మాడ్గుల, మే 3 : కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటున్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ పేర్కొన్నారు. ఆదివారం మండల కేంద్రంలో జిల్లా సహకార మార్కెటింగ్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు దళారుల బారిన పడి మోసపోవద్దన్నారు. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని కోరారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చే రైతులు తేమ శాతం 17 ఉండేలా చూసుకోవాలన్నారు. క్వింటాళ్కు ఏ గ్రేడ్ రకానికి రూ. 1888 ధర నిర్ణయించినట్లు చెప్పారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ తిరుమలరెడ్డి, డీసీఎమ్ఎస్ ఇన్చార్జి స్రవంతి, వ్యవసాయ అధికారి గౌతమ్, రైతుబంధు సమితి డైరెక్టర్ కృష్ణారెడ్డి, సర్పంచులు అంబాల జంగయ్య, రమేశ్రెడ్డి, ఎంపీటీసీలు వెంకటయ్య, ఏఈవోలు జ్యోత్స్న, భూదేవి పాల్గొన్నారు.
సంస్కృతి, సంప్రదాయాలు కాపాడుకోవాలి
గ్రామాల్లో సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మండల పరిధిలోని రావిచేడ్ గ్రామంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న బొడ్రాయి ప్రతిష్ఠాపన మహోత్సవాలు సోమవారం ముగిశాయి. వేడుకలలో భాగంగా పండితుల మంత్రోచ్ఛరణల మధ్య బొడ్రాయిని ప్రతిష్ఠించారు. ఉత్సవాల్లో భాగంగా విఘ్నేశ్వర పూజ, నవగ్రహ పూజ, జలాధివాసము, గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జైపాల్యాదవ్ బొడ్రాయి వద్ద పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులను నిర్వాహకులు శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ దశరథ్నాయక్, సర్పంచ్ భారతమ్మ, ఎంపీటీసీలు గోపాల్, లచ్చిరాంనాయక్, ఉప సర్పంచ్ వెంకటేశ్, పీఏసీఎస్ డైరెక్టర్ శ్రీనివాస్, నాయకులు విఠలయ్య, మహేందర్రెడ్డి, రంగయ్య, యాదయ్య పాల్గొన్నారు.