రంగారెడ్డి, ఆగస్టు 10, (నమస్తే తెలంగాణ): స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా జిల్లావ్యాప్తంగా బుధవారం వన మహోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రతి మండల కేంద్రం, గ్రామ పంచాయతీలో ఫ్రీడమ్ పార్కుల్లో మొక్కలు నాటారు. మండల కేంద్రాల్లో 750 మొక్కలు, ప్రతి గ్రామ పంచాయతీలో 75, మున్సిపాలిటీ కేంద్రాల్లో 750, వార్డుల్లో 75 మొక్కలను నాటారు. జిల్లావ్యాప్తంగా 84,890 మొక్కలను నాటారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి మహేశ్వరం నియోజకవర్గంలోని మహేశ్వరం మండలం గడికోట, కందుకూరు మండల కేంద్రంతోపాటు కొత్తగూడ గ్రామ పంచాయతీలో పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వజ్రోత్సవ వేడుకల్లో భాగస్వాములై దేశకీర్తిని ప్రపంచానికి చాటాలని మంత్రి పిలుపునిచ్చారు. ప్రజలందరిలో జాతీయతా భావం పెంపొందేలా తెలంగాణ ప్రభుత్వం పదిహేను రోజులపాటు పెద్దఎత్తున కార్యక్రమాలను చేపడుతుందన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్రతిఒక్కరూ ఇంటిపై మువ్వన్నెల జెండాను ఎగురవేయాలని సూచించారు. అదేవిధంగా మొయినాబాద్ మండలం నజీబ్నగర్, శంకర్పల్లిలో చేవెళ్ల నియోజకవర్గ ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఇబ్రహీంపట్నం మండలం చర్లపటేల్గూడలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి, షాద్నగర్ పట్టణంతోపాటు కమ్మదనంలో షాద్నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, కడ్తాల్ మండల కేంద్రంలో కల్వకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ వనమహోత్సవంలో పాల్గొని ఫ్రీడమ్ పార్కులో మొక్కలు నాటారు.
పరిగి, ఆగస్టు 10 : స్వతంత్ర వజ్రోత్సవాల మూడవ రోజు బుధవారం వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా ఫ్రీడమ్ పార్కుల్లో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. జిల్లా పరిధిలోని మున్సిపాలిటీలు, మండల కేంద్రాలతోపాటు గ్రామాల్లోని పార్కుల్లో మొక్కలు నాటారు. మున్సిపాలిటీల్లో ఎంపిక చేసిన ఫ్రీడమ్పార్కులు, మండల కేంద్రాలు, గ్రామాల్లోని పల్లె ప్రకృతివనాలు, బృహత్ పల్లె ప్రకృతి వనాల్లో మొక్కలు నాటారు. వజ్రోత్సవాలకు గుర్తుగా ఒక్కో పార్కులో కనీసం 75 మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా బుధవారం ఒక్కరోజు 44వేల మొక్కలు నాటారు. జిల్లాలోని పరిగి, పూడూరులో పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి, బొంరాస్పేట్లో కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి, కులకచర్ల మండలం తిర్మలాపూర్లో డీసీసీబీ చైర్మన్ బి.మనోహర్రెడ్డి, జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణలో ఎస్పీ కోటిరెడ్డి మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.