 శాతం అండర్ గ్రౌండ్ డ్రైనేజీలను నిర్మించాం.