ఇబ్రహీంపట్నం, జులై 2 : పల్లె ప్రగతితో జాఫర్గూడ గ్రామాన్ని మహర్దశ వచ్చింది. గతంలో ఎక్కడ చూసినా మురుగు నీటి కాల్వలు, మట్టిరోడ్లు, రోడ్లపక్కన పెంటకుప్పలతో అభివృద్ధి ఆమడదూరంలో ఉన్న ఈ గ్రామం ప్రస్తుతం పచ్చదనం, పరిశుభ్రతతో కళకళలాడుతున్నది. ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతితో గ్రామ రూపురేఖలే మారాయి. స్థానిక సర్పంచ్ లావణ్య ప్రత్యేక చొరవతో గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నారు. రెండేండ్లలోనే సీసీరోడ్లు, భూగర్భడ్రైనేజీలు, కమ్యూనిటీ భవనం, వైకుంఠధామం, వర్మీ కంపోస్టుయార్డు వంటి మౌలిక వసతులు కల్పించారు. దీంతో మురుగు, బురద తదితర సమస్యలకు చెక్ పడింది. ఇక పల్లె ప్రకృతివనం, హరితహారం నర్సరీలు గ్రామానికే ఆకర్షణగా నిలుస్తున్నాయి. నిత్యం వీధులను శుభ్రం చేయడం, పిచ్చిమొక్కలను తొలగించడం, మొక్కలకు నీరు అందించడం వంటి పనులు చేపడుతున్నారు. గ్రామంలో ఏ వీధిలో చూసినా సీసీరోడ్లు కనిపిస్తాయి. గ్రామాభివృద్ధిపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
హరితహారంలో అగ్రగామి..
ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో జాఫర్గూడ గ్రామం అగ్రగామిగా నిలిచింది. గ్రామ ప్రజలు ఎంతో పట్టుదలతో సర్పంచ్ సహకారంతో ప్రతి ఇంటికి ఆరు మొక్కల చొప్పున నాటి పెంచుతున్నారు. గత హరితహారంలో నాటిన మొక్కలు నేడు ఏపుగా పెరిగి స్వచ్ఛమైన గాలిని అందిస్తున్నాయి. నాటిన మొక్కలకు కంచెను ఏర్పాటు చేసి నిత్యం నీరు అందిస్తూ, కలుపు తీస్తూ కంటికి రెప్పలా కాపాడుతున్నారు.
గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తాం
పల్లె ప్రగతిలో భాగంగా గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దుతున్నాం. ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాం. రెండేళ్ల కాలంలో గ్రామాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపాం. ప్రతి కాలనీలో సీసీరోడ్లు, డ్రైనేజీలు నిర్మించాం. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో పంచాయతీ కార్మికుల పాత్ర గొప్పది.
-లావణ్య రాధాకృష్ణ, జాఫర్గూడ సర్పంచ్