కొవిడ్కు విరుగుడుగా ఉపయోగిస్తున్న రెమ్డిసివిర్ ఇంజక్షన్ను అక్రమంగా విక్రయిస్తున్న ముఠాలపై హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు కొరడా ఝలిపిస్తున్నారు. బ్లాక్ దందా చేస్తున్నారనే విశ్వసనీయ సమాచారంతో సోమవారం రాత్రి నుంచి వరుసగా దాడులు చేస్తున్నారు. ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకొని కొందరు మెడికల్ దుకాణాల వ్యాపారులు, ఇంజక్షన్ తయారీ కంపెనీలలో పనిచేసే ఉద్యోగులు, మెడికల్ రిప్రజెంటివ్లు కలిసి ఈ దందాకు పాల్పడుతున్నారు. మంగళవారం వెస్ట్జోన్, సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు వేర్వేరు ఘటనల్లో నలుగురు వ్యక్తులను పట్టుకుని, 10 ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ఫోర్స్ డీసీపీ రాధాకిషన్రావు తెలిపిన వివరాల ప్రకారం.. యూసుఫ్గూడ రహమత్నగర్కు చెందిన షేక్ మజార్ స్థానికంగా గ్లోబల్ ఫార్మసీ పేరుతో మెడికల్ షాప్ నిర్వహిస్తున్నాడు. మెడికల్ దుకాణానికి వచ్చి చాలా మంది రెమ్డిసివిర్ ఇంజక్షన్ గురించి ఆరా తీస్తున్నారు.
ప్రస్తుతం కొవిడ్ వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో రెమ్డిసివిర్ ఇంజక్షన్కు ఉన్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని వాటిని బ్లాక్లో రూ.35వేలకు అవసరమున్న వారికి విక్రయిస్తున్నాడు. మంగళవారం లంగర్హౌస్లోని ఓలివ్ దవాఖాన వద్దకు (టీఎస్07జీపీ 2554) హోండాయాక్టివాపై వచ్చి విక్రయించే ప్రయత్నం చేశాడు. ఈ సమాచారం అందుకున్న వెస్ట్జోన్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాజేశ్ బృందం షేక్మాజర్ను అదుపులోకి తీసుకొని విచారించగా అతడి వద్ద ఆరు ఇంజక్షన్లు లభించాయి. దీంతో నిందితుడిని అరెస్ట్ చేసి, ఇంజక్షన్లు, బైక్ను స్వాధీ నం చేసుకుని తదుపరి విచారణ నిమిత్తం లంగర్హౌస్ పోలీసులకు అప్పగించారు.
నాంపల్లిలో సర్దార్ మెడికల్ హాల్ నిర్వహించే మహ్మద్ అబ్దుల్ హఫీజ్, అందులో సేల్స్ మెన్గా పనిచేసే ఓల్డ్మలక్పేట్కు చెందిన షేక్ జిలాని, నాంపల్లికి చెందిన వ్యాపారి మహ్మద్ బిన్ సలీమ్లు రెమ్డిసివిర్ ఇంజక్షన్ బ్లాక్లో విక్రయించేందుకు ప్లాన్ వేశారు. అవసరం ఉన్నవారికి ఒక్కో ఇంజక్షన్ను రూ.23వేలకు విక్రయిస్తున్నారు. ఈ క్రమంలోనే ముగ్గురు కలిసి నాంపల్లిలోని ముర్గి మార్కెట్ వద్దకు హోండా యాక్టివా(టీఎస్13ఈఆర్0706)పై వచ్చి విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ జావెద్ బృందానికి విశ్వసనీయ సమాచారం అందడంతో ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారించగా వారి వద్ద 4 ఇంజక్షన్లు లభించాయి. ఈ మేరకు ముగ్గురిని అరెస్ట్ చేసి, ఇంజక్షన్లు, హోండా యాక్టివాను స్వాధీనం చేసుకుని కేసును విచారణ నిమిత్తం హబీబ్నగర్ పోలీసులకు అప్పగించారు.
రెమ్డిసివిర్ ఇంజెక్షన్ను అధిక ధరకు విక్రయిస్తున్న నిందితులను బోయిన్పల్లి పోలీసులు అరెస్టు చేశారు. ఇన్స్పెక్టర్ రవికుమార్ కథనం ప్రకారం.. రాంపురంకు చెందిన ఎం.మధుగౌడ్(25), నాగారంకు చెందిన జి.సాయిచంద్ (20), పూర్ణోదయకాలనీకి చెందిన ఐ.సురేశ్(40) ఎల్బీనగర్కు చెందిన సైదులు (31) బోయిన్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని మిలిటరీ డెయిరీఫామ్ రోడ్డులో రెమ్డిసివిర్ ఇంజెక్షన్లను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. డ్రగ్ ఇన్స్పెక్టర్లు దినేశ్కుమార్, రాజారెడ్డిలతో కలిసి డైరీఫారం రోడ్డులో తనిఖీలు చేపట్టి.. అనుమానాస్పదంగా తిరుగుతున్న వారిని అదుపులోకి తీసుకొని విచారించారు. ఒక్కో రెమ్డిసివిర్ ఇం జెక్షన్ను రూ.21 వేలకు విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు వారి నుంచి నాలుగు ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.