షాబాద్ మండలం కక్కులూర్ గ్రామ పంచాయతీ అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్నది. వంద శాతం మరుగుదొడ్లతోపాటు పన్ను చెల్లిస్తూ జిల్లాలోని మిగతా గ్రామాలకు కక్కులూరు గ్రామ ప్రజలు ఆదర్శంగా నిలుస్తున్నారు. అంతేకాకుండా భూగర్భజలాలను ఒడిసి పట్టేందుకుగాను నీటిని వృథా చేయకుండా ఇంటింటికీ ఇంకుడు గుంతలను కూడా సంబంధిత గ్రామ ప్రజలు నిర్మించుకున్నారు. వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణంతోపాటు గ్రామమంతా పచ్చని చెట్లతో ఆహ్లాదకరంగా గ్రామం రూపుదిద్దుకున్నది. మరోవైపు ప్రతీరోజు పారిశుద్ధ్య నిర్వహణతోపాటు రోడ్లన్నీ శుభ్రం చేస్తుండడంతో అద్దంలా కనిపిస్తున్నాయి. మరోవైపు గ్రామంలో మరణించిన వారి దహన సంస్కారాలను నిర్వహించేందుకు రెండు ఎకరాల్లో వైకుంఠధామాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రత్యేక వాకింగ్ ట్రాక్, వివిధ రకాల మొక్కలతో కూడిన పల్లెప్రకృతి వనం, నర్సరీని ఏర్పాటు చేశారు. గ్రామంలో ఎక్కడా కూడా చెత్త కనిపించకుండా ఇంటింటికీ వెళ్లి తడి, పొడి చెత్తలను వేరుగా పంచాయతీ కార్మికులు సేకరిస్తూ డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు.
పల్లెప్రగతితో గ్రామాల్లో మార్పు..
పల్లెప్రగతి కార్యక్రమంతో కక్కులూర్ గ్రామ పంచాయతీలో చాలా మార్పు వచ్చింది. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలతో గ్రామమంతా పచ్చదనం వెల్లివిరుస్తున్నది. పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామానికి నెలకు రూ.1.98 లక్షల నిధులను ప్రభుత్వం విడుదల చేస్తున్నది. పల్లెప్రగతిలో భాగంగా పల్లెప్రకృతివనం, డంపింగ్ యార్డు, వైకుంఠధామం, తడి, పొడి చెత్త సేకరణకు ప్రత్యేకంగా ట్రాక్టర్ కొనుగోలు, నర్సరీ ఏర్పాటుతోపాటు రైతువేదిక నిర్మాణం, సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ తదితర పనులను చేపట్టారు. రూ.10 లక్షలతో ఎకరా స్థలంలో వైకుంఠధామాన్ని ఏర్పాటు చేశారు. అక్కడే స్నానాలు చేసేందుకుగాను మహిళలకు, పురుషులకు ప్రత్యేకంగా స్నానాల గదులను కూడా నిర్మించారు.
మూడు విడుతల పల్లెప్రగతిలో భాగంగా కూలిపోయిన ఇండ్లు, భవన శిథిలాలను తొలగించడం, నిరుపయోగంగా ఉన్న బావులను పూడ్చివేయడంతోపాటు ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను శుభ్రం చేశారు. గ్రామాల్లో సర్కార్ తుమ్మ, జిల్లెడు వంటి కలుపు మొక్కలు, పెంట కుప్పలను తొలగించడం, మురుగు కాలువల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగిస్తున్నారు. ఇంటింటికీ తడి, పొడి చెత్తను వేరుగా వేసేందుకు డబ్బాలను కూడా అందజేశారు. పంచాయతీ డబ్బులతో కొనుగోలు చేసిన ట్రాక్టర్లో చెత్తను డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. అండర్ డ్రైనేజీ వ్యవస్థతో ఎక్కడా కూడా మురుగు నీరు కనపడే పరిస్థితి లేదు. మిషన్ భగీరథతో 515 ఇండ్లకు నల్లాల ద్వారా తాగునీరు అందిస్తున్నారు.
గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నాం
ప్రభుత్వ నిధులతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నాం. ఇప్పటికే సీసీ రోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీల నిర్మాణం చేపట్టాం. పల్లెప్రగతిలో చేపట్టిన పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువచ్చాం. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రామ పంచాయతీలన్నీ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నాయి.