ఇబ్రహీంపట్నం, మే 9 : ఇబ్రహీంపట్నంలో మధ్యాహ్నం 3గంటల నుంచి స్వచ్ఛంద లాక్డౌన్ పాటిస్తున్నారు. మండలంలోని ఉప్పరిగూడ గ్రామం లో సర్పంచ్, సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు బూడిద రాంరెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటా నిత్యావసర సరుకులు, గుడ్లు అందజేయడంతో పాటు కరోనా బాధితులను పరామర్శించారు. ఎలాంటి ఇబ్బందులున్నా తమకు తెలియజేయాలని, గ్రామంలో కరోనా పాజిటివ్ వచ్చిన ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని కోరారు. ఈ సందర్భంగా ఆదివారం ఆశవర్కర్లు, వైద్యారోగ్యశాఖాధికారులతో కలిసి ఇంటింటికీ తిరిగి జ్వర సర్వే చేయించారు.
అందరూ సహకరించాలి..
ఆమనగల్లు, మే 9 : నేటి నుంచి 24 వరకు పట్టణంలో మధ్యాహ్నం నుంచి లాక్డౌన్ విధించేందుకు మున్సిపాలిటీ పాలక మండలి సమష్టి నిర్ణయం తీసుకున్నదని ప్రజలు సహకరించాలని మున్సిపల్ చైర్మన్ రాంపాల్నాయక్ కోరారు. ఆదివారం మున్సిపాలిటీ కార్యాలయం ఆవరణలో పాలవకర్గ సభ్యులు, వ్యాపార, వాణిజ్య దుకాణాల యజమానులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమావేశంలో కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలు, పట్టణ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వ్యాపార లావాదేవీలు తదితర విషయాలపై చర్చించారు. నిబంధనలు అతిక్రమిస్తే రూ.5వేల జరిమానా వేస్తామన్నారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ దుర్గయ్య, కౌన్సిలర్లు చెన్నకేశవులు, లక్ష్మణ్, కృష్ణయాదవ్ పాల్గొన్నారు.
మాడ్గులలో..
మాడ్గుల, మే 9 : కరోనా విస్తరించకుండా పంచాయతీ పాలకమండలి తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు స్వచ్ఛందంగా పాటిస్తున్నారు. ఉదయం వేళల్లో మండల కేంద్రంలో వ్యాపార దుకాణాలు, కూరగాయలు, నిత్యావసర వస్తువులకు సంబంధించి దుకాణాలు మధ్యాహ్నం వరకు మాత్రమే తెరుస్తున్నారు. కరోనాతో ఇబ్బందులు పడుతుంటే వారికి వైద్య సేవలను అందించేందుకు సిద్ధంగా ఉన్నామని, బాధితులు తమకు సమాచారం అందజేయాలన్నారు.
22 వరకు పొడిగింపు
కడ్తాల్, మే 9 : మండల కేంద్రంలో లాక్డౌన్ను పొడిగించారు. ఆదివారం మండల కేంద్రంలోని పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ లక్ష్మీనర్సింహారెడ్డి అధ్యక్షతన వ్యాపారస్తులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మరో పదిరోజులు దుకాణాలు మూసివేసేందుకు ఏకగ్రీవ తీర్మానం చేశారు. దీంతో నేటి నుంచి 22వ తేదీ వరకు మండల కేంద్రంలో దుకాణాల స్వచ్ఛందబంద్కు ప్రజాప్రతినిధులు, వ్యాపారస్తులు నిర్ణయించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ఆనంద్, ఉప సర్పంచ్ రామకృష్ణ, వర్తక సంఘం అధ్యక్షుడు అసిఫ్ అలీ, వెంకటేశ్, చందోజీ, జహంగీర్అలీ, పెంటారెడ్డి పాల్గొన్నారు.