తాండూరు, మే 19: కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ తాండూరు నియోజకవర్గంలో పకడ్బందీగా కొనసాగుతున్నది. బుధవారం ఎనిమిదో రోజూ ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు దుకాణాల్లో, కూరగాయ మార్కెట్లో, రోడ్లపై జనం గుంపులుగా కనీస నిబంధనలు పాటించకుండా కనిపించారు. ఆ తర్వాత ఇండ్లకే పరిమితమయ్యారు. లాక్డౌన్ సమయంలో పోలీసులు పట్టణంలోని వార్డులతో పాటు పల్లెల్లో పెట్రోలింగ్ నిర్వహించారు. డ్రోన్ కెమరాతో పోలీస్ అధికారులు లాక్డౌన్ను పరిశీలించారు. అనవసరంగా బయట తిరిగే వాహనాదారులను పట్టుకొని కౌన్సిలింగ్ ఇస్తు జరిమానాలు వేశారు. తాండూరు డీఎస్పీ లక్ష్మీనారాయణ, రూరల్ సీఐ జలెందర్రెడ్డి, పట్టణ సీఐ రాజేందర్రెడ్డి మాట్లాడుతూ కరోనాను అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రతి ఒక్కరు గౌరవిస్తూ 10 తర్వాత ఎట్టి పరిస్థితుల్లో బయటకు రాకూడదని సూచించారు.
పరిగి మండలంలో..
పరిగి, మే 19 : పరిగి మండలంలో లాక్డౌన్ ప్రశాంతంగా కొనసాగుతుంది. పరిగి మున్సిపల్ పరిధిలో ఉదయం 10గంటల నుంచి దుకాణాలు మూతపడ్డాయి. జనాలు లేక రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. ఉదయం 6 నుంచి 10 వరకు మాత్రమే ప్రజలు నిత్యావసర సరుకుల కోసం రాగా, ఆ తర్వాత ఇంటికే పరిమితమవుతున్నారు.
కులకచర్ల, మే 19: కులకచర్ల మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో లాక్డౌన్ ప్రశాంతంగా కొనసాగుతుంది. కులకచర్ల మండల కేంద్రంలో సంతను రద్దు చేశారు. దీంతో మండల కేంద్రంలో పెద్ద గేటు చౌరస్తాలో ఉదయం సమయంలో సర్పంచ్ సౌమ్యారెడ్డి, ఎస్సై విఠల్రెడ్డి పరిశీలించారు. నిత్యావసర సరుకులు కొనుగోలు చేయడానికి వచ్చిన వారు సామాజిక దూరాన్ని పాటించాలని ప్రజలకు సూచించారు.