రంగారెడ్డి, ఏప్రిల్ 9, (నమస్తే తెలంగాణ) : కరోనాతో మూతపడిన ప్రైవేట్ విద్యాసంస్థల్లో పనిచేసే బోధన, బోధనేతర సిబ్బందికి ప్రభుత్వం అండగా నిలిచింది. ఆపత్కాలంలో రూ.2వేల ఆర్థిక సాయంతోపాటు ఉచితంగా 25 కిలోల బియ్యాన్ని అందజేసేందుకు నిర్ణయించింది. కరోనాతో ప్రైవేట్ విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేయడంతో ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులతోపాటు సిబ్బంది వారి కుటుంబాలను పోషించుకోలేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రైవేట్ పాఠశాలల టీచర్ల, సిబ్బంది కష్టాలను గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.2వేల ఆర్థిక సాయం, రేషన్ దుకాణాల ద్వారా ఉచితంగా 25 కిలోల బియ్యాన్ని అందించాలని ఆదేశించారు. తమ బ్యాంకు ఖాతా వివరాలతో కలెక్టర్కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ నిర్ణయంతో జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల బోధన, బోధనేతర సిబ్బంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని 23,123 మందికి లబ్ధి చేకూరనున్నది. జిల్లావ్యాప్తంగా 1491 ప్రైవేట్ పాఠశాలలుండగా బోధన సిబ్బంది 21,838 మంది, బోధనేతర సిబ్బంది 1285 మంది ఉన్నారు. పూర్తి వివరాలను ఈనెల 15లోగా సేకరించి ఈనెలాఖరులోగా ఆన్లైన్లో వివరాలను పొందుపర్చనున్నారు.
ప్రతి ఒక్కరికీ ఆర్థిక సాయం : మంత్రి సబితాఇంద్రారెడ్డి
రాష్ట్రంలోని విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేయడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న గుర్తింపు పొందిన ప్రైవేట్ విద్యాసంస్థల ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి రూ.2వేల ఆర్థిక సాయంతోపాటు రేషన్ దుకాణాల ద్వారా 25 కిలోల బియ్యాన్ని అందజేసేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించారు. శుక్రవారం బీఆర్కే భవన్ నుంచి పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్తో కలిసి కలెక్టర్లు, డీఈవోలు, డీఎస్వోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బాధ్యతగా ప్రతి ఒక్కరికీ ఆర్థిక సాయంతోపాటు 25 కిలోల బియ్యం చేరేలా కృషి చేయాలన్నారు. ఈనెల 10 నుంచి 15 వరకు వివరాలను సేకరించాలని, ఈనెల 28లోగా ప్రైవేట్ పాఠశాలల బోధన, బోధనేతర సిబ్బంది వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అమయ్కుమార్ మాట్లాడుతూ జిల్లాలో గుర్తింపు పొందిన పాఠశాలలు 1491 ఉండగా, 23123 మంది బోధన, బోధనేతర సిబ్బంది ఉన్నారని, అదేవిధంగా పూర్తి వివరాలను సేకరించి ప్రభుత్వ ఆదేశానుసారం అమలుచేస్తామన్నారు.
ఇవీ కూడా చదవండి…
వలిగొండ టు కొత్తగూడెం నేషనల్ హైవే
త్వరలోనే ప్రకటించనున్న ప్రభుత్వం: జయేశ్రంజన్