వీధుల్లో జిగేల్ మంటున్న విద్యుత్ దీపాలు
పురాతన ఇండ్లు, రాళ్ల కుప్పల తొలగింపు
వైకుంఠధామం, డంపింగ్ యార్డు నిర్మాణం
గ్రామపంచాయతీ ట్రాక్టర్తో నిత్యం చెత్త సేకరణ
ప్రతి వీధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీల నిర్మాణం
పచ్చగా కనువిందు చేస్తున్న హరితహారం మొక్కలు
పల్లె చిన్నదే..కానీ ప్రగతి పథంలో మాత్రం దూసుకెళ్తున్నది. సీఎం కేసీఆర్ పల్లెల అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన ‘పల్లె ప్రగతి’ కార్యక్రమం ఆ గ్రామానికి వరంగా మారింది. ప్రతి వీధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, నిత్యం చెత్త సేకరణతో పల్లెంతా పరిశుభ్రంగా మారింది. హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలు పచ్చగా దర్శనమిస్తూ కనువిందు చేస్తున్నాయి. సమష్టి కృషితో మరింత అభివృద్ధి చేసుకుంటామని దేవరంపల్లి గ్రామస్తులు పేర్కొంటున్నారు.
చేవెళ్ల టౌన్, మే, 8 : మండలంలోని దేవరంపల్లి ఓ చిన్న పల్లె. 1982 లో పంచాయతీగా ఏర్పడింది. దేవరంపల్లి లో 2011 జనాభా లెక్కల ప్రకారం 839 మంది ప్రజలు ఉన్నారు. 718 మంది ఓటర్లు ఉన్న ఈ గ్రామంలో ఇదివరకు పడావ్పడ్డ, పురాతన ఇండ్లతోపాటు అక్కడక్కడ రాళ్లకుప్పలతో నిండి ఉండేది. తరుచూ పాములు, తేళ్లు బయటకు వస్తుండడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యేవారు. మురుగు కాల్వలు లేక అస్తవ్యస్తంగా ఉండడంతో గ్రామవాసులు ఇబ్బందులు పడేవారు. తెలంగాణ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా ప్రవేశపెట్టిన ‘పల్లె ప్రగతి’ కార్యక్రమంతో గ్రామ ముఖ చిత్రమే మారింది. పురాతన ఇండ్లు, రాళ్ల కుప్పలను తొలగించి సీసీ రోడ్లను వేయడంతో ప్రతి వీధి కళకళలాడుతున్నది. మురుగు నీరు రోడ్ల పారకుండా అండర్గ్రౌండ్ డ్రైనేజీలనూ నిర్మించారు. నిత్యం గ్రామపంచాయతీ ట్రాక్టర్తో ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరిస్తున్నారు. రోడ్ల వెంట మొక్కలు నాటడంతో ఏపుగా పెరిగి పచ్చందాన్నిస్తున్నాయి. దీంతో ఊరంతా క్లీన్ అండ్ గ్రీన్గా మారింది. సేకరించిన చెత్తను డంపింగ్ యార్డుకు తరలించి సేంద్రియ ఎరువును తయారు చేస్తున్నారు. మినీ ట్రాక్టర్తో హరితహారం మొక్కలకు నీళ్లను పోస్తూ సంరక్షిస్తున్నారు. గ్రామ నర్సరీలో హరితహారానికి మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. స్థల సేకరణకు ఆలస్యమైనా వైకుంఠధామం నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయి. ఎస్సీ కాలనీ, లక్ష్మీఅనంత పద్మనాభస్వామి వారి ఆలయం ఎదురుగా ఉన్న కాలనీలో అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. పల్లె ప్రకృతి వనం నిర్మాణంతో ఆహ్లాదకర వాతావరణం నెలకొన్నది. రకరకాల పూల మొక్కలతో పాటు వివిధ రకాల మొక్కలను నాటారు. ప్రతి వీధిలో విద్యుత్ దీపాలను వేయడంతో రాత్రి జిగేల్మంటున్నాయి. మిషన్ భగీరథ నీటి ట్యాంకును నిర్మించి ఇంటింటికీ నల్లా వేయడంతో తాగునీటి సమస్య తీరింది. పల్లె చిన్నదైనా అభివృద్ధిలో దూసుకెళ్తూ చుట్టుపక్కల గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నది.
గ్రామాభివృద్ధే ధ్యేయం
గ్రామాభివృద్ధే ధ్యేయంగా ప్రణాళికను రూపొందించుకున్నాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను పూర్తి చేశాం. నిత్యం చెత్త సేకరణ, ఇంటింటికీ మరుగుదొడ్ల నిర్మాణంతో స్వచ్ఛ గ్రామంగా మారింది. హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి వీధిలో మొక్కలు నాటాం. గ్రామస్తుల సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తా. మా గ్రామానికి వరంగా మారిన ‘పల్లె ప్రగతి’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్న సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు.
బచ్చంగారి నరహరిరెడ్డి, సర్పంచ్, దేవరంపల్లి
ప్రజల సహకారంతో పనులు పూర్తి
ప్రజల సహకారంతో అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. గ్రామంలో వైకుంఠధామం, డంపింగ్ యార్డును నిర్మించాం. అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఉపాధి హామీ పనులను ప్రారంభించాం. పారిశుధ్యం, మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నాం.
మహ్మద్ ఫైజుద్దీన్, పంచాయతీ కార్యదర్శి