ఇబ్రహీంపట్నంరూరల్ : మొహరం పండుగను తెలుగు ప్రాంతాల్లో పీర్ల పండుగ అంటారు. ముస్లింల విశ్వాసం ప్రకారం ఒక్క గొప్ప మాసం ఇది. ముఖ్యంగా షియా ముస్లింలు ఈ నెలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో మొహరం పండుగను పీర్ల పండుగగా అభివర్ణిస్తారు. ప్రతి ఏడాది పది రోజుల పాటు ముస్లింల సంతాప దినాలుగా పాటిస్తారు. ముస్లింలతో కలిసి హిందువులు సైతం అత్యంత భక్తిశ్రద్ధలతో పాల్గొని తమ ఐక్యతను చాటి చెబుతారు. పండుగ మొదటి రోజు పీర్లను ప్రత్యేకంగా అలంకరించి ప్రార్థన మందిరంలో ప్రతిష్టించి దానికి ఎదురుగా నిప్పుల గుండం తవ్వుతారు.
దానిలో మంటలు మండించి, రాత్రిపూట జాగారం చేస్తూ జోరుగా అడుగులు వేస్తూ ఆటలాడుతారు. గుండం చుట్టూ కలిసి కట్టుగా తిరుగుతూ ఉస్సేన్ను స్మరిస్తూ పాటలు పాడుతారు. పండుగను ప్రతి ఏడాది ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని నెరపల్లి, ఆరుట్ల, దండుమైలారం, రాయపోల్, చింతపట్ల, యాచారంతో పాటు పలు గ్రామాల్లో పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. మొహరం సందర్భంగా గ్రామాల్లో ముస్లింలు, హిందువులు పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తుండటంతో పీర్ల ఊరేగింపుతో గ్రామాలు పండుగ వాతావరణంలా సందడి నెలకొంది.