ఇబ్రహీంపట్నం, మే 10: వానకాలం సాగుకు అన్నదాతలు సమాయత్తమవుతున్నారు. దుక్కులు దున్నుకుని పొలాన్ని సిద్ధం చ చేసుకుంటున్నారు. దుక్కులతో పంటలకు మేలు జరుగుతుందని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. పొలంలో చీడపీడలు, కలుపు నివారణకు దోహదపడుతుందన్నారు. పొలం మెత్తబడి అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. దీంతో నియోజకవర్గంలో వేసవి దుక్కులు జోరందుకున్నాయి.
లోతుగా దున్నుకోవాలి..
దుక్కులను లోతుగా దున్నడం వల్ల నేల మెత్తగా తయారవుతుంది. వర్షాలు పడితే నీరు ఎక్కడికక్కడే ఇంకిపోతుంది. భూమికి ఎక్కువ రోజులు తేమ నిల్వ చేసుకునే సామర్థ్యం పెరుగుతుంది. పంటల కోతల తర్వాత మొదళ్లు, మిగిలిన కలుపు మొక్కలు, రాలిపడిన ఆకుల వంటివి సేంద్రియ ఎరువుగా మారుతాయి. దీంతో పోషకవిలువలు చేను బాగా ఎదిగి అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు.
మందలు పెట్టుకుంటే మంచిది..
పొలాల్లో పశువులు, గొర్రెల మందలు పెట్టుకుంటే మంచిది. వాటి ఎరువుతో చేనుకు బలం పెరిగి అధిక దిగుబడి రానున్నది.
వేర్లు విస్తరించే అవకాశం..
లోతుగా దుక్కులు దున్నడం వల్ల తొలకరి జల్లలు కురిసిన తర్వాత గొర్రుతిప్పి సేద్యం చేస్తే వేర్లు బాగా విస్తరించడానికి అనుకూలంగా ఉంటుంది. గొర్రు, గుంటక, దంతెల వంటి పరికరాలతో చదును చేయడం సులువుగా మారుతుంది. నీటిని పీల్చుకునే శక్తి అధికమవుతుంది.
మొండి జాతి కలుపు నివారణ..
దుక్కులు దున్నినప్పుడు కలుపు మొక్కలు, కాయలు, వేర్లు, దుంపలు పెకిలించబడి నశించడానికి ఆస్కారం ఉంటుంది. నేలపైకి తేలిన కాయలు, దుంపలు ఏరి వేసుకుంటే మంచిది. తుంగ, గరిక, గుంజర వంటి మొండి జాతి కలుపు మొక్కల నివారణతో చేను బాగా ఎదుగుతుంది.
అధిక దిగుబడులకు అవకాశం
వేసవి దుక్కులతో అధిక దిగుబడులు వస్తాయి. తొలకరి వర్షాలకు నీరు భూమిలో ఇంకిపోయి పొలం తడిసే అవకాశం ఉంటుంది. పొలం లోతుగా దిగబడకుండా ఉంటుంది. కలుపు తక్కువగా పడడం వల్ల తీసివేసేందుకు శ్రమ తగ్గుతుంది. మొదళ్లు మురిగి సేంద్రియ ఎరువుగా మారి అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది.
ఎండలో భూమి బాగా కాగుతుంది..
దుక్కులు దున్నడం వల్ల ఎండకు భూమి తడి ఆరుతుంది. మళ్లీ నీరుపెట్టి మల్చింగ్ చేస్తే రాలిన ఆకులు, మొదళ్లు భూమిలో మగ్గి సేంద్రియ ఎరువుగా భూమికి జవ ఇస్తాయి. దీంతో చేనుకు బలం పెరిగి అధిక దిగుబడి వస్తుంది. తొలకరి జల్లు పడినా విత్తనాలను విత్తుకునే అవకాశం ఉంటుంది.