కులకచర్ల, ఏప్రిల్ 1: మండలంలోని బండవెల్కిచర్ల సమీపంలో ఉన్న పాంబండ రామలింగేశ్వర స్వామి దేవాలయం మహిమాన్విత క్షేత్రంగా ఏకశిలా పర్వతంగా వెలుగొందుతున్నది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు కోర్కెలు తీర్చే స్వామిగా భక్తుల పూజలందుకుంటున్నాడు. ఈ స్వామి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి 13వ తేదీ వరకు జరుపనున్నారు. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ ఉత్సవాలు నిర్వహించేందుకు దేవాలయ కమిటీ సభ్యులు, అధికారులు చర్యలు తీసుకున్నారు. ప్రతి సంవత్సరం ఉగాదికి 12 రోజులపాటు నిర్వహించే రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భక్తులు లక్షల సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకుంటారు. ప్రతి సంవత్సరం రెండు పర్యాయాలు ఈ బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. శ్రావణమాసం చివరి సోమవారం మూడు రోజులు, ఉగాదికి ముందు 12 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుపుతారు. కులకచర్ల గ్రామం నుంచి పాంబండ దేవాలయానికి 2 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది.
పాంబండ విశిష్టత
బండవెల్కిచర్ల సమీపంలో ఉన్న పాంబండ రామలింగేశ్వ స్వామి దేవస్థానానికి ఘననీయమైన చరిత్ర ఉంది. సుమారు కిలోమీటర్ వరకు కులకచర్ల నుంచి పాంబండ వరకు రాతిబండ ఉంది. ఈ బండ పాముల వంకరలు తిరిగి ఉంది. దేవాలయ వెనుక భాగం పాము నాలుకలా కనిపిస్తుంది.
గతంలో పాము బండమధ్యలో నుంచి వెళ్లడం వల్ల బండ రెండుగా చీలిపోయిందని పలువురు పేర్కొంటున్నారు. పాము రాతిగా మారిందని అందువల్ల ఈ బండకు పాముబండ అని కాలక్రమేనా పాంబండగా రూపాంతరం చెందిందని పూరాణాలు చెబుతున్నాయి. ఈ బండను పాంబండ ఏకశిలా పర్వతంగా కూడా ప్రస్తుతం పిలుస్తున్నారు. త్రేతాయుగంలో సీతను ఎత్తికెళ్లిన రావణుడిని సంహరించిన రాముడు హత్యపాప విమోచనం కోసం కోటి లింగాలను స్థాపించాలని బ్రహ్మర్షులు శ్రీరామునికి సూచిస్తారు. దీంతో రాముడు కోటి లింగాల స్థాపించడానికి పూనుకుంటాడు. అందులో భాగంగానే కులకచర్ల మండలం పాంబండపైన రాముడు లింగాన్ని ప్రతిష్ఠించి, పూజ చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. రాముడు పాంబండపై కొన్నాళ్లు గడిపాడని, నిత్యం శివుడికి పూజ చేసే రాముడు లింగమూర్తిని స్వయంగా ప్రతిష్ఠించి, పూజలు చేశారని పూరాణాల్లో చెబుతున్నారు.
బండ వెనుకభాగంలో పుట్టులింగం గుడి ఉండగా, ఈ పుట్టులింగం ప్రతి ఏడాది కొంచెం కొంచెం పెరుగుతుందని భక్తుల విశ్వాసం. ఆలయం పక్కనే భ్రమరాంబదేవీ, ఆంజనేయస్వామి ఆలయాలు ఉన్నాయి. ఆల యం ముందుభాగంలో నవగ్రహాలను ప్రతిష్ఠిం చారు. శకటోత్సవం, రథోత్సవం, అగ్నిగుండాలు, వివిధ రకాల సేవలు స్వామి వారికి వైభవంగా జరుపుతారు. గతంలో రామప్ప అనే ముని అక్కడే తపస్సు చేసి అక్కడే సమాధి అయ్యారని పెద్దలు చెబుతారు. ఆయన సమాధి కూడా ఉంది. ప్రతి పౌర్ణమికి అన్నదానం చేస్తారు. పాంబండపై ఉన్న గుండానికి చాలా విశిష్టత ఉంది. ఇందు లో ఎప్పుడూ నీరు ఉంటుంది. చుట్టుపక్కల గ్రామాల వారు గుండం నీటిని తమ పొలాల్లో చల్లుతారు. పరిగి నుంచి మహబూబ్నగర్ వెళ్లే బస్సులు, కోస్గి నుంచి కులకచర్ల మీదుగా షాద్నగర్ వెళ్లే బస్సుల్లో బ్రహ్మోత్సవాలకు చేరుకోవచ్చు.
పూజాకార్యక్రమాలు:
ప్రతి రోజు ఉదయం 6 గంటలకు అభిషేకం, 5 నుంచి మధ్యాహ్నం 1 వరకు, మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 8 వరకు పూజలు చేస్తారని పూజారి పాండు తెలిపారు.
పూజా కార్యక్రమాలు
2న ధ్వజారోహణం, పుణ్యావచనం, కలశ స్థాపన. సాయంత్రం స్వామి వారిని అర్చకుల ఇంటి నుంచి పాంబండ గుట్టపైకి ఊరేగింపుగా తీసుకొచ్చుట
3న సాయంత్రం పల్లకీ సేవ
4న స్వామికి శకటోత్సవం (బండ్లు తిరుగుట), సాయంత్రం పల్లకీ సేవ
5న సాయంత్రం పల్లకీ సేవ
6న సాయంత్రం పల్లకీ సేవ
7న సాయంత్రం పార్వతీ పరమేశ్వరుల కల్యాణం, రాత్రికి రథోత్సవం
8న పల్లకీ సేవ, హారతి
9న పల్లకీ సేవ, హారతి
10న రాత్రి అగ్ని గుండాలు, నిరంతర భజనలు
11న (అమావాస్య) సర్వ దర్శనం
12న (అమావాస్య) సర్వదర్శనం
13న శ్రీప్లవ నామ సంవత్సర చైత్ర శుద్ధ పాడ్యమి ఉగాది. స్వామి వారిని బండవెల్కిచర్ల గ్రామానికి తీసుకెళ్లుట, పంచాంగ శ్రవణం, అనంతరం ఉత్సవాలు ముగుస్తాయి.
ఇవీ కూడా చదవండీ..
వ్యవసాయ చట్టాలపై సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించిన కమిటీ
ఇష్రత్ జహాన్ ఎన్కౌంటర్ కేసు : చివరి ముగ్గురు నిందితులు విడుదల