చెరువులో గల్లంతు
పరిగి టౌన్ : చేపల వేటకు వెళ్లిన ఓ వ్యక్తి చెరువులో గల్లంతైన ఘటన పరిగి పోలీస్టేషన్ పరిధిలోని మిట్టకోడురు గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి కుటుంబీకులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కాకి ప్రభు (35), మల్లేశ్, రమేశ్, నర్సింలుతో కలిసి సోమవారం సాయంత్రం గ్రామ సమీపంలో ఉన్న చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లి చెరువులో వలలు కట్టి వచ్చారు. మంగళవారం ఉదయం చేపల కోసం వలలు కట్టిన వారిలో ముగ్గురు వెళ్లగా గట్టుపై కాకి ప్రభు చెప్పులు, బట్టలు కనిపించాయి. దీంతో వారు కాకి ప్రభు కుటుంబ సభ్యులకు విషయాన్ని తెలియజేశారు.
సోమవారం రాత్రి 11 గంటల సమయంలో చేపల కోసం చెరువు వద్ద వలలు కట్టామని వెళ్లి వస్తానని ఇంట్లో నుంచి వెళ్లాడని వారు వివరించారు. ప్రభుకు భార్య సుమిత్ర, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యులు పరిగి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు గ్రామస్తులతో కలిసి చెరువులో గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో గాలింపు చర్యలకు అంతరాయం ఏర్పడిందని ఎస్సై క్రాంతికుమార్పాటిల్ తెలిపారు.