ఇబ్రహీంపట్నం, మే7: ఇబ్రహీంపట్నంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో శనివారం నుంచి మినీ లాక్డౌన్ విధించాలని మున్సిపల్ పాలకవర్గం, వ్యాపారస్తులు నిర్ణయించారు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం మున్సిపల్ పాలకవర్గం వ్యాపారస్తులు సమావేశం ఏర్పాటుచేసి, కరోనా కట్టడికి మినీ లాక్డౌన్ చేయడమే సరైన మార్గమని నిర్ణయించారు. ఉదయం నుంచి 3గంటల వరకే దుకాణాలు, వ్యాపార లావాదేవీలు నిర్వహించుకోవాలని, తరువాత వ్యాపార సంస్థలన్ని మూసివేయాలని తీర్మానించారు. ఈ లాక్డౌన్కు వ్యాపారస్తులంతా సహకరించాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ స్రవంతి, వైస్చైర్మన్ యాదగిరి, కమిషనర్ జయంత్కుమార్, మాజీ చైర్మన్ భరత్కుమార్, కౌన్సిలర్లు బర్ల మంగ, విశాల, మమత, ఇందిరాల రమేశ్, జగన్నాధం, కో ఆప్షన్ మెంబర్ టేకుల రాంరెడ్డి, వ్యాపారస్తులు శ్రీనివాస్, కిరణప్ప, మల్లప్ప, నరేందర్, అశోక్ పాల్గొన్నారు.
మాడ్గులలో..
మాడ్గుల, మే7: మండల కేంద్రంలో కరోనా వ్యాపించకుండా స్వచ్ఛంద లాక్డౌన్ పెట్టాలని పంచాయతీ పాలకమండలి సభ్యులు కీలక నిర్ణయం తీసుకొన్నారు. ప్రజలంతా నిత్యావసర సరకులకు ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు ఉదయం 6 నుంచి 11 గంటల వరకు వ్యాపార, వాణిజ్య కార్యకాలపాలు నిర్వహించుకునేందుకు వీలుకల్పించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి తెల్లవారు 6గంటల వరకు లాక్డౌన్ కొనసాగేలా సమిష్టి నిర్ణయం తీసుకున్నారు. ప్రజలంతా తమ ఇండ్లలోనే ఉండాలని సర్పంచ్ అంబాల జంగయ్య కోరారు.
షాబాద్లో..
షాబాద్, మే7: కరోనా కేసులు పెరుగుతుండడంతో గ్రామాల్లో స్వచ్ఛందంగా లాక్డౌన్ విధించుకుంటున్నారు. మండల కేంద్రంలో శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు దుకాణాలు తెరవాలని, ఆ తర్వాత లాక్డౌన్ విధించాలని పంచాయతీ పాలకవర్గం తీర్మానించింది. దీంతో మధ్యాహ్నం 2గంటల తర్వాత దుకాణాలు బంద్ చేయడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి.