తలకొండపల్లి : రైతుల ఆత్మగౌరవం, వారి అభ్యుదయం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు సాగుతున్నారని మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. శనివారం తలకొండపల్లి మండలంలో ఎమ్మెల్యే జైపాల్యాదవ్, ఎంపీ రాములు, ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణరెడ్డి, గోరెటి వెంకన్నతో కలిసి రాంపూర్, మెదక్పల్లి, జంగారెడ్డిపల్లి గ్రామాల్లో రైతు వేదికలు, అంగన్వాడీ కేంద్రం, వైకుంఠధామాలు, పల్లెప్రకృతి వనాలను ప్రారంభించారు. తలకొండపల్లి మండలానికి వచ్చిన మంత్రికి టీఆర్ఎస్ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో సమూలమైన మార్పులు మనం చూస్తున్నామన్నారు. గ్రామాల్లో ఎదైతే మార్పు కోరుకున్నామో వైకుంఠ ధామాల ద్వారా ప్రారంభమయ్యాయని అన్నారు. ఏ రాష్ట్రంలో రైతువేదికలు లేవని ఆరు నెలల్లో 2వేల 6వందల రైతు వేదికలు పూర్తి చేయడం జరిగిందన్నారు. మిషన్ భగీరథ పథకాన్ని దేశం అంతా అమలు చేయాలని ఇతర రాష్ట్రాల వారు తిరిగి చూస్తుంన్నారని అన్నారు.
ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో రైతు వేదికల ద్వారా వ్యవసాయ మెలుకువలు, నూతన ఆవిష్కరణలపై డిజిటల్ క్లాసులు ఉంటాయని తెలిపారు. ఇతర వర్గాలకు సంఘం ఉంది కాని 60 లక్షల కుటుంబాలున్న అషేశ రైతులోకానికి ఒక సంఘం అంటూ లేదని అన్నారు. రైతుల ఆశలు, ఆకాంక్షలు, ఇబ్బందులు తెలిపే వేదిక లేదని అందుకే రైతు వేదికలు నిర్మించేందుకు ప్రభుత్వం పూనుకుందని అన్నారు. రాజకీయాలకు అతీతంగా రైతాంగాన్ని ఒక్కతాటిపైకి తీసుకొచ్చే ఉద్దేశమే రైతు వేదికలని అన్నారు. వ్యవసాయం మన జీవన సంసృతి అని వ్యవసాయం మీద ఆధారపడి 60శాతం జనాభ ఆధారపడి ఉందన్నారు.
మార్కెట్ డిమాండ్ను తెలుసుకొని ఏ పంటలు వేయాలో ప్రభుత్వం నిర్ణయించి రైతుబంధు సమితులకు వ్యవసాయ శాఖ సమాచారం ఇస్తున్నదన్నారు. రైతాంగం ఆత్మ వివాసంతో వ్యవసాయం చేయాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచన అని అన్నారు. వ్యవసాయానికి సంబంధిచిన ఎరువులు, పంటల సాగు, దిగుబడికి అనుసరించాల్సినటువంటి సమగ్ర సమాచారం రైతు వేదికల ద్వారా తెలియజేస్తామని అన్నారు. రైతు వేదికల భవనాలు భవిష్యత్లో వ్యవసాయ విప్లవానికి నాంది అవుతాయని పేర్కొన్నారు. వీలయినంత త్వరగా పాలమూరు-రంగారెడ్డి ద్వారా నీళ్లు ఇవ్వలన్న ఆలోచనలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారని తెలిపారు.
ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తిపై రాజధాని సమీప రైతులు దృష్టి పెట్టాలని సూచించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ వెంకటేశ్, ఎంపీపీ నిర్మల, సర్పంచ్లు ధరణి శివశంకర్రెడ్డి, వరలక్ష్మీరాజేందదర్రెడ్డి, శ్యాంసుందర్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, రైతుబంధు మండల అధ్యక్షడు దశరథ్నాయక్, జడ్పీకోఆప్షన్ సభ్యులు రహమాన్, మార్కెట్ కమిటీ చైర్మన్ వరలక్ష్మీ సురేందర్రెడ్డి, మాజీ జడ్పీటీసీ నర్సింహ, మాజీ ఎంపీపీ శ్రీనివాస్యాదవ్, ఏంపీటీసీలు సుధాకర్రెడ్డి, వందనశ్రీనివాస్రెడ్డి, ఆయా శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు.