వ్యాపార రంగంలోకి ఎస్హెచ్జీ సభ్యులు
విలేజ్ ఎంటర్ప్రైజెస్ పేరిట నూతన కార్యక్రమం
మహిళలకు జీవనోపాధి కల్పించడమే సర్కారు లక్ష్యం
ఉత్పత్తులు, సేవలు, ట్రేడింగ్లో 181 రకాల వ్యాపారాలు
జిల్లాలో పొదుపు సంఘాల సభ్యులు 3170 మంది ఎంపిక
సెర్ప్, బ్యాంకులు, స్త్రీనిధి నుంచి రూ.లక్ష నుంచి రూ.4 లక్షల వరకు ప్రభుత్వ రుణాలు
మహిళా సంఘాల సభ్యులకు రూ.35 కోట్లు కేటాయింపు
వ్యాపారం చేసేందుకు ప్రతిపాదనలు
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలన్న సదుద్దేశంతో బిజినెస్ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం రుణాలను మంజూరు చేస్తున్నది. జీవనోపాధి కల్పనకు స్వయం సహాయక సంఘాల సభ్యులు నచ్చిన వ్యాపారం చేసేలా వెసులుబాటును కల్పించింది. ఇందులో భాగంగా విలేజ్ ఎంటర్ప్రైజెస్ కార్యక్రమానికి రాష్ట్ర సర్కార్ శ్రీకారం చుట్టింది. వ్యాపారంలో నష్టపోకుండా మెళకువలు, నైపుణ్యాన్ని పెంచేందుకు సెర్ప్ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణనూ ఇవ్వనున్నారు. ఉత్పత్తి రంగంలో పేపర్ ప్లేట్లు, కుండలు, బేకరీ, ఇటుకల తయారీ, అగర్బత్తీ తయారీ, క్యాండిల్, స్టేషనరీ, రైస్ మిల్, డిటర్జంట్ పౌడర్, పూజా సామగ్రి, చేనేత వంటి పరిశ్రమలు ఉండగా, ట్రేడింగ్ రంగంలో కిరాణా దుకాణం, బట్టల వ్యాపారం, ఫ్యాన్సీ స్టోర్, కూరగాయల వ్యాపారం, డెయిరీ, పౌల్ట్రీ, ఫెర్టిలైజర్, హార్డ్వేర్ షాప్, ఎలక్ట్రికల్ షాప్ వంటివి ఉన్నాయి. సేవా రంగంలో హోటల్, టిఫిన్ సెంటర్, టైలరింగ్, జిరాక్స్, పిండి గిర్ని ఇలా 181 రకాల వ్యాపారాలకు సంబంధించి శిక్షణ ఇవ్వనున్నారు. ఇప్పటికే జిల్లాలోని పలు గ్రామాలకు చెందిన 3170 మంది పొదుపు సంఘాల సభ్యులనూ ఎంపిక చేసింది. ఒక్కో సభ్యురాలికి రూ.లక్ష నుంచి రూ.4 లక్షల వరకు రుణాలు మంజూరు కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం రూ.35 కోట్ల నిధులను కేటాయించింది. జూన్ 15లోగా ఎంపిక చేసిన సభ్యులందరికీ రుణాలను ఇచ్చి, ఆగస్టు చివరిలోగా వ్యాపారాలు ప్రారంభమయ్యేలా జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు సిద్ధం చేస్తున్నారు.
రంగారెడ్డి, మే 9, (నమస్తే తెలంగాణ): మహిళా సంఘాల సభ్యులు వ్యాపారంలోకి అడుగుపెట్టనున్నారు. పొదుపు సంఘాలుగానే చెలామణి అవుతున్న ఎస్హెచ్జీ సభ్యులు ఇకపై తమకు నచ్చిన వ్యాపారం చేయనున్నారు. అందుకోసం ప్రభుత్వం విలేజ్ ఎంటర్ప్రైజెస్ అనే నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గ్రామీణ మహిళా కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేయడంతోపాటు వారికి సుస్థిరమైన జీవనోపాధి కల్పించడమే దీని ప్రధాన ఉద్దేశం. గ్రామీణ పేదరిక నిర్మూలనే ఏకైక లక్ష్యంగా ఏర్పాటైన సెర్ప్ ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నది. గ్రామస్థాయిలో అక్కడి పరిస్థితులకు అనుగుణంగా వ్యాపారం చేసేందుకు అన్ని విధాలుగా సహకారం అందించనున్నది. ప్రభుత్వమే రుణాలను మంజూరు చేయనుండగా.. అందుకోసం రూ.35 కోట్ల నిధులను కూడా విడుదల చేసింది. అయితే రుణాలను బ్యాంకులు, సెర్ప్, స్త్రీనిధి ద్వారా తీసుకునేందుకుగాను వెసులుబాటు కల్పించింది. జిల్లాలో విలేజ్ ఎంటర్ ప్రైజెస్ కార్యక్రమంలో భాగంగా జూన్ 15లోగా ఎంపిక చేసిన సభ్యులందిరికీ రుణాలను మంజూరు చేసి ఆగస్టు చివరిలోగా వారు ఎంపిక చేసుకున్న వ్యాపారాలు ప్రారంభమయ్యేలా జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. అంతేకాకుండా వ్యాపారం నిమిత్తం పొందిన రుణాలను ఈఎంఐల రూపంలో 18 నెలలు లేదా 36 నెలల్లో ఎస్హెచ్జీ సభ్యులు చెల్లించవచ్చు. ఆసక్తి కలిగిన సభ్యులను ఎంపిక చేయడంతోపాటు ఏయే వ్యాపారాలు చేయనున్నారనేది ఇప్పటికే జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు నిర్ణయించి ప్రణాళికను రూపొందించారు.
రూ.4 లక్షల వరకు రుణాలు…
ఎంపికైన స్వయం సహాయక సంఘాల సభ్యులు సెర్ప్, స్త్రీనిధి, బ్యాంకుల్లో ఏదో ఒక దాని నుంచి రుణాలను పొందవచ్చు. ఒక్కో సభ్యురాలికి రూ.లక్ష నుంచి రూ.4 లక్షల వరకు రుణం మంజూరు చేయనున్నారు. మరోవైపు స్వయం సహాయక సంఘాల సభ్యులు గ్రామాల్లో స్థానిక పరిస్థితులను బట్టి వ్యాపారం చేసుకునేందుకు నిర్ణయించారు. అంతేకాకుండా వ్యాపారంలోకి అడుగుపెడుతున్న ఎస్హెచ్జీ సభ్యులు నష్టపోకుండా వారిలో వ్యాపారంపై నైపుణ్యాన్ని పెంపొందించేందుకు సెర్ప్ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ఉత్పత్తి, ట్రేడింగ్, సర్వీసు తదితర అంశాల్లో మెళకువల నేర్పనున్నారు. అదేవిధంగా ఒక గ్రామంలోని మహిళా సంఘాల సభ్యులు ఒకే రకమైన వ్యాపారం చేసేందుకు వీలు లేకుండా.. ఒక్కొక్కరు ఒక్కో వ్యాపారం చేసేలా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జిల్లాలో 21 గ్రామీణ మండలాలు, 585 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అలాగే 753 గ్రామసంఘాలు, 19,631 స్వయం సహాయక సంఘాలుండగా 2.20 లక్షల మంది సభ్యులున్నారు. వీరిలో 3170 మంది సభ్యులను ఎంపిక చేశారు. ఆయా గ్రామాల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి కార్యక్రమం ఉద్దేశం తెలియజేసి ఆసక్తిగలవారిని ఎంపిక చేశారు. అంతేకాకుండా వారు చేయనున్న వ్యాపారం, నిర్వహించే స్థలం తదితర వివరాలను కూడా సభ్యుల నుంచి సేకరించారు. ప్రతి సంఘం నుంచి ముగ్గురు నుంచి నలుగురు వ్యాపారం చేసే విధంగా అధికారులు చర్యలు చేపట్టారు.
181 రకాల వ్యాపారాలు…
విలేజ్ ఎంటర్ ప్రైజెస్లో భాగంగా ఉత్పత్తులు, ట్రేడింగ్, సేవల రంగాలకు సంబంధించి జిల్లాలోని 21 గ్రామీణ మండలాల్లో 181 రకాల వ్యాపారాలను ఎస్హెచ్జీ సభ్యులు చేసేందుకు నిర్ణయించారు. అయితే ఉత్పత్తి రంగంలో పేపర్ ప్లేట్లు, కుండలు, బేకరీ, ఇటుకల తయారీ, విస్తరాకు తయారీ యంత్రం, మగ్గం పనులు, పాపడ్, స్నాక్స్ యూనిట్, బాస్కెట్ తయారీ, తట్టలు కుట్టడం, రోటి తయారీ, అగర్బత్లు తయారీ, క్యాండిల్, గుడ్డు ఆధారిత ఆహార ఉత్పత్తులు, స్టేషనరీ, ఫ్ల్లోర్ క్లీనర్, జింజర్ గార్లిక్ పేస్ట్, లేమన్ గ్రాస్, చట్నీ తయారీ, రైస్ మిల్, బీడీ తయారీ, డిటర్జంట్ పౌడర్, పూజ సామగ్రి, చేనేత ఉత్పత్తి పరిశ్రమల వ్యాపారం చేసేందుకు నిర్ణయించారు. అదేవిధంగా ట్రేడింగ్ రంగంలో కిరాణ దుకాణం, బట్టల వ్యాపారం, గాజుల దుకాణం, ఫ్యాన్సీ స్టోర్, కూరగాయల వ్యాపారం, డైరీ, పౌల్ట్రీ, గుడ్ల వ్యాపారం, ఫెర్టిలైజర్ దుకాణం, హార్డ్వేర్ షాప్, ఎలక్ట్రికల్ షాప్, బియ్యం, పప్పు వ్యాపారం, పూలు, పండ్లు, చేపలు, పాన్ షాప్ తదితర వ్యాపారాలను గుర్తించారు. సర్వీసు రంగంలో హోటల్, టిఫిన్ సెంటర్, టైలరింగ్, మటన్, చికెన్ షాప్, మంగళి దుకాణం, జిరాక్స్, పిండి గిర్ని, వాటర్ ప్లాంట్, పాల వ్యాపారం, బ్యూటీ పార్లర్, ఇస్త్రీ దుకాణం, మొబైల్ ఫోన్ మెకానిక్, ఆటో రిక్షా కొనుగోలు, స్కూటర్, ఆటో మెకానిక్, బోర్వెల్ రిపేర్, ఎయిర్ పంపింగ్, ఫంక్చర్, సిమెంట్, కాంక్రీట్ మిక్చర్, మెడికల్ షాప్, టెంట్ సైప్లె సర్వీసు, వెల్డింగ్ షాప్, కెమెరా ఫొటో స్టూడియో తదితర వ్యాపారాలు చేసేందుకు జిల్లాలోని మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు ముందుకొచ్చారు.
ఎంపికైన సభ్యుల వివరాలు..
మండలం సభ్యుల సంఖ్య
అబ్దుల్లాపూర్మెట్ 106
ఆమనగల్లు 48
చేవెళ్ల 203
చౌదరిగూడెం 102
ఫారూఖ్నగర్ 220
ఇబ్రహీంపట్నం 125
కడ్తాల్ 140
కందుకూరు 162
కేశంపేట్ 151
కొందుర్గు 101
మాడ్గుల 170
మహేశ్వరం 163
మంచాల 175
మొయినాబాద్ 202
నందిగామ 161
షాబాద్ 162
శంషాబాద్ 158
శంకర్పల్లి 160
తలకొండపల్లి 163
యాచారం 222
కొత్తూరు 76
ఆగస్టు నెలాఖరులోగా వ్యాపారాలు ప్రారంభం..
విలేజ్ ఎంటర్ప్రైజెస్ కార్యక్రమంలో భాగంగా ఎస్హెచ్జీ సంఘాల సభ్యుల ఎంపిక ప్రక్రియ పూర్తయ్యింది. రుణాల మంజూరుకు సంబంధించి ప్రక్రియ కొనసాగుతుంది. వచ్చేనెల 15లోగా రుణాలు అందజేసి ఆగస్టు నెలాఖరులోగా వ్యాపారాలను ప్రారంభించే విధంగా చర్యలు చేపడుతున్నాం.
-కె.జంగారెడ్డి,
జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు పీడీ