ఆమనగల్లు,మే 11 : రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని వాటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సింగిల్విండో చైర్మన్ వెంకటేశ్ కోరారు. మంగళవారం ఆమనగల్లు మార్కెట్ కార్యాలయం ఆవరణలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చిన రైతులతో మాట్లాడి సమస్యను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు తీసుకొచ్చిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పిస్తున్నట్లు చెప్పారు. రైతులకు ఇబ్బందులు పడకుండా సింగిల్విండో, మార్కెట్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో కొనుగోలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రైతులను దళారులు మోసం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొనుగోలు కేంద్రాల్లో దళారులు రైతులను ఇబ్బందులకు గురిచేస్తే తమకు ఫిర్యాదు చేయాలన్నారు. మూడు రోజుల నుంచి ఆమనగల్లు బ్లాక్ మండలాల నుంచి రైతులు ధాన్యాన్ని అమ్ముకునేందుకు తరలివస్తున్నట్లు చెప్పారు. కొనుగోలు కేంద్రాల్లో పందుల బెడుద ఉందని మార్కెట్ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ సత్యం, డైరెక్టర్లు వెంకటయ్య, దోల్య, సేవ్యానాయక్ పాల్గొన్నారు.